#🌹🕉️ భక్తి సమాచారం 🕉️🌹 అరుణాచల👏
అరుణాచలం, తిరువన్నామలై
తమిళనాడు
నేను ఈ దేవాలయం, గిరి ప్రదక్షిణం గురించి 6 భాగాలుగా ఇస్తున్నాను. దయచేసి గమనించగలరు.
భాగము-1
అరుణాచలం లేదా "అన్నామలై" తమిళనాడు రాష్ట్రములో ఉంది. అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక. అరుణాచలము అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాలా గొప్ప పుణ్యక్షేత్రము. స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు.
మొదటిసారి అరుణాచలం వచ్చేవారికి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టడానికి చాలా సందేహాలు – గుడి దగ్గర నుంచే మొదలు పెట్టాలా? మేము డయాబెటిక్ వాళ్ళం – చెప్పులు లేకుండా నడవడం; ఆటో లో వెళ్ళడం తప్పా? వగైరా … మొదటిసారిగా ప్రదక్షిణం చేసే వారు అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం నుంచి మొదలు పెడితే అష్టలింగాల గుడులన్నీ అన్ని క్రమపద్ధతిలో వస్తాయి – అంటే ముందు తూర్పు ఇంద్రలింగం తో మొదలుపెట్టి, ఆఖరున ఈశాన్యలింగం వచ్చి, చివరగా తిరిగి అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం చేరుకోవడంతో ప్రదక్షిణ పూర్తవుతుంది. అందువల్ల ఈ బ్లాగ్ లో అదే వరుసప్రకారం విషయం రాయటం జరిగింది. ఎవరి అనుకూలతనిబట్టి వారు, ప్రారంభించిన చోటికి తిరిగి చేరుకుంటే అది కూడా ప్రదక్షిణే! అసలు అరుణాచలంలో గిరిప్రదక్షిణ ఎందుకు? ఏమిటి? ఎలా? ఇలాంటి సందేహాలకు ఈ అధ్యాయం చదవటం పూర్తి అయ్యేసరికి మీకు సమాధానాలు దొరుకుతాయి. చదవడం ద్వారా గిరిప్రదక్షణ అనుభూతి మీకు కలిగించే ప్రయత్నమిది. ముందుగా భగవాన్ రమణమహర్షి ప్రదక్షిణగురించి ఏం చెప్పారో తెలుసుకుంటూ ప్రారంభిద్దాము.
సూరినాగమ్మగారి ది 26-6-1949 లేఖ నుండి
కొత్తగావచ్చి ఇక్కడ కొంతకాలంగా ఉంటున్న భక్తులొకరు “ఇక్కడంతా తరచు గిరిప్రదక్షణం పెడుతూ ఉంటారు దాని మహిమ ఏమిటి” అని శ్రీవారినే అడిగారు. భగవాన్ వికసించిన ముఖంతో “ఈ గిరిప్రదక్షణ మహిమ అరుణాచల పురాణంలో ఎంతో అతిశయంగా చెప్పబడి ఉంది. నందీశ్వరుడు, సదాశివుని ఇదే విధంగా అడిగితే వారు ఈవిధంగా సెలవిచ్చారు.
“ఈ గిరిని ప్రదక్షిణిoచడం చాలా మంచిది. అసలు తత్వం ఇది .
ప్ర = సకల పాపాలను పోగొట్టడమూ,
ద= ఇష్ట ఫలాలను ఇవ్వడమూ,
క్షి= జన్మాంతరము నశించడమూ,
ణ = జ్ఞానముక్తిని ఇవ్వడమూ అని.
ఈ గిరికి ప్రదక్షిణంగా ఒక అడుగు పడితే భూలోక సుఖం, రెండడుగుల వల్ల స్వర్గ సుఖం , మూడు అడుగులు అయితే సత్యలోక ఆనందం పొందగలరని మౌనమో, ధ్యానమో, జపమో, సంకీర్తనమో ఏదో ఒక దైవ చింతనతో పోవాలనీ, నవమాసములు నిండిన గర్భిణీ స్త్రీ నడిచినట్లు నడవాలనీ, తపస్సు చేస్తున్న అంబ కృత్తికా నక్షత్రం నాటి ప్రదోష సమయంలో జ్యోతి దర్శనం అయిన వెంటనే, గిరి చుట్టివచ్చి తనలో ఐక్యం ఆయిందని ఇంకా ఎన్నో చెప్పారు . కడకు దీపోత్సవం అయిన మూడవనాడు భూతగణసహితంగా ఏటేటా తామే ప్రదక్షిణానికి బయలుదేరుతామనీ చెప్పారు . నిజంగా ఈ ప్రదక్షిణవల్ల కలిగే ఆహ్లాదం, సుఖం ఇంతని చెప్పడం శక్యం కాదు .
శరీరం అలసి పోయి ఇంద్రియచేష్టలకు బలంతగ్గి, సర్వవృత్తులూ అంతర్గతం కాగలవు. అట్లాగే మైమరిచి ధ్యానమగ్నతను పొందవచ్చును. నడుస్తూనే ఉండడం వల్ల శరీరం తానుగానే ఆసన పద్ధతిని అమరిపోతుంది. అందువల్ల శరీరానికి ఆరోగ్యం ఏర్పడుతుంది. అంతేగాక ఈ పర్వతం మీద బహువిధములైన ఓషధులున్నవి. ఆ ఓషధుల మీదుగా వచ్చే గాలి శ్వాసకోశాలకు చాలా మంచిది. బండ్లకు బస్సులకనీ నీ తప్పుకోవాల్సిన పనిలేదు. యధేచ్చగా నడవవచ్చును.
