P.Venkateswara Rao
518 views
* #కేరళం..! ఎందుకు ఈ పేరు మార్పిడి..? ఈ పేరులో అర్థమేమిటి..❓* February 25, 2026🎯 కేరళం.. ఒక జాతి ఆత్మాభిమాన నినాదం! …. By Srinivas Ganjivarapu …. సముద్రపు కెరటాల సవ్వడి, పచ్చని కొబ్బరి వనాల సోయగం, అక్షరమే ఆయుధంగా సాగే ప్రగతి ప్రయాణం.. వెరసి మన కళ్ళముందు కదిలే చిత్రం ‘కేరళం’ . ఇప్పుడా పేరు కేవలం ఒక భౌగోళిక ప్రాంతానికి గుర్తు మాత్రమే కాదు; అది ఒక జాతి తన అస్తిత్వాన్ని, మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటిచెప్పే చారిత్రక ఘట్టం. రాజ్యాంగ పత్రాల్లో ఇప్పటివరకు ‘కేరళ’గా పిలవబడిన ఆ రాష్ట్రం, ఇకపై అధికారికంగా తన సొంత ఉచ్చారణతో ‘కేరళం’గా రూపాంతరం చెందడంతో మలయాళీ ప్రజల దశాబ్దాల కల సాకారమయింది. రాష్ట్రంలో పార్టీలకతీత నిర్ణయం .. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం కేవలం ఒక పేరు మార్పు మాత్రమే కాదు, వలసవాద ముద్రలను చెరిపివేసి మాతృభాషలోని మాధుర్యాన్ని పరిపాలనలో ప్రతిబింబించడం. కేరళం అనే పదానికి ఆ రాష్ట్ర నేల స్వభావానికే ఒక విడదీయలేని బంధం ఉంది. మలయాళంలో ‘కేర’ అంటే కొబ్బరి చెట్టు అని, ‘ఆలం’ అంటే భూమి అని అర్థం. ఈ ‘కొబ్బరి వనాల నేల’ తన పేరును తానే సార్థకం చేసుకుంటోంది. ఈ కొబ్బరి కేవలం పేరులోనే కాదు, వారి ప్రతి రుచిలోనూ పరిమళిస్తుంది. కొబ్బరి నూనె ఘుమఘుమలు, కొబ్బరి పాలతో చేసే ‘అప్పం’, ‘స్టూ’ వంటి వంటకాలు కేరళీయుల ఆహార సంస్కృతికి ప్రాణం. ముఖ్యంగా అరటి ఆకుపై వడ్డించే ‘సద్య’ విందు ఆ నేల యొక్క ఐక్యతను చాటిచెప్పే ఒక సాంస్కృతిక ప్రతీక. అక్కడి తీర ప్రాంతపు సముద్రపు రుచులు కూడా అద్భుతం. సముద్రపు నీలి అలల మధ్య దొరికే ‘కరిమీన్’ చేపను మసాలాలతో అద్ది, అరటి ఆకులో చుట్టి కాల్చే ‘కరిమీన్ పొల్లిచత్తు’) ఆ రాష్ట్రపు గర్వకారణమైన రుచి. ‘కొడమ్ పులి’ (మలబార్ చింతపండు) వేసి వండే చేపల పులుసు ఆ ప్రాంతపు అసలైన ఘుమఘుమలను పంచుతుంది. కేవలం చేపలే కాదు, మాంసాహార ప్రియుల కోసం మలబార్ పరోటాలో మేళవించే మాంసం వేపుడు… కుట్టనాడ్ ప్రాంతపు ప్రసిద్ధ ‘బాతు మాంసం కూర’, మలబార్ ముస్లింల ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచే ‘తలస్సేరి బిర్యానీ’ ఆ నేల అస్తిత్వంలో భాగం. సుగంధ ద్రవ్యాల రాజధానిగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతపు ఆహారంలో మిరియాలు, ఏలకుల ఘాటు వారి చరిత్రలో దాగి ఉన్న అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలను గుర్తుచేస్తుంటుంది. చారిత్రకంగా చూస్తే మౌర్య చక్రవర్తి అశోకుని కాలం నాటి శిలా శాసనాల్లో (క్రీ.పూ. 257) ఈ ప్రాంతాన్ని ‘కేరళపుత్ర’ అని సంబోధించడం విశేషం. వేల ఏళ్ల నాటి ఈ చారిత్రక వారసత్వాన్ని నేటి ఆధునిక కాలంలో ‘కేరళం’ పేరుతో పునరుద్ధరించుకోవడం ఒక గొప్ప సాంస్కృతిక విజయం. ఈ ప్రయాణం అంత సులభంగా సాగలేదు. ఒకప్పుడు మలబార్, కొచ్చిన్, ట్రావంకూర్ సంస్థానాలుగా విడిపోయి ఉన్న మలయాళీలను ఏకం చేసేందుకు ‘ఐక్య కేరళ ఉద్యమం’ దశాబ్దాల పాటు సాగింది. భాషా పరంగా చూస్తే, సంస్కృతంలోని ‘కేరళ’ పదానికి మలయాళ వ్యాకరణం ప్రకారం చివరన చేరే ‘మ్’ (అనుస్వరం) ఆ రాష్ట్ర అస్తిత్వానికి ప్రాణం పోస్తుంది. ‘కేరళం’ అని పలికినప్పుడు కలిగే ఆత్మీయత ‘కేరళ’లో లేదని అక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. సాహిత్యంలో ‘వల్లతోల్ నారాయణ మీనన్’ వంటి కవులు తమ మాతృభాషా గౌరవాన్ని చాటిచెబుతూ రాసిన కవితలు ఈ ఉద్యమానికి వెన్నెముకగా నిలిచాయి. ఈ మార్పు కేవలం ఒక అక్షరం చేరిక కాదు, ఒక జాతి తన ఆత్మగౌరవాన్ని రాజ్యాంగబద్ధంగా ప్రకటించుకోవడం. మాతృభాష పట్ల, తమ ప్రత్యేకమైన ఆహార రుచుల పట్ల మలయాళీలు చూపే నిబద్ధత ఇతర భాషా రాష్ట్రాలకు కూడా ఒక గొప్ప ప్రేరణ. ఇకపై అధికారిక పత్రాల్లో మెరిసే ‘కేరళం’ అనే పేరు..పచ్చని కొబ్బరి ఆకుల మధ్య వికసించే ఒక భాషా సుగంధం! *കേരളം Keralam కేరళం*