S.HariBlr (Bangalore)
638 views
#😇My Status #ఘంటసాల గారి వర్థంతి నేడు సంగీత సరస్వతి పుత్రుడు "ఘంటసాల వెంకటేశ్వరరావు" గారి 52వ వర్థంతి.. 15వ శతాబ్దానికి చెందిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య తరువాత తిరుమల తిరుపతి దేవ స్థానంలో అంతటి ఘన గౌరవాన్ని పొందిన ఏకైక గాన గంధర్వుడు ఘంటశాల వెంకటేశ్వరరావు మాత్రమే. అన్నమయ్య తరువాత శ్రీ వారి గర్భగుడి లో మూలవిరాట్ సమీపంలో కూర్చుని గానాలాపన చేయగల అదృష్టం ఒక్క ఘంటశాలకు మాత్రమే దక్కింది.కేవలం గొప్ప గాయకుడు అయినంత మాత్రాన ఆయనకు ఈ అపూర్వ అదృష్టం దొరకలేదు. ఆయన విగ్రహంలో, చూపులో, మాటలో పాటలో ఏదో తెలియని ఒక అనిర్వచనీయమైన దైవత్వం ఉట్టిపడుతుంది. కేవలం కారణజన్ములలో మాత్రమే కనిపించే ఆధ్యాత్మిక ఔన్నత్యం ఘంటసాల గానంలోనూ, వ్యక్తిత్వంలోనూ కనిపించేవి. అందుకేనేమో ఆ గాన గంధర్వుడికి ఆ ఏడుకొండల వాడి పద సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడి హోదాలో గానాలాపన చేసే అదృష్టం దక్కింది. ఇక గాయకుడిగా, సంగీత దర్శకుడిగా ఆ మహనీయుని ప్రస్థానంలోని ప్రతి విశేషము తెలుగు వారికి సుపరిచితమే. తెలుగు పాటకు శాశ్వత చిరునామాగా నిలిచిన అమరగాయకుడు ఘంటసాల మూర్తి, కీర్తి, స్ఫూర్తి తెలుగువారి మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. తెలుగు సినీ నేపథ్య గాన ప్రక్రియ ప్రారంభ దశలో ఉన్నప్పుడే ఆల్ ఇండియా రేడియో నుండి చిత్ర పరిశ్రమలో అడుగిడిన ఘంటశాల ఆ ప్రక్రియతో పాటే ఎదిగారు.. వెలిగారు.తొలిసినీ నేపథ్య గాయకుడు అనే క్రెడిట్ కీర్తిశేషులు ఎం ఎస్ రామారావు గారికే దక్కినప్పటికీ నేపద్య గాయకుడిగా విశేష ప్రాచుర్య ప్రాభవాలను దక్కించుకున్న తొలి నేపథ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావే అన్నది నిర్వివాదాంశం. తెలుగు సినిమా సృజనాత్మకంగా, సాంకేతికంగా తప్పటడుగుల శైశవదశ నుండీ పరిపక్వత వైపు పరుగులు తీస్తున్న పరిణామ దశలో గాయకుడిగా, సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఘంటసాల వెంకటేశ్వరరావు చూస్తుండగానే తెలుగువారి జీవన విధానంలో ఒక అంతర్భాగంగా మమేకమైపోయారు. విచిత్రమో యాదృచ్ఛికమో తెలియదు కానీ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండు కళ్లుగా భాసిల్లిన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల ప్రారంభ చిత్రాలతోనే ఘంటసాల సంగీత జీవితం ప్రారంభం కావటం విశేషం. 1944లో ఘంటసాల బలరామయ్య దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పరిచయమైన” సీతారామ జననం” చిత్రంలో కోరస్ సింగర్ గా ప్రారంభమైంది ఘంటశాల గానకళా జీవితం. ఆ తరువాత అదే ఘంటసాల బలరామయ్యగారి దర్శకత్వంలో రూపొందిన” బాలరాజు” చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు స్వయంగా పాడిన పాటను తొలగించి ఘంటశాల చేత పాడించడం జరిగింది. ” కనరావా చెలియా నిరాశ పూనితివా” అనే పల్లవితో సాగిన ఈ పాటను ఆలపించటం ద్వారా ఘంటశాల వెంకటేశ్వరరావు సినీ నేపథ్య గాన జీవితం ప్రారంభమైంది.కోరస్ సింగర్ గా, సింగర్ గా అక్కినేని వారితో ఘంటశాల ప్రయాణ ప్రారంభం ఇలా జరిగితే- ఇక ఎన్టీ రామారావు పోలీస్ కానిస్టేబుల్ పాత్ర ద్వారా పరిచయమైన తొలి చిత్రం” మన దేశం” చిత్రంతో పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు ఘంటశాల వెంకటేశ్వరరావు. ఎల్ .