S.HariBlr (Bangalore)
627 views
#😇My Status #అన్నం పరబ్రహ్మ స్వరూపం *ఆహారాన్ని నిందించరాదు.* *'అన్నమయములైనవన్ని జీవమ్ములు.. కూడు లేక జీవకోటి లేదు' అన్నారు కాలజ్ఞాన కర్త శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.* *మన ప్రాచీనులు అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా కీర్తించారు. ఆధునికత ఎల్లెడలా వ్యాపించిన నేటి సమాజంలో అన్నాన్ని వృథా చెయ్యడం ఒక అలవాటుగా మారింది. అన్నాన్ని నిందించడం, వృథా చెయ్యడం పాపకార్యాలుగా ఉపనిషత్తులు ఉద్బోధించాయి. త్తెత్తిరీయ ఉపనిషత్తులోని భృగువల్లిలో భృగువు వరుణదేవుడిని బ్రహ్మం గురించి తెలుపమన్నప్పుడు.. "అన్నమే బ్రహ్మము, అన్నం నుంచే సమస్తం ఉద్భవిస్తుంది, అన్నముచే పోషించబడుతుంది, తిరిగి అన్నములోకే చేరుతుంది.” అని చెప్పాడు వరుణుడు. అంతేకాదు.. "అన్నాన్ని నిందించరాదు. అదే ప్రతిజ్ఞ, అన్నమే ప్రాణం. శరీరం అన్నాన్ని స్వీకరిస్తుంది. శరీరం ప్రాణాన్ని ఆశ్రయించుకుని ఉంటే ప్రాణం శరీరాన్ని ఆశ్రయించి ఉంటుంది. అనగా అన్నము అన్నమునే ఆశ్రయించుకుని ఉంటుందని అర్థం. ఇట్టి అన్నవైభవాన్ని తెలుసుకున్నవాడు అన్నమును కలిగి ఉండి గొప్ప ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడై వెలుగొందుతాడు” అని ప్రబోధించాడు.* *మన పళ్లెంలో ఉన్న ఆహారం వెనుక భూమాత, సముద్రం, మేఘాలు, వరుణదేవుడు, నదులు, వృషభాలు, వ్యవసాయ పనిముట్లు, ప్రకృతిలోని చిన్ని, చిన్ని ప్రాణులు, పచ్చని మొక్కలు, కూలీలు, వ్యాపారులు, యజమాని, తల్లిదండ్రులు మొదలైనవారి సహాయ, సహకారాలు, వీటన్నిటికి మించి ఆరుగాలం శ్రమించే రైతన్న కష్టం దాగుందని సదా స్మరణలో ఉంచుకుంటే ఆహారాన్ని నిందించడం కానీ, వృథా చెయ్యడం కానీ చెయ్యం. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆహారాన్ని వృథా చెయ్యడాన్ని దేశ వనరుల వృథాగానే భావించి జాగరూకతతో నడుచుకుంటారు. కానీ మన దేశంలో ఒకవైపు ఎంతో మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువ ఉండి ఆహార కొరత ఎదుర్కొంటుంటే మరో పక్క హంగూ, ఆర్భాటాల కోసం ఆహారాన్ని వృథా చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. అటువంటి వారికి కనువిప్పు కలిగించేలా తిరుక్కురళ్ రచయిత, మహాజ్ఞాని అయిన తిరువళ్లువర్ కి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది.* *వివాహమైన కొత్తలో తిరువళ్లువర్ భార్యతో.. తనకు భోజనం వడ్డించేటప్పుడు విస్తరి పక్కనే ఒక సూదిని కూడా ఉంచమన్నారట. భర్త అలా ఎందుకు చెయ్యమన్నారో ఆమెకు అర్థం కాలేదు. అయినా, ఆయన ఆజ్ఞ మేరకు ఆమె రోజూ విస్తరి పక్కనే ఒక సూదిని ఉంచేది. దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకునేందుకు.. తినేటప్పుడు ఆయన దానితో ఏమి చేస్తారా అని ఎదురుచూసేదట. కానీ తిరువళ్లువర్ ఏనాడూ ఆ సూదిని వినియోగించింది లేదు. అలా అలా అవసానకాలం వచ్చేవరకూ ఈ తీరే సాగింది. ఇక చివరకు ఉండబట్టలేక ఒక రోజు ఆమె.. 'ఆర్యా! భోజనం చేసే సమయంలో ఈ సూది ఎందుకో చెప్పండి' అని భర్తను అభ్యర్థించింది. అప్పుడాయన నవ్వుతూ ఆమెతో.. 'నువ్వు వడ్డించే సమయంలోగానీ, నేను తినే సందర్భంలోగానీ ఒక్క మెతుకు కిందపడ్డా ఆ సూదితో తీసి నీటిలో కడిగి తినేందుకే అలా చెయ్యమన్నారు. కానీ ఆ అవసరమే ఎప్పుడూ రాలేదు. నువ్వు అంత శ్రద్ధాళువై వడ్డించావు. ఆహారాన్ని వృథా చెయ్యడం పాపం, అటువంటి పాపకార్యం పొరపాటున జరిగినా దాన్నుంచి తప్పించుకునేందుకే ఈ ఏర్పాటు' అన్నారట. ఆహారవృథాను అరికట్టి వనరులను కాపాడుకోవడం, ఆకలితో అలమటించే అభాగ్యులకి పట్టెడన్నం దొరికేలా చెయ్యడం కన్నా సిసలైన దైవకార్యం ఉంటుండా చెప్పండి.* ꧁అన్నమే బ్రహ్మము꧂ *ఆధ్యాత్మిక అన్వేషకులు* 🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