𝄟⃝💕 ⃪ͥ͢ ᭄ᷟ🇸‌𝗶𝗱𝗱𝘂🕊️
2.2K views
16 days ago
సంపూర్ణ రామాయణం - 40 వ రోజు శ్రీరామాయణ అధ్యయన చివరి రోజు కు వచ్చాము, అందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు, శ్రీ రామ నవమి రోజున పట్టాభిషేక ఘట్టం రావడం మన అదృష్టం అందరూ శ్రద్ధగా చదివి రామానుగ్రహం పొందండి. సీతమ్మ అగ్ని ప్రవేశం చేసిన సందర్బంలో ఒక్క అగ్ని దేవుడే కాదు పరమశివుడు, ఇంద్రుడు ఇతర దేవతలు కూడా అమ్మవారి పాతివ్రత్యం ప్రకటిస్తారు. 1. పరమశివుని ఆదేశం & దశరథుని ఆశీస్సులు సీతమ్మను స్వీకరించిన తర్వాత, సాక్షాత్తూ పరమశివుడు శ్రీరామునితో... "నీవు శ్రీమహావిష్ణువు అవతారానివని, ఇచ్చిన వాగ్దానము మేరకు పదకొండు వేల సంవత్సరములు రాజ్యపాలన చేసి, ఆ పిమ్మటనే అవతారమును చాలించవలసినది" అని కోరీ. ఆకాశంవైపు చూపుతూ పరమశివుడు "రామా! నీ తండ్రియైన దశరథుడు తన దివ్యరథంపై అధిరోహించి ఎలా నిరీక్షిస్తున్నాడో చూడు. కారుణ్యమూర్తివైన నీవలన ముక్తుడై ఆయన ఇప్పుడు ఇంద్రలోకంలో నివసిస్తున్నాడు. నిన్ను చూచేందుకే దశరథ మహారాజు ఇక్కడకు వచ్చాడు. కనుక శీఘ్రమే లక్ష్మణునితోపాటు వెళ్ళి ఆయనను తిరిగి కలుసుకో" అని చెప్పాడు. సీతా రామ లక్ష్మణులు వెళ్ళి దశరధుని దర్శించు కునీ ఆశీర్వాదం తీసుకున్నారు. 2. వానరుల పునర్జీవనం యుద్ధంలో మరణించిన వానర సైన్యాన్ని చూసి రామచంద్రుడు చింతిస్తారు. శ్రీరాముని కోరిక మేరకు దేవేంద్రుడు అమృత వర్షం కురిపించి, యుద్ధంలో వీరమరణం పొందిన వానరులందరినీ తిరిగి సజీవులను చేస్తాడు. అంతట దేవతలు తిరిగి వెళ్లగా వానరులు, రాముడు ఆ రాత్రికి అక్కడే గడిపారు. విభీషణుడు రాచ మర్యాదలు, రాజ లాంఛనాలు తెస్తే అవన్నీ వానరులకు ఇవ్వు భరతుని కలిసే వరకు నేను ఇవి ముట్టను అన్నాడు. 3. అయోధ్య వైపు ప్రయాణం విభీషణుడు శ్రీరాముడిని కొన్నాళ్ళు లంకలో అతిథిగా ఉండమని ప్రార్థిస్తాడు. కానీ, భరతుడు పెట్టిన గడువు (14 ఏళ్లు) ముగియవస్తోందని, తాను వెళ్లడం ఆలస్యమైతే భరతుడు ప్రాణత్యాగం చేస్తాడు నడిచి వెళితే చాలా సమయం పడుతుంది.ఏదైన ఏర్పాటు చేయి అని రాముడు తన ఆత్రుతను వివరిస్తాడు.అప్పుడువేగంగా వెళ్ళేలా విభీషణుడు పుష్పక విమానాన్ని సిద్ధం చేస్తాడు. 