రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
ప్రతి పోలీస్ స్టేషన్లో విలేజ్ హిస్టరీ షీట్స్ అప్డేట్ చేయాలి
నైట్ బీట్ & పెట్రోలింగ్ విధుల్లో నాణ్యత పెంచాలి
చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు – ఎన్ఫోర్స్మెంట్ వేగవంతం చేయాలి
నెలవారీ నేర సమీక్ష సమావేశంలో అధికారులకు పలు సూచనలు చేసిన మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి. జానకి
మహబూబ్నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా ఎస్పీ డి.జానకి గారి ఆధ్వర్యంలో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో జిల్లాలోని అన్ని సర్కిల్స్, పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల స్థితిగతులు, పెండింగ్ కేసుల పరిష్కారం, దర్యాప్తులో నాణ్యత, నేరాల నియంత్రణ తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండేలా దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్షపడే విధంగా చట్టపరమైన బలమైన ఆధారాలు సమర్పించాలని సూచించారు. బాధితులకు న్యాయం అందేలా త్వరితగతిన కేసులను పూర్తి చేయాలని ఆదేశించారు. కేసుల విచారణలో జాప్యం చేస్తే సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఆధునిక సాంకేతికతను వినియోగించి నేరాలను చేధించాలని సూచించారు.
అన్ని పోలీస్ స్టేషన్లలో విలేజ్ హిస్టరీ షీట్స్ను అప్డేట్ చేయాలని, గ్రామాల వారీగా నేర చరిత్రపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్హెచ్ఓలు తమ పరిధిలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి స్థానిక సమస్యలను తెలుసుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
నైట్ బీట్ మరియు పెట్రోలింగ్ విధులను మరింత సమగ్రంగా నిర్వహించాలని, సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. దొంగతనాల కేసుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లాంగ్ పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, దొంగిలించిన సొత్తును బాధితులకు తిరిగి అందించాలన్నారు.
చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని, శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేశారు.
అంతేకాకుండా సిబ్బంది సమస్యలను సమయానికి పరిష్కరించేందుకు ఎస్ఐలు సరైన విధంగా ఎండార్స్ చేసి ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేసినందుకు జిల్లా పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ గారు అభినందించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ NB రత్నం, డీఎస్పీలు, వెంకటేశ్వర్లు, రమణారెడ్డి సీఐలు, అప్పయ్య, అయిజజుద్దీన్, కమలాకర్, రామకృష్ణ, ఆర్ఐలు, కృష్ణయ్య, నగేష్, అశోక్ కుమార్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
#📰 వార్తలు