#దగ్గుబాటి పురంధేశ్వరి
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక కేంద్రమంత్రి, ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖకు అధ్యక్ష పదవి నిర్వహించిన వాళ్ళు సైద్ధాంతిక భేదాలు, పార్టీలో వచ్చిన చీలికలు, కేంద్ర నాయకత్వంతో విధానపరమైన సర్దుకోలేని వైరుధ్యాలు వచ్చినప్పుడు తప్ప కేవలం పదవుల కోసం పార్టీ మారిపోవడం అంటే అంతకంటే దగాకోరుతునం మరొకటి ఉండదు.
రైట్ వింగ్ పార్టీలు, లెఫ్ట్ వింగ్ పార్టీలు, సెంట్రిస్ట్ పార్టీలు ఆయా నేపథ్యాలను కలిగి ఉన్నప్పుడు ఒక సెంట్రిస్ట్ పార్టీ సభ్యుడు పైన చెప్పిన కారణాలు కారణంగా మరొక సెంట్రిస్ట్ పార్టీకి వెళితే ఔననవచ్చునేమో కానీ సరాసరి పూర్తి భిన్నమైన రైట్ వింగ్ పార్టీలోకి పోవటం జన్మ సంబంధిత బానిసత్వానికి పరాకాష్ట. ఆ ఘోరానికి పాల్పడిన వారు నిజ జీవితంలో లాభం కోసం ఎలాంటి నికృష్టమైన పనికి పాల్పడడానికైనా వెనుకాడరు.
ఎన్టీ రామారావు అమ్మాయి. కుటుంబంలో ఆమెను చిన్నమ్మ అని వేడుకగా పిలుచుకుంటారు అనుకుంటాను. వెంపటి చినసత్యం గారి శిష్యురాలుగా అనేక నాట్య రీతులలో అందెవేసిన చెయ్యి. ఇటీవల కాలంలో కూడా ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె తన భరత నాట్య కళను సందర్భానుసారం ప్రదర్శించిన తీరు చూసి అందరం చాలా అభినందించి ఉన్నాం. తెలుగు ఇంగ్లీష్ భాషల్లో న్యాయం ఎలా ఉన్నప్పటికీ ఆమె అనర్గళంగా మాట్లాడగలగటం ఆమెకు అదనపు ఆకర్షణ.
ఎన్టీఆర్ సంతతికి దీక్షాదక్షతలు లేక చంద్రబాబు లాంటి చాణక్యుడు పార్టీని సొంతం చేసేసుకున్నాడు అనేది భయానకమైన అపోహ. ఎన్టీ రామారావుకు ఉన్న ధారణ, గ్రహణ మొదలైన మేధోపరమైన సహజ లక్షణాలు చంద్రబాబులో లుప్తం. ఎన్టీఆర్ సంతతిగా మిగిలిన వాళ్ల గురించి మనం చూడక తెలియదు కానీ హరికృష్ణకు, చిన్నమ్మ పురందేశ్వరికి అవన్నీ సహజంగా అబ్బినాయి. హరికృష్ణ వాసనలే జూనియర్ ఎన్టీఆర్ ధారణలో కూడా మనకు గోచరిస్తాయి. ఇవన్నీ సామర్ధ్యానికి సంబంధించిన కోణాలు. అయితే న్యాయపరమైన కోణం వీటికి పూర్తి విభిన్నమైనది.
ఎన్టీఆర్ పదవీచ్యుతి, ఆ సమయంలో ఆయన సంతతి వ్యవహార సరళి, చంద్రబాబు వ్యూహం(ఈ పదం వాడటం నాకు అసలు నచ్చదు, చంద్రబాబు విషయంలో అసలు నచ్చదు, అయినా తప్పదు) మొదలైన విషయాలు అందరికీ తెలిసినవే కాబట్టి వాటి గురించి ప్రత్యేకించి ఇప్పుడు అనుకోవలసిన పనిలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తన భర్త ఉప ముఖ్యమంత్రి పదవికి వస్తాడని ఈమె తన భర్తకు వీర తిలకం దిద్ది మరి వైస్రాయ్ హోటల్కు పంపించింది అని చనిపోయిన ఎర్రం నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. ఆయన ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన మాటను కాదనలేం. అంటే కన్నతండ్రి కి ద్రోహం చేయటం ఎంతటి పాతకమో ప్రవచనకార్లు సమయానుకూలంగా ఎప్పుడో చెబుతుంటారు కాబట్టి దాని గురించి మనం కూడా అనుకోనక్కర్లేదు. అంతటి పాపానికి ఈమె సాక్షాత్తు ఒడిగట్టేసింది.