4. ఆకాశ మార్గంలో విహారం శ్రీరాముడు సీతాదేవిని, లక్ష్మణుడిని, సుగ్రీవ-విభీషణాది వానర ప్రముఖులను విమానంలో ఎక్కించుకుని అయోధ్యకు బయలుదేరుతారు. మార్గమధ్యంలో: * సేతువు (రామసేతు), తాను శివుణ్ణి ప్రసన్నం చేసుకున్న స్థలం(రామేశ్వర క్షేత్రం గురించి వివరిస్తూ ఇక్కడే రుద్రుడు నాకు ప్రత్యక్షం అయ్యాడు రుద్ర అనుగ్రహం తోనే నేను యుద్ధం గెలిచాను అంటాడు ఇతర పురాణాల్లో విశిష్టత వివరింప బడింది ఇక్కడ ప్రస్తావన ఉన్నది), అలాగే కిష్కింధ, దండకారణ్యం వంటి ప్రదేశాలను సీతమ్మకు చూపిస్తూ వాటి విశిష్టతను వివరిస్తారు. కిష్కింద లో ఉన్న స్త్రీలు కూడా మనతో వస్తె బాగుంటుంది అని సీతమ్మ అంటే అక్కడ విమానము ఆపి వారిని సిద్ధం అయి రమ్మని చెప్పాడు. * అలా భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. మహర్షి అయోధ్య క్షేమ సమాచారాలను తెలిపి, భరతుడు నీకోసం నార వస్త్రాలు ధరించి 14 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాడు అని చెప్పాడు రాముడి కోరిక మేరకు ఆశ్రమం నుండి అయోధ్య వరకు వానర సైన్యం కోసం దారిపొడవునా చెట్లను మధురమైన ఫలాలతో నింపమని అడిగాడు రాముడు. భరద్వాజుడు వెంటనే అనుగ్రహిస్తాడు. 5. హనుమంతుని రాయబారం రాముడు రాకముందే భరతుని మనోభావాలను తెలుసుకోవడానికి హనుమంతుడిని దూతగా పంపిస్తారు. హనుమంతుడు ముందుగా గుహుడికి, ఆ తర్వాత నందిగ్రామంలో తపస్సులో ఉన్న భరతుడికి రాముని విజయ వార్తను చేరవేస్తాడు. నేను తిరిగి వస్తున్నాను అన్నపుడు భరతుడి ముఖ కవళికలు ఎలా ఉన్నాయి బాగా గమనించు అన్నాడు రాముడు.ఒక వేళ రాజ్యం కోరితే నేను అడవిలోనే ఉండి పోతాను అన్నాడు. కానీ శ్రీరామ విజయం ఆగమన వార్త విన్న భరతుడు ఆనందపారవశ్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతాడు. రాముడి కోసం అన్ని ఏర్పాట్లు చేసిన పిదపభరతుడు రామపాదుకలను, ధవళశోభితమైన రాజఛత్రాన్ని, చామరాలను తీసుకొన్నాడు. అంతట పలువురు బ్రాహ్మణులు వెంటరాగా శంఖనాదాలు, దుందుభిధ్వానాల మధ్య తన కుటీరం నుండి వెలుపలకు వచ్చాడు. రాముడు వస్తున్నాడన్న వార్త క్షణాలమీద వ్యాపించింది. దాదాపుగా అయోధ్యాపుర జనాభా మొత్తం ఆయనను చూడాలని నంది గ్రామానికి తరలీ వచ్చారు. 6. భరత-రాముల కలయిక (నందిగ్రామం) పుష్పక విమానం నందిగ్రామానికి చేరుకుంటుంది.దివ్యవిమానం భూతలానికి దిగడంతోనే భరతుడు పరుగున వెళ్ళి ఆ రథంలోకి ఎక్కి తన అగ్రజునికి అభివాదాలు తెలిపాడు. రాముడు తక్షణమే తన ఆసనం మీదనుండిలేచి భరతుణ్ణి ఆలింగనం చేసుకొని తన అంకం మీదకు తీసుకున్నాడు. దివ్యప్రేమావేశంతో మృదులమైన హృదయంతోను, బాష్పపూరిత నయనాలతోను భరతుడు శ్రీరామచంద్రుణ్ణి సమీపించి అపరిమిత భక్తిపారవశ్యంతో ఆయన పాదాలపై పడ్డాడు. భరతుడు