#⚜️🔱కర్మ సిద్ధాంతం 🧓
*మనిషి మరణ వార్తే అతనికి పిలుపు.. ఎవరు దారి చూపాల్సిన పని లేదు⁉️*
03.03.2026🥵
సత్తుపల్లి నగరం ఇంకా నిద్ర మత్తులో ఉండగానే.. ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి దినపత్రికల పాయింట్లు వద్దకు వెళ్లి తెలుగు దినపత్రికలు కొనుగోలు చేసి పత్రికను సంకలో పెట్టుకుని ఆ వీధుల్లో ఒక నిశ్శబ్ద అడుగు సవ్వడి వినిపిస్తుంది.
చిరిగిన చొక్కా, భుజాన నీలిరంగు సంచి, కాళ్లకు చెప్పులు లేవు. నోటి నుంచి మాటరాదు. కానీ, ఆ కళ్లకు మాత్రం ఎదుటివారి కష్టం కనిపిస్తుంది. అతను లోకానికి ఒక సామాన్య యాచకుడు.. ఐన గుణంలో మాత్రం మనసున్న ఓ గొప్ప మహారాజు!
మరణవార్తే అతని పిలుపు..
ప్రతి రోజూ ఉదయాన్నే ఒక దినపత్రిక కొంటాడు. అక్షరాలు పూర్తిగా చదవడం రాకపోయినా, ఎవరినైనా అడిగి ఎక్కడ 'మరణ వార్త' ఉందో తెలుసుకుంటాడు. ఒక్కసారి ఎవరైనా చనిపోయారని తెలిస్తే.. అతని ప్రయాణం మొదలవుతుంది. తాను రోజంతా యాచించి కూడబెట్టిన ఆ చిల్లర నాణేలతో ఒక పూలదండ కొంటాడు. ఎవరూ పిలవాల్సిన అవసరం లేదు.
ఎవరూ దారి చూపాల్సిన పని లేదు..
చివరికి బంధువులు కూడా చేరకముందే.. ఆ పార్థివదేహం దగ్గర అతను ప్రత్యక్షమవుతాడు. నిశ్శబ్దంగా వెళ్లి, ఆ మృతదేహానికి పూలమాల వేసి, తలవంచి నమస్కరిస్తాడు. సంబంధం లేని మనిషి, అసలు పరిచయమే లేని ప్రాణం.. కానీ ఆ మౌన జీవి కళ్ళలో కనిపించే ఆవేదన అంతుచిక్కనిది.. ఇది అతని అలవాటు కాదు.. మనిషి పట్ల అతనికున్న అత్యున్నతమైన గౌరవం.
జీవితం ఎంత సరళం!
రోజంతా గడిచాక, సత్తుపల్లి HP బంక్ పక్కన ఉన్న హోటల్ దగ్గర అతను కనిపిస్తాడు. అక్కడ పడి ఉన్న టీ గ్లాసులు ఏరి యజమానికి ఇస్తాడు. బదులుగా అతను ఆశించేది కేవలం ఒక కప్పు టీ మాత్రమే! అడగడం అతని జీవనాధారం.. కానీ ఇతరుల కోసం ఇవ్వడం అతని స్వభావం. సమాజానికి ఒక ప్రశ్న.. కోట్లు సంపాదించే మనం, పక్కవాడికి కష్టం వస్తే పలకరించడానికి కూడా సమయం లేదంటాం. కానీ ఏమీ లేని ఆ యాచకుడు, మనిషి చివరి ప్రయాణంలో తోడుగా నిలబడటమే తన ధర్మంగా భావిస్తున్నాడు. స్థాయి కాదు.. మనిషి మనసే అతన్ని మహారాజుని చేస్తుంది. సత్తుపల్లి వీధుల్లో తిరిగే ఆ మౌన సందేశం మనకు ఒకటే చెబుతుంది: ధనం ఉన్నవాడు గొప్పవాడు కాదు.. దానం చేసే గుణం ఉన్న వాడే నిజమైన మహానుభావుడు. రూపం తాత్కాలికం.. కానీ నీ మంచితనం మాత్రమే శాశ్వతం.