#🕉️ గణపతి బప్పా మోరియా #🎶భక్తి పాటలు🔱 #🇮🇳 మన దేశ సంస్కృతి #📙ఆధ్యాత్మిక మాటలు
11-03-2026 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - స్మృతియాత్రలో రేస్ చేసినట్లయితే పుణ్యాత్మగా అయిపోతారు, స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది’’
ప్రశ్న:-బ్రాహ్మణ జీవితములో ఒకవేళ అతీంద్రియ సుఖము అనుభవమవ్వకపోతే ఏమని భావించాలి?
జవాబు:-తప్పకుండా సూక్ష్మముగా అయినా సరే ఏదో ఒక పాపము జరుగుతుందని భావించాలి. దేహాభిమానములో ఉన్నట్లయితేనే పాపాలు జరుగుతాయి, దాని కారణముగా ఆ సుఖపు అనుభూతిని పొందలేరు. తమను తాము గోప-గోపికలుగా భావిస్తూన్నా సరే అతీంద్రియ సుఖపు అనుభూతి కలగటము లేదంటే, తప్పకుండా ఏదో తప్పు జరుగుతూ ఉంది, అందుకే తండ్రికి సత్యము చెప్పి శ్రీమతము తీసుకుంటూ ఉండండి.
ఓంశాంతి. నిరాకార భగవానువాచ. ఇప్పుడు నిరాకార భగవంతుడు అని శివుడినే అంటారు. భక్తి మార్గములో వారికి ఎన్ని పేర్లను పెట్టారు, అనేక పేర్లున్నాయి కావుననే ఇంత విస్తారముంది. తండ్రి స్వయంగా వచ్చి తెలియజేస్తున్నారు - ఓ పిల్లలూ, మీ తండ్రినైన, శివుడినైన నన్ను మీరు - ఓ పతితపావనా అని స్మృతి చేస్తూ వచ్చారు. పేరైతే తప్పకుండా ఒకటే ఉంటుంది. అనేక పేర్లు ఉండజాలవు. శివాయ నమః అని అంటున్నారంటే, ఒక్క శివ అన్న పేరే అన్నట్లు. రచయిత కూడా ఒక్కరే అన్నట్లు. అనేక పేర్లు ఉన్నట్లయితే తికమకపడతారు. ఉదాహరణకు మీ పేరు పుష్ప అనుకోండి, దానికి బదులుగా మిమ్మల్ని షీలా అని పిలిస్తే మీరు రెస్పాండ్ అవుతారా? అవ్వరు. ఇంకెవరినో పిలుస్తున్నారని భావిస్తారు. ఇది కూడా అలాంటి విషయమే. వారి పేరు ఒక్కటే కానీ భక్తి మార్గమున్న కారణముగా, చాలా మందిరాలను నిర్మించిన కారణముగా రకరకాల పేర్లను పెట్టేసారు. లేదంటే ప్రతి ఒక్కరికీ ఒక పేరే ఉంటుంది. గంగా నదిని, యమునా నది అని అనరు. ఏ వస్తువుకైనా ఒక్క పేరే ప్రసిద్ధమవుతుంది. ఈ శివ అన్న పేరు కూడా ప్రసిద్ధమైనది. శివాయ నమః అని అంటూ ఉంటారు. బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః అని అంటారు, ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అని అంటారు, ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైనవారు. ఉన్నతోన్నతమైనవారు అని నిరాకారుడిని అంటారని మనుష్యుల బుద్ధిలో ఉంటుంది. వారి పేరు ఒక్కటే. బ్రహ్మాను బ్రహ్మా అని, విష్ణువును విష్ణువనే అంటారు. అనేక పేర్లు పెట్టినట్లయితే తికమకపడతారు. అలా చేస్తే రెస్పాంస్ కూడా లభించదు మరియు వారి రూపము గురించి కూడా తెలియదు. తండ్రి వచ్చి పిల్లలతోనే మాట్లాడుతారు. శివాయ నమః అని అంటారు కావున ఆ ఒక్క పేరు సరిపోతుంది. శివ శంకర అని అనడము కూడా తప్పు అవుతుంది. ఏ విధముగా లక్ష్మీ-నారాయణ అన్న పేర్లు వేర్వేరో, అలా శివుడు, శంకరుడు అన్న పేర్లు వేర్వేరు. అక్కడ నారాయణుడిని లక్ష్మీనారాయణ అని అనరు. ఈ రోజుల్లోనైతే స్వయానికి రెండేసి పేర్లు కూడా పెట్టుకుంటారు. దేవతలకు ఈ విధముగా డబల్ పేర్లు ఉండేవి కావు. రాధ పేరు వేరు, శ్రీకృష్ణుని పేరు వేరు, ఇక్కడైతే ఒకరికే రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ అన్న పేర్లను పెట్టేస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - రచయిత ఒక్కరే, వారి పేరు కూడా ఒక్కటే. వారినే తెలుసుకోవాలి. ఆత్మ ఒక నక్షత్రము వంటిదని, భృకుటి మధ్యలో మెరిసే నక్షత్రము వంటిదని అంటారు, మళ్ళీ ఆత్మనే పరమాత్మ అని అంటారు. అంటే పరమాత్మ కూడా నక్షత్రమైనట్లే కదా. ఆత్మ చిన్నదిగా లేక పెద్దదిగా అవుతుందని కాదు. ఈ విషయాలు చాలా సహజమైనవి.
