P.Venkateswara Rao
520 views
IND vs ZIM: #🏏క్రికెట్ 🏏 #t 20 world cup 2026 *జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. ఇక తేలాల్సింది అక్కడే❗* Uppala Shivaprasad February 26, 2026🏏 ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా దుమ్మురేపింది. జింబాబ్వేతో గురువారం చెన్నై వేదికగా జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోగా.. జింబాబ్వే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. బ్యాటింగ్‌లో టాప్-6 బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలింగ్‌లో అర్ష్‌దీప్ సింగ్ సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 256 పరుగుల భారీ స్కోర్ చేసింది. హార్దిక్ పాండ్యా(23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 నాటౌట్), అభిషేక్ శర్మ(30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55) మెరుపు హాఫ్ సెంచరీలతో రాణించగా.. తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్), ఇషాన్ కిషన్(24 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 38), సూర్యకుమార్ యాదవ్(23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగర్వా, బ్రెస్సింగ్ ముజుర్బాని, మపోసా, సికిందర్ రాజా తలో వికెట్ తీసారు. అనంతరం జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగులు చేసి ఓటమిపాలైంది. బ్రియాన్ బెన్నిట్(59 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 నాటౌట్)తన జోరు కొనసాగించగా.. కెప్టెన్ సికిందర్ రాజా(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(3/22) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ, అక్షర్ పటేల్, శివమ్ దూబే చెరో వికెట్ తీసారు. రఫ్ఫాడించిన పేసర్లు.. భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే తమ ఇన్నింగ్స్‌ను నిదానంగా ప్రారంభించింది. భారత పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే ఓపెనర్లు బ్రియన్ బెన్నెట్, ముర్మణి ఆచితూచి ఆడారు. దాంతో పవర్ ప్లేలో ఆ జట్టు వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. జిడ్డుగా ఆడుతున్న మరుమణి(20)ని అక్షర్ పటేల్ ఔట్ చేయగా.. డియన్ మేయర్స్(6)ను వరుణ్ చక్రవర్తీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన సికిందర్ రాజాతో కలిసి బెన్నెట్ చెలరేగారు. భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో బెన్నెట్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించిన అనంతరం సికిందర్ రాజాను అర్ష్‌దీప్ సింగ్ ఔట్ చేశాడు. అదే ఓవర్‌లో ర్యాన్ బర్ల్(0)ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. తన మరుసటి ఓవర్‌లో టోనీ(11)ని క్లీన్ బౌల్డ్ చేసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. ఆఖరి ఓవర్‌లో శివమ్ దూబే.. భారీ సిక్సర్లు సమర్పించుకున్నా.. తషింగాను ఔట్ చేశాడు.