IND vs WI:
#🇮🇳టీమ్ ఇండియా😍 #🏏వెస్టిండీస్ టీమ్🎌 #🏏సంజు శాంసన్🔥 #🏏సంజు శాంసన్🔥
*ఛీ కొట్టినోడే గెలిపించాడు.. సెమీస్ చేరిన భారత్❗*
Uppala Shivaprasad
March 1, 2026🏏
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఫామ్ లేదని ఛీకొట్టిన సంజూ శాంసనే అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శనతో డూ ఆర్ డై మ్యాచ్లో టీమిండియాను గెలిపించాడు. ఆదివారం కోల్కతా వేదికగా జరిగిన తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తు చేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్(25 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40), రోవ్మన్ పోవెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్), జాసన్ హోల్డర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 37 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/36) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.
అనంతరం భారత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 199 పరుగులు చేసి గెలుపొందింది. సంజూ శాంసన్ (50 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లతో 97 నాటౌట్) ఒక్కడే అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 27) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వెస్టిండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్(2/38), షమార్ జోషెఫ్(2/42) రెండేసి వికెట్లు తీయగా.. అకీల్ హోస్సేన్ ఒక వికెట్ తీసాడు.
నిరాశపర్చిన అభిషేక్, తిలక్..
195 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు మరోసారి ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్ అభిషేక్ శర్మ(10) తీవ్రంగా నిరాశపర్చాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ రెండు బౌండరీలు బాది దూకుడు కనబర్చినా.. అంతే వేగంగా పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఓవైపు వికెట్లు పడినా మరోవైపు సంజూ శాంసన్ తనదైన శైలిలో చెలరేగాడు. దాంతో పవర్ ప్లేలో భారత్ 2 వికెట్లకు 53 పరుగులు చేసింది.
ఓ వైపు కెప్టెన్ సూర్య ఆచితూచి ఆడినా సంజూ భారీ షాట్లతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. ఈ క్రమంలో 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో సంజూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్య కూడా తన ట్రేడ్ మార్క్ ర్యాంప్ షాట్తో సిక్సర్ తరలించి జోరు కనబర్చాడు. 58 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని జోసెఫ్ విడదీసాడు. సూర్య(18)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
సంజూ సూపర్ బ్యాటింగ్..
క్రీజులోకి తిలక్ రాగా.. టీమిండియా పరుగుల వేగం కాస్త తగ్గింది. జోసెఫ్ బౌలింగ్లో సంజూ ఎదురు దాడికి దిగి పరుగులు పిండుకున్నాడు. తిలక్ వర్మ కూడా రిథమ్ అందుకొని వేగంగా పరుగులు రాబట్టాడు. 42 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని జాసన్ హోల్డర్ ప్లాన్ చేసి విడదీసాడు. మిడాఫ్ ఫీల్డర్ను పెట్టి తిలక్ వర్మకు ఉచ్చు బిగించాడు.
హోల్డర్ వేసిన ఫుల్ డెలివరీని వెనక్కి జరిగి మిడాఫ్ ఫీల్డర్ మీది నుంచి కొట్టేందుకు తిలక్ వర్మ ప్రయత్నించాడు. కానీ గాల్లోకి జంప్ చేసిన హెట్మైర్ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. క్రీజులోకి హార్దిక్ రాగా.. సంజూ మూమెంటమ్ దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డాడు.
హార్దిక్ వెనుదిరిగినా..
రొమారియో షెఫెర్డ్ వేసిన 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా ఇచ్చిన సునాయస క్యాచ్ను ఎక్స్ట్రా కవర్లో హోల్డర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో అతను దూకుడుగా ఆడాడు. సంజూ కూడా బౌండరీలు బాదడంతో చివరి 12 బంతుల్లో టీమిండియా విజయానికి 17 పరుగులు అవసరమయ్యాయి. షమార్ జోసెఫ్ వేసిన 19వ ఓవర్లో హార్దిక్ పాండ్యా(17) క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు.
దాంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. శివమ్ దూబే వచ్చి రావడంతోనే రెండు బౌండరీల బాది ఒత్తిడిని తగ్గించాడు. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి 7 పరుగులు అవసరం కాగా.. సంజూ 6, 4 బాది భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.