తండ్రి అంటారు, మీరు ఓ పతిత-పావనా రండి అని పిలిచేవారు. కానీ వారు పావనముగా ఎలా తయారుచేస్తారు, ఇది ఎవ్వరికీ తెలియదు. గంగను పతిత-పావనిగా భావిస్తారు. పతిత-పావనుడు అయితే ఒక్క తండ్రియే. తండ్రి అంటారు, మన్మనాభవ, నన్నొక్కరినే స్మృతి చేయండి అని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. కేవలం పేరు మార్చేసారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వము దానంతటదే లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. మన్మనాభవ అని చెప్పవలసిన అవసరము కూడా లేదు. కానీ తండ్రిని మరియు వారసత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు, అందుకే - తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని చెప్తాను. తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేసినట్లయితే మనకు స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. కొడుకు జన్మించగానే వారసుడు వచ్చాడని తండ్రి అంటారు. కూతురు కోసం ఇలా అనరు. ఆత్మలైన మీరందరూ అయితే కొడుకులే. ఆత్మ ఒక నక్షత్రము వంటిదని అంటారు కూడా. మరి అటువంటప్పుడు అంగుష్టము వలె ఎలా ఉండగలదు. ఆత్మ ఎంతో సూక్ష్మమైనది, దానిని ఈ కళ్ళతో చూడలేము. అయితే, దానిని దివ్యదృష్టితో చూడగలము ఎందుకంటే అది అవ్యక్తమైనది. దివ్యదృష్టితో చైతన్యముగా కనిపించినట్లు కనిపిస్తుంది, మళ్ళీ మాయమైపోతుంది. కానీ దాని వలన ఏమీ లభించదు, కేవలం సంతోషపడతారు. దానిని భక్తి యొక్క అల్పసుఖము అని అంటారు. అది భక్తి ఫలము. ఎవరైతే చాలా భక్తి చేసారో, వారికి ఆటోమెటిక్ గా, నియమానుసారముగా ఈ జ్ఞానము ద్వారా ఫలము లభించడము జరుగుతుంది. బ్రహ్మా మరియు విష్ణువులను కలిపి చూపిస్తారు. బ్రహ్మా నుండి విష్ణువుగా అవుతారు. భక్తికి ఫలముగా రాజ్యాధికారమనేది విష్ణువు రూపములో లభిస్తుంది. విష్ణువు మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారాలైతే చాలానే కలిగి ఉంటాయి. కానీ రకరకాల నామ-రూపాలకు భక్తి చేసారని అర్థం చేసుకోవడము జరుగుతుంది. సాక్షాత్కారాన్ని యోగము లేక జ్ఞానమని అనరు. నవ విధ భక్తి ద్వారా సాక్షాత్కారాలు కలిగాయి. ఇప్పుడు సాక్షాత్కారాలు కలగకపోయినా పర్వాలేదు. మనుష్యుల నుండి దేవతలుగా తయారవ్వడమే లక్ష్యము-ఉద్దేశ్యము. మీరు దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా అవుతారు. ఇకపోతే పురుషార్థము చేయించేందుకని తండ్రి అంటారు, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి, దేహము నుండి కూడా తొలగించి తండ్రిని స్మృతి చేయండి. ఉదాహరణకు ప్రేయసీ-ప్రియులకు పనులు చేసుకుంటూన్నా కూడా మనసు ప్రియుని వైపు జోడించబడి ఉంటుంది. తండ్రి కూడా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి, అయినా బుద్ధి వేరే వైపులకు పరుగెడుతుంది. మనకు దిగిపోవడానికి ఒక కల్పము పట్టిందని ఇప్పుడు మీకు తెలుసు. సత్యయుగము నుండి మొదలుకుని మెట్లు దిగుతారు. కొద్దికొద్దిగా మాలిన్యము చేరుతూ ఉంటుంది. సతో నుండి తమోగా అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు తమో నుండి సతోగా అయ్యేందుకు తండ్రి జంప్ చేయిస్తారు. క్షణములో తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవుతారు.
మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థము చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే శిక్షణను ఇస్తూనే ఉంటారు. నిజముగా చాలా కష్టమే అని మంచి-మంచి తెలివైన పిల్లలు స్వయంగా అనుభవం చేస్తారు. కొంతమంది చెప్తారు, కొంతమందైతే అసలేమీ చెప్పరు. తమ అవస్థ గురించి తెలియజేయాలి. తండ్రిని స్మృతే చేయకపోతే ఇక వారసత్వము ఎలా లభిస్తుంది. నియమానుసారముగా స్మృతి చేయరు, మేమైతే శివబాబాకు చెందినవారిమే అని భావిస్తారు. స్మృతి చేయకపోవడము వలన పడిపోతారు. తండ్రిని నిరంతరము స్మృతి చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది, అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది. ఎప్పటివరకైతే శరీరము ఉంటుందో, అప్పటివరకు పురుషార్థము కొనసాగుతూనే ఉంటుంది. స్మృతిని పదే-పదే మర్చిపోతున్నారని బుద్ధి కూడా చెప్తుంది. ఈ యోగబలముతో మీరు రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు. అందరూ ఒకేలా పరుగు పెట్టలేరు, నియమము అలా లేదు. రేస్ లో కూడా కొంత తేడా ఉంటుంది. నంబర్ వన్ ఉంటారు, ఆ తర్వాత ప్లస్ లోకి వస్తారు. ఇక్కడ కూడా పిల్లల రేస్ జరుగుతుంది. ముఖ్యమైన విషయము స్మృతి చేయడము. మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నారనైతే మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పాపము చేస్తే అది వంద రెట్లు అయిపోతుందని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు. పాపము చేస్తూ కూడా చెప్పనివారు చాలామంది ఉన్నారు. అప్పుడిక అది వృద్ధి అవుతూ ఉంటుంది. ఇక చివరిలో ఫెయిల్ అయిపోతారు. చెప్పడానికి సిగ్గుపడతారు. సత్యము చెప్పకపోతే స్వయాన్నే మోసగించుకుంటారు. మా ఈ విషయాన్ని బాబా వింటే ఏమంటారో అని కొందరికి భయము కలుగుతుంది. కొందరైతే చిన్న తప్పును కూడా వినిపించడానికి వచ్చేస్తారు. కానీ బాబా అటువంటివారికి చెప్తున్నారు, పెద్ద-పెద్ద తప్పులను అయితే చాలా మంచి-మంచి పిల్లలు చేస్తారు, మంచి-మంచి మహారథులను కూడా మాయ వదిలిపెట్టదు, మాయ శక్తిశాలిగా ఉన్నవారినే చక్రములోకి తీసుకువస్తుంది, ఇందులో ధైర్యవంతులుగా అవ్వవలసి ఉంటుంది. అబద్ధము నడవదు. నిజము చెప్పినట్లయితే తేలికవుతారు. బాబా ఎంతగా అర్థం చేయించినా కానీ, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అనేక రకాల విషయాలు ఉంటాయి. ఇప్పుడు బాబా నుండి రాజ్యాన్ని తీసుకోవాలి కావున బాబా అంటారు, బుద్ధిని వేరే వైపుల నుండి తొలగించండి. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది, 5 వేల సంవత్సరాల క్రితం భారత్ స్వర్గముగా ఉండేది. మీరు మీ జన్మల గురించి కూడా తెలుసుకున్నారు. కొందరికి అంగవైకల్యముతో జన్మ కలుగుతుంది, వారిని డిఫెక్టెడ్ అని అంటారు. తమ కర్మల అనుసారముగానే అలా జరుగుతుంది. ఇకపోతే, మనుష్యులైతే మనుష్యులుగానే జన్మ తీసుకుంటారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఒకటేమో, పవిత్రముగా ఉండాలి, రెండవది, అబద్ధాలు, పాపాలు ఏమీ చేయకూడదు. లేదంటే చాలా నష్టము కలుగుతుంది. చూడండి, ఒకతని