అనంతర కాలంలో చంద్రబాబు కక్ష్యలోకి ప్రవేశించిన ఉపగ్రహం మాదిరి తనను అక్కడ వరకు చేర్చిన యంత్రాన్ని విసర్జించి వెళ్లిపోయినట్టుగా ఈమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఘోరంగా అవమానించి దారిలో వదిలేస్తే, ఆయన మళ్లీ ఎన్టీ రామారావు దగ్గరికి, ఆయన పోయాక మారేటి అత్త దగ్గరికి పోయి దీనాలాపాలు పోతే అది కూడా పని జరగక బికారుల మాదిరిగా తయారైపోయారు భార్యాభర్తలిద్దరూ. అలాంటి నేపథ్యంలో జనం అందరికీ కొత్త రాజకీయం నేర్పడానికి పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ కూడా తన ఈ సొంత మనుషులకి భవిష్యత్తు బాగుండాలని ఉద్దేశంతో అధికారానికి చేరువవుతున్న కాంగ్రెస్లో చేరమని సలహా కూడా చెప్పడంతో(ఈ విషయం దగ్గుబాటి స్వయంగా చెప్పాడు) ఈ భార్యాభర్తలు ఇద్దరూ సోనియా దగ్గరికి పోయి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
తరువాత ఈమె పార్లమెంట్ సభ్యులుగా, ఆయన శాసనసభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నీడన పెరిగారు. ఈమెను సోనియా కేంద్ర మంత్రిని కూడా చేసి రాష్ట్రంలో మరిదికి దీటుగా ఆత్మగౌరవంతో బతికేటట్టు స్థానం కల్పించారు. మామూలు మనిషి ఎవరైనా అయితే అంతటి ఉపకారం చేసిన వ్యక్తికి తిరిగి ఎలాంటి పరిస్థితుల్లోనూ సమానమైన ప్రత్యుపకారం చేయలేకపోయినప్పటికీ అపకారమైతే మటుకు ఎట్టి పరిస్థితులలోను చేయరు. ఎందుకంటే అది మానవ విలువలకు సంబంధించింది.
కాకపోతే చిన్నమ్మలో అలాంటి విలువలు ఏ కోశానా ఉన్నట్టు అగుపించవు. రాష్ట్రంలో విభజన నేపథ్యంలో పార్టీ మొత్తం లుప్తమైపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలుగు తేజం అండతో కాంగ్రెస్కు పూర్తి భిన్నమైన విధాన నేపథ్యం గల బిజెపిలో చక్కగా అమరిపోయింది. భరతనాట్యం చేసేటప్పుడు వివిధ భంగిమలను అలవోకగా ఎలా ప్రదర్శించగలరో నాట్యకారిణి అయిన చిన్నమ్మ అంతే సహజంగా ఆ పార్టీలో ఇమిడిపోయింది. ఆ తర్వాత పది సంవత్సరాలు పాటు రేయింబవళ్లు కష్టపడినా కూడా పెద్దగా ఫలితం లేదు.పొత్తులో పోటీ చేసి 2014లో రాజంపేటలో ఓడిపోతే,పొత్తులు లేని 2019 ఎన్నికల్లో విశాఖపట్నంలో 19,000 ఓట్లను తెచ్చుకోగలిగారు బిజెపి పార్టీ తరఫున. 2024 ఎన్నికల్లో తిరిగి పవన్ కళ్యాణ్ పుణ్యమా అని 2024 ఎన్నికల్లో 10 ఏళ్ల తర్వాత తిరిగి పార్లమెంటు సభ్యురాలు అవ్వగలిగారు.