బాగా శుష్కించి ఉండటాన్ని శ్రీరామచంద్రుడు గమనించాడు. తాను లేనప్పుడు తన అనుజుడు గోమూత్రంలో ఉడికీ ఉడకని ఆహారాన్ని భుజిస్తూ, తన దేహాన్ని నారవస్త్రాలతో కప్పుకుంటూ, జటాజూటాలను ధరిస్తూ దర్భశయ్యపై పడుకొంటూ గడుపుతున్నాడని ఆయన విన్నాడు. అత్యంత కరుణార్ధ హృదయుడైన రాముడు ఇందుకు ఎంతగానో దుఃఖించాడు. అనంతరం భరతుడు లక్ష్మణుణ్ణి, సీతను ప్రశంసలతో ముంచెత్తుతూ వారికి అభివాదాలు తెలిపాడు. అంతట అతను సుగ్రీవుణ్ణి ఆలింగనం చేసుకొని అభివాదం తెలుపుతూ "మేము నలుగురమైనప్పటికీ, నీవిప్పుడు మాలో ఐదవ సోదరునివంటివాడవు" అన్నాడు. విమానం దిగి తల్లులకు నమస్కారం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.అంతట సీత, లక్ష్మణుడు తన వెంట రాగా శ్రీరామచంద్రుడు వేదవిదులైన బ్రాహ్మణులకు, కుటుంబంలోని పెద్దలకు తన సగౌరవ ప్రణామాలు సమర్పించగా అయోధ్యాపురవాసులంతా ప్రభువుకు గౌరవాంజలి ఘటించారు. దీర్ఘకాలపు వియోగానంతరం తమ రాజును చూడగానే అయోధ్యపురవాసులు ఆయనకు పుష్పమాలికలను సమర్పించి, అమితమైన ఆనందోత్సాహాలతో తమ ఉత్తరీయాలను ఊపారు. 14 ఏళ్లుగా రాముని పాదుకలనే సింహాసనంపై ఉంచి పాలించిన భరతుడు, ఆ పాదుకలను తిరిగి రాముని పాదాలకు తొడిగి. "నీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను" అని రాముని పాదాలకు ప్రణామం చేస్తాడు. అన్నదమ్ముల ఆలింగనం చూసి అయోధ్య ప్రజల కళ్లు చెమరుస్తాయి. ఆ తదుపరి పుష్పక రథాన్ని నీ అసలు యజమాని అయిన కుబేరునీ వద్దకు వెళ్ళమని ఆదేశించాడు రాముడు. 7. శ్రీరామ పట్టాభిషేకం (రామరాజ్యం) అంతట రాముడు తన గురువైన వశిష్ఠుని పాదాలవద్ద కూర్చొని ఉండగా భరతుడు ఆయన ఎదుటకు వచ్చి, "ప్రియాగ్రజా! దయచేసి ఇంకా ఆలస్యం లేకుండా రాజసింహాసనంపై పట్టాభిషిక్తుడివై రాజభోగాలతో కూడిన జీవితాన్ని పునఃస్వీకరించు" అని ప్రార్ధించాడు. అంతట శ్రీరామచంద్రుడు అపూర్వమైన ఉత్సవ సంరంభాల నడుమ అయోధ్యలో ప్రవేశించాడు. దారిపొడవునా ఆయనపై మనోజ్ఞమైన, సౌరభభరితమైన సుమావళిని వర్ణిస్తూ రాజన్యులు అభివాదాలు చేయగా, మహనీయులైన బ్రహ్మాది దేవతలు అమితానందోత్సాహాలతో ప్రభువు యొక్క లీలావిశేషాలను ఘనంగా కీర్తించారు. కులగురువైన వశిష్ఠుడు శ్రీరామచంద్రునికి శిరోముండనాదులు చేయించి ఆయనకు జటాజూటాలనుండి విముక్తి కలిగించాడు. స్నానానంతరం ఎట్టకేలకు రాముడు తిరిగి రాజోచితమైన వస్త్రాలను ధరించి పుష్పమాల చేతను, ఆభరణాలచేతను అలంకృతుడైనాడు. ముగ్గురు మాతృమూర్తులు సీతను