ద్వారా చిన్న తప్పు జరిగింది, అతను బాబా వద్దకు వచ్చి, బాబా క్షమించండి, ఇంకెప్పుడూ ఇలాంటి పని చేయను అని చెప్పారు. బాబా అన్నారు, ఇలాంటి తప్పులు చాలామంది ద్వారా జరుగుతూ ఉంటాయి, నీవైతే సత్యము చెప్పావు, కొంతమందైతే కనీసం వినిపించరు కూడా. కొంతమంది ఫస్ట్ క్లాస్ కుమార్తెలు ఉన్నారు, వారి బుద్ధి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళదు. ఉదాహరణకు బొంబాయిలో డాక్టర్ నిర్మల ఉన్నారు, వారు నంబర్ వన్. వారిది పూర్తిగా స్వచ్ఛమైన మనసు, ఎప్పుడూ మనసులో తప్పుడు ఆలోచనలు రావు, అందుకే వారు బాబా హృదయాన్ని అధిరోహించారు. ఇలాంటి కుమార్తెలు ఇంకా ఉన్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, కేవలం సత్యమైన మనసుతో తండ్రిని స్మృతి చేయండి. కర్మలైతే చేయవలసిందే. బుద్ధియోగము తండ్రితో జోడింపబడి ఉండాలి. చేతులు పనివైపు, మనసు ప్రియుని వైపు ఉండాలి. ఈ అవస్థ చివరిలో ఏర్పడుతుంది. ఈ అవస్థను పొందినవారి గురించే గాయనము చేస్తారు, అతీంద్రియ సుఖము గురించి గోప-గోపికలను అడగండి అని. వారు ఈ అవస్థను పొందుతారు. ఎవరైతే పాప కర్మలు చేస్తారో, వారికి ఈ అవస్థ తయారవ్వదు. బాబాకు చాలా బాగా తెలుసు, అందుకే భక్తి మార్గములో కూడా మంచి లేక చెడు కర్మల ఫలము లభిస్తుంది. ఇచ్చేవారైతే తండ్రియే కదా. ఎవరైనా ఎవరికైనా దుఃఖము ఇస్తే, వారు తప్పకుండా దుఃఖము అనుభవిస్తారు. ఎటువంటి కర్మలు చేసారో, ఆ విధముగా అనుభవించవలసిందే. ఇక్కడైతే తండ్రి స్వయం హాజరై ఉన్నారు కావున వారు అర్థం చేయిస్తూ ఉంటారు, అయినా కూడా ఇది గవర్నమెంట్, ధర్మరాజు నాతో పాటు ఉన్నారు కదా. ఈ సమయములో నా నుండి ఏదీ దాచి పెట్టకండి. బాబాకు తెలుసులే, మేము శివబాబా నుండి మనసులో క్షమాపణలు కోరుకుంటాము అని అనుకోకండి, ఏమీ క్షమింపబడదు. ఎప్పుడూ ఎవరి పాపము దాగి ఉండదు. పాపము చేసినట్లయితే రోజురోజుకు పాపాత్ములుగా అవుతూ ఉంటారు. భాగ్యములో లేకపోతే ఇక అలాగే జరుగుతుంది. రిజిస్టర్ పాడైపోతుంది. ఒక్కసారి అబద్ధము చెప్తే, నిజము చెప్పకపోతే, ఇక అలాంటి పనులు చేస్తూనే ఉంటారేమోనని భావించడము జరుగుతుంది. అబద్ధము ఎప్పుడూ దాగి ఉండదు. అయినా కూడా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఒక పైసను దొంగతనము చేసినా లక్ష రూపాయలు దొంగతనము చేసినదానితో సమానమని అంటారు, అందుకే నా ద్వారా ఈ దోషము జరిగిందని చెప్పాలి కదా. బాబా అడిగినప్పుడు తప్పు జరిగిందని చెప్తారు, మీ అంతట మీరే ఎందుకు చెప్పరు. చాలామంది పిల్లలు దాచిపెడతారని బాబాకు తెలుసు. తండ్రికి వినిపించినట్లయితే శ్రీమతము లభిస్తుంది. ఎక్కడి నుండైనా ఉత్తరము వస్తే, ఏమని జవాబివ్వాలో అడగండి. వినిపించినట్లయితే శ్రీమతము లభిస్తుంది. చాలామందిలో ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే, వారు దానిని దాచిపెడతారు. కొంతమందికి లౌకిక ఇంటి నుండి కొన్ని లభిస్తాయి. వేసుకోమని బాబా చెప్తే, అప్పుడు బాబా బాధ్యులవుతారు. అవస్థను చూసి కొంతమందికి యజ్ఞానికి పంపించమని చెప్తాను. దానిని మీకు మార్చి ఇచ్చినట్లయితే మంచిది, లేదంటే అదే