“మేము ప్రదక్షిణానికి వెళ్ళేరోజుల్లో భలే హుషారుగా ఉండేది. ఎప్పుడంటే అప్పుడే బయలదేరే వాళ్ళం. ఏదైనా పర్వడి వచ్చిందంటే ప్రదక్షిణానికి బయలుదేరి, ఎక్కడ ప్రొద్దెక్కిందనీ, అలసినామనీ తోస్తే, అక్కడే ఆగి, వంటచేసుకుని తినేవాళ్ళం. ఒకచోట ఉండాలని నిబంధన లేకుండా ఉంటే చింతే ఉండదు. ఈ రైళ్లు వచ్చిన వెనక ఇల్లా అయింది కానీ, పూర్వం కాలినడకనే క్షేత్రాటనం చేసేవారు. ఈవేళకు ఇక్కడ చేరాలనీ, ఇంతకాలం ఉండాలనీ నిర్ణయించుకుని బయలుదేరేవారు కారు. ‘కాశీకి పోయిన వారూ, కాటికి పోయినవారూ సమాన మన్న’ సామెత ఉండనే ఉంది కదా. తిరిగి రావాలని ఆశలేనివారే కాశీకి బయలదేరేవాళ్ళన్నమాట. కావడి కట్టుకొని, ధ్యానమగ్నులై నడుస్తూ, ఎక్కడ అలుపు తోస్తే, అక్కడ మజిలీ చేసుకొని మళ్ళీ బయలుదేరేవారు. వారు గ్రామంలో కాలు పెట్టే అవసరం లేకుండానే ఊరి వెలుపల ధర్మశాలలు ఉండేవప్పుడు. అవి లేని చోట్ల గుళ్ళూ,గుహలూ, చెట్లూ, గుట్టలూ అన్నీవారికి నివాస స్థానాలే. అన్యచింతన లేకుండా అట్లాగే పోతూ పోతూ ఆత్మలో లీనం అయ్యేవారన్నమాట.
గిరిప్రదక్షిణమూ అంతే. శరీరం తేలికపడి తానుగానే నడిచిపోతుంది. మనం నడుస్తున్నామన్న తలంపేఉండదు. కూర్చుంటే కుదరని ధ్యానం ప్రదక్షిణకి వెడితే కుదురుతుంది. ఆ ప్రదేశం, ఆ గాలీ అటువంటివి. ఎంత నడవలేనివారైనా ఒకసారి వచ్చి వెళ్లారంటే మళ్ళీ వెళ్లాలని బుద్ధి పుడుతుంది. వెళ్ళిన కొద్ది సరదా ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. ఆ ప్రదక్షిణ సుఖానికి అలవాటు పడితే మరి విడువలేరు సుమా.”
(పై లేఖ రమణాశ్రమ ప్రచురణ శ్రీరమణాశ్రమ లేఖలు పుస్తకం నుండి )
గిరిప్రదక్షిణ మొదలు పెట్టడం
అరుణాచలేశ్వరాలయం తూర్పువైపున వున్న రాజగోపురం ముందున్న అలంకారమండపం దగ్గర కర్పూరం వెలిగించి అరుణాచలేశ్వర ఆలయ గోపురానికి నమస్కరించి , రోడ్డు మీదికి వచ్చి కుడి వైపు నుంచి ప్రదక్షిణ ప్రారంభించాలి.అష్టలింగాల పొజిషన్, గిరి ప్రదక్షిణ దూరం సూచించే రూట్ మ్యాప్ ప్రదక్షిణ ప్రారంభించే చోట పెట్టారు. మనసులో నామం (అరుణాచలశివ, అరుణాచలశివ) చెప్పుకుంటూ ఇక్కడి నుంచి కుడివైపు పావు కిలో మీటర్ నడిస్తే చాలు, ఇంద్రలింగం వచ్చేస్తుంది. బిజీగా ఉండే బజార్ లో ఇరుకుగా, చిన్నదిగా, అసలు గుడి అంటే నమ్మేలా ఉండదు ఇంద్రలింగం . అక్కడవున్న బోర్డు మీద ఇంగ్లీషులో స్పెల్లింగ్ ‘INDIRA LINGAM’ అని ఉంటుంది. లోపలకు వెళ్లి చూద్దాం.
ఇంద్రలింగం చాలా చిన్నగుడి. లోపలి వెళ్లి ప్రదక్షిణ చేసి, దర్శనం చేసుకుని బయటకు రావటానికి ఇదునిముషాలకంటే సమయం పట్టదు.చాలామంది భక్తులు అష్టలింగాల గుడుల దగ్గిర గుడి ముందరకర్పూరం వెలిగించి, హారతి ఇచ్చి, తరువాత దర్శనం చేసుకుంటారు. అయితే ఇంద్రలింగం బజారులో వుండటం వలన ఒక్కోసారి కర్పూరం వెలిగించడానికి అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల నమస్కారంతో దర్శనం చేసుకుందాం. . అష్ట లింగాలలో మెదటిది ఇంద్రలింగం దర్శనం పూర్తయిన సందర్భంలో నామస్మరణ.
అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలశివ అరుణాచలా అరుణాచలశివ అరుణాచలశివ🙏