అలాగే సంభూషితురాలిని చేయగా వానరుల సతీమణులు కూడా అదేవిధంగా నూతన వస్త్రాభరణాలను ధరించారు. భరతుని అభ్యర్ధన మేరకు జాంబవంతుడు, హనుమంతుడు, గవయుడు, ఋషభుడు చతుస్సముద్రాలనుండి జలాలను తీసుకురాగా ఐదువందలమంది శక్తిమంతులైన వానరులు ఐదువందల పవిత్రనదుల నుండి జలాలను తీసుకువచ్చారు. అంతట ఆ జలకలశాలనన్నింటిని వశిష్ఠుని ఎదుట ఉంచారు. తదుపరి ఆ మహర్షివిలువైన రత్నమాణిక్యాలతో నిర్మించబడిన సింహాసనంపై రాముణ్ణి, సీతను ఆసీనులను గావించాడు. వామదేవుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయ ఋషులు సహకరించగా వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించాడు. తొలుత బ్రాహ్మణులు అభిషేకించారు. తరువాత ఒక కన్య రాముణ్ణి అభిషేకించింది. ఆపైన ఆయన సచివులు, ప్రముఖ యోధులు వైశ్యులు ఒకరి తర్వాత ఒకరుగా అభిషేకించారు. అంతిమాభిషేకం అయిన మీదట వశిష్ఠుడు పట్టాభిషేక మహోత్సవాన్ని ఆకాశంనుండి వీక్షిస్తున్న లోకపాలురను ఇతర దేవతాముఖ్యులను రామునిపై ఓషధులతో సంప్రోక్షించవలసిందిగా ఆదేశించాడు. మకుట ధారణ అంతట రాముడు ఒక అమూల్య రత్నఖచితమైన స్వర్ణ సింహాసనంపై కూర్చొనగా వశిష్ఠుడు ఆయన శిరస్సుపై రాజమకుటాన్ని పెట్టి ఆయన దేహాన్ని స్వర్ణాభరణాలతో అలంకరించాడు. గతంలో ఇక్ష్వాకు వంశ మహారాజులందరిచేత ధరించబడిన ఆ కిరీటంవైవస్వత మనువు యొక్క పట్టాభిషేకం కోసం బ్రహ్మదేవుని చేత ప్రత్యేకంగా రూపొందించబడింది. దేవేంద్రుని సూచనమేరకు వాయుదేవుడు రాముని మెడలో 100 స్వర్ణకమాలలతో కూర్చబడిన హారాన్ని వేసి, ముత్యాలతోను, మణులతోను కూడిన ఒక దివ్యకంఠాహారాన్ని ఆయనకు కానుకగా సమర్పించాడు. శత్రుఘ్నడు రాముని శిరస్సుపై రాజఛత్రాన్ని పట్టగా, సుగ్రీవ, విభీషణులు ఇరుప్రక్కల నిలిచి వింజామరలు వీచారు. హనుమను సీతమ్మ కు హారాన్ని ఇచ్చింది, లక్ష్మణ స్వామి ను యువరాజుగా ఉండమని రాముడు కోరగా నీ సేవ యే చాలు అన్నాడు. భరతుని యువరాజుగా చేశాడు.వానర, రాక్షస ప్రముఖులు అందరి కి వారి వారి స్థాయికి తగ్గట్టు బహుమతులు ఇచ్చారూ సీతారాములు. ఆ విధంగా రాముడు తన రాజధానియైన అయోధ్యనుండి భూమండలాన్ని 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ సమయంలో ఆయన 100 అశ్వమేధాలతో సహా అనేక యజ్ఞాలను చేశాడు. శ్రీరాముని రాజ్యపాలనా కాలంలో అరణ్యాలు, నదులు, పర్వతాలు, మహాపర్వతాలు, రాజ్యాలు, సప్తద్వీపాలు, సప్తసాగరాలు అన్నీ అనుకూలంగా ఉండి సకల ప్రాణికోటికి అవసరమైన జీవనావసరాలను