గుర్తుకొస్తూ ఉంటుంది. బాబా చాలా అప్రమత్తము చేస్తారు. మార్గము చాలా ఉన్నతమైనది. అడుగడుగునా సర్జన్ సలహాను తీసుకోవాలి. ఉత్తరాన్ని కూడా ఈ విధముగా వ్రాసినట్లయితే బాణము తగులుతుందని బాబా శిక్షణయే ఇస్తారు, కానీ చాలామందిలో దేహాభిమానముంది. శ్రీమతముపై నడవకపోతే తమ ఖాతాను పాడు చేసుకుంటారు. శ్రీమతముపై నడుచుకున్నట్లయితే ఎట్టి పరిస్థితిలోనూ లాభమే ఉంటుంది. మార్గము ఎంత సహజమైనది. కేవలం స్మృతి ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. వృద్ధ మాతలకు కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయమని చెప్తారు. ప్రజలను తయారుచేసుకోకపోతే రాజా-రాణిగా కూడా అవ్వలేరు, కానీ ఎంతైనా దాచిపెట్టే వారికన్నా అయితే ఉన్నత పదవిని పొందగలరు. అర్థం చేయించడము తండ్రి బాధ్యత. ఇక తర్వాత మాకు తెలియదని అనే విధముగా ఉండకూడదు. బాబా అన్ని డైరెక్షన్లను ఇస్తారు. తప్పును వెంటనే తెలియజేయాలి. పర్వాలేదు, మళ్ళీ చేయకండి. ఇందులో భయపడే విషయమేమీ లేదు. ప్రేమగా అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రికి చెప్పడములో కళ్యాణముంది. తండ్రి బుజ్జగించి ప్రేమగా అర్థం చేయిస్తారు. లేదంటే హృదయము నుండి ఒక్కసారిగా పడిపోతారు. వీరి హృదయము నుండి పడిపోయినట్లయితే శివబాబా హృదయము నుండి కూడా పడిపోయినట్లే. మేము డైరెక్ట్ గా శివబాబా నుండి తీసుకోగలమని అనుకోకండి, అలా ఏమీ జరుగదు. తండ్రిని స్మృతి చేయమని ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారో, అంతగా బుద్ధి బయట వైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ తండ్రి డైరెక్ట్ గా కూర్చుని అర్థం చేయిస్తారు, ఇవే తర్వాత శాస్త్రాలుగా తయారవుతాయి. వాటిలో గీతయే భారత్ యొక్క సర్వోత్తమమైన శాస్త్రము. సర్వశాస్త్రమయి శిరోమణి గీత, దానిని భగవంతుడు వినిపించారు అని అంటూ ఉంటారు కూడా. మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. గీత తల్లి-తండ్రి అయితే మిగిలినవన్నీ పిల్లలు. గీతలోనే భగవానువాచ ఉంది. శ్రీకృష్ణుడినైతే దైవీ సాంప్రదాయానికి చెందినవారని అంటారు. దేవతలు అంటే కేవలం బ్రహ్మా, విష్ణు, శంకరులు మాత్రమే. భగవంతుడైతే దేవతల కంటే కూడా ఉన్నతమైనవారు. బ్రహ్మా-విష్ణు-శంకరులు, ముగ్గురినీ రచించేవారు శివుడు. ఇది పూర్తిగా స్పష్టముగా ఉంది. బ్రహ్మా ద్వారా స్థాపన జరుగుతుంది, శ్రీకృష్ణుని ద్వారా స్థాపన జరుగుతుందని ఎప్పుడూ అనరు. బ్రహ్మా రూపాన్ని చూపించారు. దేని స్థాపన? విష్ణుపురి యొక్క స్థాపన. ఈ చిత్రమైతే మనసులో ముద్రింపబడిపోవాలి. మనము శివబాబా నుండి వీరి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి లేకపోతే తాతగారి ఆస్తి లభించదు. ఎప్పుడైనా ఎవరైనా కలిసినప్పుడు ఇలా చెప్పండి, నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు అని. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. గమ్యము చాలా ఉన్నతమైనది, అందుకే అడుగడుగులోనూ సర్జన్ నుండి సలహాను తీసుకోవాలి. శ్రీమతముపై నడవడములోనే లాభముంది, తండ్రి నుండి ఏదీ దాచి పెట్టకూడదు.