వి. ప్రసాద్ దర్శకత్వంలో మీర్జాపురం రాజా, ఆయన సతీమణి కృష్ణవేణి నిర్మించిన ” మన దేశం” చిత్రం ద్వారా నటుడిగా ఎన్టీ రామారావు, సంగీత దర్శకుడిగా ఘంటశాల పరిచయం కావటం తెలుగు సినీ చరిత్రలో ఒక గొప్ప పరిణామంగా నిలిచిపోయింది. ఇలా గాయకుడిగా, సంగీత దర్శకుడిగా అక్కినేని, నందమూరి వారి చిత్రాలతో కెరీర్ ప్రారంభించిన ఘంటసాల తెలుగువారికి తరతరాలకు తరగని గాన సంపదను అందించారు. ఘంటసాల అనే మధుర గాయకుడి ఆలాపనా సౌందర్యము నాగేశ్వరరావు- రామారావు అనే మహానటుల అభినయ సౌందర్యము కలగలసి తెలుగువారి మనసుల్లో ఒక శాశ్వత అనుభూతి శిఖరాకృతిగా నిలిచిపోయింది. 1922 డిసెంబర్ 4న కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా చౌటపల్లి గ్రామంలో జన్మించిన ఘంటసాల వెంకటేశ్వరరావు 1974 ఫిబ్రవరి 11న పరమపదించారు.32 సంవత్సరాల ఆయన సంగీత ప్రస్థానంలో కేవలం సినీ గీతాలే కాకుండా భగవద్గీత, పుష్ప విలాపం, వెంకటేశ్వర కీర్తనలు వంటి ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఎన్నో ఉన్నాయి. భారతదేశపు 4వ ఉత్తమ పౌర పురస్కారమైన పద్మశ్రీ తో పాటు ప్రపంచవ్యాప్తంగా వందలాది సాంస్కృతిక సంస్థలు జరిపిన సన్మానాలు, బిరుదు ప్రధానోత్సవాలు ఘంటసాల ఘన చరితకు నిదర్శనాలుగా నిలిచిపోయాయి. ఆ గానగంధర్వుడి స్మృతి చిహ్నంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు వెలిశాయి. ఆ విగ్రహాలు కేవలం ఒక గాయకుడుగా సాధించుకున్న ఘనతకు గుర్తులు కాదు… వ్యక్తిగా, గొప్ప ఔన్నత్య మూర్తిగా ఘంటసాల సాధించుకున్న పేరు ప్రతిష్టల ప్రతిరూపాలు మూడు తరాల పాటు తెలుగుదేశంలోని ఆబాలగోపాలాన్ని తన కమనీయ కంఠ మాధుర్యంతో పరవశింపచేసిన గంధర్వ గాయకుడు ఘంటసాల. చందమామకు చల్లదనం నేర్పినా, తేటతెలుగుకు తియ్య దనం అందించినా అది అయనకే చెల్లించిం దనటం అతిశయోక్తి కాదు. జన్మతః కాకున్నా అభ్యాసగతంగా తండ్రినుంచి గురువునుంచి ఆయన నేర్చుకున్న సంగీత జ్ఞానం తెలుగు లలిత సంగీతానికి, చలనచిత్ర సంగీతానికి ప్రాణప్రతిష్ట పోసింది. ఆ గళ గంధర్వహేల ప్రతి తెలుగువారి మదిలో నిలిచింది. తెలుగుపాట, పద్యం ఉన్నంత వరకు ప్రతి ఇంటా, ప్రతి నిమిషం ఆయన గొంతు మారుమోగుతూనే ఉంటుంది. ఘంటారావంలా ఖంగున మ్రోగే కంచుకంఠంతో ప్రపంచ తెలుగు శ్రోతల్ని ముగ్ధులను గావించిన గానగంధర్వుడు ఘంటసాల. మానవుడే మహనీయుడన్న సుభాషి తానికి ప్రత్యక్ష సాక్షిగా, పాటతో సాగిన గానధీమం తుడాయన. భగవద్గీతని, భారతజాతికి అపూర్వ మైన వరంగా వదిలి వెడలిన భక్త శిఖామణి. వెండివెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలీ అంటూ తీయని పాటలు పాడుతూ తెలుగు స్వరకీర్తిని అజరా మరం చేసిన విశిష్టగాయకుడు. ఆయన పరమపదించి నాలుగు దశాబ్దాలు దాటినా బహుదూరపు బాటసారీ ఇటు రావో ఒక్కసారీ అంటూ ఆయనను తెలుగు జాతి స్మరించుకుంటూనే ఉంది. తెలుగు సినిమా పాటల కు అర్ధశతాబ్దంపాటు గాత్రదానం చేసిన తొలి తరం నేపథ్య గాయకులలో ప్రముఖుడు. మరో వెయ్యేళ్ల పాటు తెలుగు సినీ సంగీతాన్ని నేపథ్యగాన చరిత్ర లో చెరిగిపోని సంతకంలా రూపొందించి తెలుగు వారి హృదయాల్లో నిలిచిపోయారు. పాటను, పద్యాన్ని హిమవన్నగ శిఖరాలపై నిలిపిన ఆ గాన విశారదుడికి నిండు నీరాజనాలు.