సమకూర్చాయి. దేహబాధలు, మానసిక బాధలు, వ్యాధి, వృద్ధాప్యం, వియోగం, విలాపం, ఆపద, భీతి, గ్లాని అనేవి ఎవరికీ ఎన్నడూ కలుగనేలేదు. భర్తృ వియోగంతో విలపించవలసిన వితంతువులు ఎవరూ లేరు. వ్యాధులు, చోరభీతికూడా లేవు. భూలోకం యావత్తు విష్ణు లోకం వలె భాసించింది అని వాల్మీకి మహర్షి రామాయణం ముగించాడు. ఈ రామాయణ మహాకావ్యము సర్వశుభకరము. సమస్తప్రయోజనములను చేకూర్చును. దీనిశ్రవణమువలన కుటుంబవృద్ధియు, ధనధాన్యసమృద్ధియు కలుగును. ముఖ్యముగా స్త్రీలకు ఉత్తమమైన సుఖములు ప్రాప్తించును.ఈ ఇతిహాసము ఆయురారోగ్యములను, కీర్తి ప్రతిష్ఠలను, సౌభ్రాతృత్వమును, బుద్ధికౌశలమును సుఖశాంతులను, తేజోవైభవములను ప్రసాదించును. కావున సమస్తసంపదలను అభిలషించెడి సత్పురుషులు నియమనిష్ఠలతో దీనిని శ్రవణము చేయవలెను. ప్రాచీనమైన ఈ రామోదంతము మీకు సర్వశుభములను చేకూర్చుగాక. మీపై శ్రీమన్నారాయణునిప్రభావము మిక్కిలి ప్రసరించుగాక. ఈ రామాయణమును తమకడ కలిగియుండి ఇందలి దివ్య గాథలను వినినచో దేవతలును, పితృదేవతలును తృప్తిపడుదురు, వాల్మీకి మహాముని రచించిన రామాయణసంహితను భక్తితో వ్రాసినవారు తప్పక స్వర్గసుఖములను పొందుదురు. శ్రీ రామ నవమి రోజు శ్రీరాముని పట్టాభిషేక ఘట్టం వినడం కూడా ఒక యోగం.అది కూడా సంపూర్ణ రామాయణ అధ్యయనం లో భాగంగా ఇది చదివించి మిమ్మల్ని...రాయించి నన్ను తరింప చేసిన రామభద్రునికి శిరసా నమస్కరిస్తూ.ఈ 40 రోజుల అధ్యయన ఫలం సీతారాముల పాదాలకు సమర్పిస్తూ సర్వం శ్రీ సీతారామచంద్ర పాద చరణారవిందార్పణమస్తూ.. జై శ్రీ రామ్ శ్రీ రామ జయ రామ జయ జయ రామ తప్పులు ఉంటే మన్నింప బడుగాక, ఒప్పులు స్వీకరింపబడుగాక రామాయణం పూర్తి చేశాక విన్న వారు, చదివిన వారు అందరూ గొంతు దాచుకోకుండా ఎంత బలంగ అనగలిగితే అంత గట్టిగా బలం విష్ణోర్ ప్రవర్ధతామ్ అని మూడు సార్లు అనాలి అని పెద్దల మాట కాబట్టి అందరూ మూడు సార్లు నోటితో పలికండి,చేతితో కామెంట్ కూడా చేయండి బలం విష్ణోర్ ప్రవర్ధతామ్ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే | చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళమ్ || స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శ్శుభమస్తు నిత్యం లోకా స్సమస్తా స్సుఖినో భవంతు || ఓం శాంతిః శాంతిః శాంతిః సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు రామానుగ్రహం కలుగుగాక.. ...స్వస్తి... #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్