2. దేహము మరియు దేహధారుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి. కర్మలు చేస్తూ కూడా ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థము చేయాలి.
వరదానము:-సదా ఏకరసమైన సంపన్న మూడ్ లో ఉండే పురుషార్థీ సో ప్రారబ్ధీ స్వరూప భవ
బాప్ దాదా వతనము నుండి చూస్తూ ఉంటారు, కొంతమంది పిల్లల మూడ్ చాలా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆశ్చర్యకరమైన మూడ్, ఒక్కోసారి ప్రశ్నార్థక మూడ్, ఒక్కోసారి తికమకపడే మూడ్, ఒక్కోసారి టెన్షన్, ఒక్కోసారి అటెన్షన్ అనే ఊయల... కానీ సంగమయుగము ప్రారబ్ధపు యుగము, అంతేకానీ పురుషార్థపు యుగము కాదు. అందుకే తండ్రి గుణాలు ఏవైతే ఉన్నాయో అవే పిల్లల గుణాలు, తండ్రి స్టేజ్ ఏదైతే ఉందో అదే పిల్లలది - ఇదే సంగమయుగపు ప్రారబ్ధము. కావున సదా ఏకరసమైన, సంపన్నమైన ఒకే మూడ్ లో ఉండండి, అప్పుడు తండ్రి సమానమైనవారు అనగా ప్రారబ్ధ స్వరూపము కలవారు అని అంటారు.
స్లోగన్:-బాప్ దాదా చేతిలో బుద్ధి రూపీ చెయ్యి ఉన్నట్లయితే పరీక్షల రూపీ సాగరములో కదిలిపోరు.
అవ్యక్త ప్రేరణలు - ‘‘నిశ్చయమనే పునాదిని దృఢముగా చేసుకుని సదా నిర్భయులుగా, నిశ్చింతగా ఉండండి’’
విశ్వాసపాత్రుల మొదటి గుర్తు ఏమిటంటే - ప్రతి క్షణము, ప్రతి అడుగు శ్రీమతముపై ఏక్యురేట్ గా నడుచుకోవడము. ఏక్యురేట్ మూర్తిగా అవ్వడము అనగా ఉలిదెబ్బలు పడటము వంటిది. ఉలిదెబ్బలు వేసి-వేసి మూర్తిని సరి చేస్తారు. మీరైతే ఉలిదెబ్బలు తినటములో అనుభవజ్ఞులుగా అయిపోయారు, నథింగ్ న్యూ (కొత్తేమీ కాదు). ఆటలా అనిపిస్తుంది కదా. చూస్తూ ఉంటారు మరియు చిరునవ్వుతో ఉంటారు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. హీరో యాక్టర్ అనగా ఏక్యురేట్ పాత్రను అభినయించే నిశ్చయబుద్ధి నిశ్చింత ఆత్మ.
సూచన:- ఈ రోజు మనందరి అతి ప్రియమైన, బాప్ దాదా యొక్క కంటిరత్నము, తమ హృదయ సింహాసనముపై బాప్ దాదాను కూర్చోబెట్టుకున్న మధురమైన గుల్జార్ దాదీజీ యొక్క పుణ్య స్మృతి దివసము. ఈ సందర్భముగా బ్రాహ్మణ కుల భూషణులైన సోదరీ, సోదరులైన మనమందరము, వారి ద్వారా ప్రియమైన అవ్యక్త బాప్ దాదా యొక్క పాలన ఏదైతే మనకు లభించిందో, ఆ పాలనకు రిటర్న్ ఇచ్చే శుభ సంకల్పము చేద్దాము. ఏ విధముగా దాదీజీ ప్రతి అడుగు శ్రీమతమనుసారముగా ఏక్యూరేట్ గా నుడుచుకున్నారో, సదా తమ చిరునవ్వుతో కూడిన ముఖముతో అందరికీ ఆశీర్వాదాలను ఇచ్చారో మరియు తీసుకున్నారో, ఏక్యూరేట్ పాత్రను అభినయించారో, అలా మనమందరము వారి అడుగుజాడలలో నడిచి వారికి మన స్నేహ శ్రద్ధాంజలిని అర్పితము చేద్దాము, ఇదే వారి పట్ల మనము చూపించే సత్యమైన శ్రద్ధాంజలి. ఓం శాంతి.
"