పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారం పై దృష్టి – ఎస్పీ డి.జానకి, ఐపీఎస్
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారు గురువారం మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, ఎన్బీడబ్ల్యూ (NBW), ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. ప్రతి కేసు స్థితిగతులను పరిశీలించి పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసుల దర్యాప్తులో వేగం పెంచడంతో పాటు నాణ్యతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రతి కేసును పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ చేసి త్వరగా పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సున్నితమైన ఎస్సీ/ఎస్టీ కేసుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు.
నేరాల నివారణలో భాగంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాంగ్ రూట్లో వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి రోడ్డు భద్రతను కాపాడాలని ఎస్హెచ్వోలకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ పరిధుల్లో నేరాల నియంత్రణ కోసం రాత్రిపూట క్రమం తప్పకుండా పెట్రోలింగ్ నిర్వహించాలని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. డయల్-100 కాల్స్కు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి త్వరగా చేరుకోవాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని వారికి అండగా నిలవాలని సూచించారు. ప్రజల విశ్వాసం పెంపొందించే విధంగా పోలీసులు విధులు నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (NB) రత్నం, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్బీ డీఎస్పీ రమణా రెడ్డి, వర్టికల్ డీఎస్పీ బాలాజీ, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
#MahabubnagarPolice
#📰 వార్తలు