ఈమె ఇదివరలో రాహుల్ గాంధీని గురించి ఆయనతో గల గతకాలపు సాన్నిహిత్యాన్ని కూడా మరిచి చాలా హేళనగా గేలి చేశారు. అంతకంటే అమానుషం మరొకటి లేదని అప్పుడు అందరూ అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ నెహ్రూ ను లక్ష్యం చేసి నెహ్రూ టిబెట్ను చైనాకు వదిలేసాడు, పాకిస్తాన్ కు సింధు పరివాహ ప్రాంతంలో 80% నీళ్లు వదిలేశాడు, ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత సభ్యత్వాన్ని అప్పగించేసాడు అంటూ దుర్మార్గపారోపణలు ఎలాంటి రుజువులు లేకుండా ఎవరో రాసిచ్చిన మాటలను(పరివార్ శక్తులు అందరి వాల్స్ మీద అవి ఉన్నాయి) ఈమె కూడా నిస్సిగ్గుగా వాడేస్తూ చాలా జుగుప్సాగరంగా మాట్లాడారు.
1950లో భారత్ సైనికపాటవం ఏపాటిది? దేశ ప్రజలకు రెండు పూటలా తిండి లేని కాలమది. టిబేట్ మన భూభాగం కాదు ఏనాడు. దానిని ఆక్రమించుకోగలిగిన శక్తి సామర్ధ్యాలు మనకు లేవు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన నీటి ఒప్పందాలు ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్యసమితి జోక్యంతో అప్పటికి ఉన్న బెస్ట్ పాసిబుల్ విధానంలో జరిగాయి. ఐక్యరాజ్యసమితిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఇచ్చేసేటంత పరిస్థితి ఏనాడు లేదు. అందుచేత అలాంటి గొంతెమ్మ కోరికలు తోటి నెహ్రూనాడిపోసుకోవటం అసహ్యం. ప్రత్యేకించి తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సోనియా కుటుంబం మీదకి ఏనాటికి ఆమె పోకూడదు. అలా వెళితే మానవత్వానికే మచ్చ. తండ్రినే దెబ్బతీసిన మనిషికి ఇది ఒక లెక్కా అని అడిగితే మటుకు సమాధానం లేదు సుమా!
మనలో మన మాట. ఎన్టీ రామారావు కుమార్తెగా ఈమె పెళ్లి ఒక జమిందారీ కుటుంబం నుంచి వచ్చిన వాడితో జరిగింది. ఆ లెక్కన చూస్తే కాంగ్రెస్ ఇచ్చిన మంత్రి పదవి వల్ల చంద్రబాబు నాయుడు కు తన కుమార్తెను ఇచ్చాడే తప్ప కేవలం నారావారిపల్లెలో అతనికి ఉన్న రెండు ఎకరాలను చూసి కాదు. అలాంటిది ఇప్పుడు ఆర్థికంగా చంద్రబాబును, దగ్గుబాటిని బేరీజ్ వేసి చూసినప్పుడు దగ్గుబాటి చంద్రబాబులో కనీసం నూరువ వంతు చేయడు. అందుకని ఇప్పుడు ఈమె దగ్గుబాటిని తప్పు పడుతుందా? ఈమె పిల్లలు ఈ భార్యాభర్తలను ఈ విషయంలో ప్రశ్నిస్తే వాళ్ళు సమాధానం చెప్పగలరా? నెహ్రూను గురించి అలాంటి అవాకులు చవాకులు మాట్లాడే ముందు ప్రపంచ చరిత్ర పుస్తకం రాసిన తన పక్కనే ఉన్న తన భర్తను అందులోని నిజా నిజాలు ఏంటో అడిగి తెలుసుకోవచ్చుగా? పైగా అవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు అందరికీ తెలిసిన చరిత్రకారుడు. నెహ్రూ నిజంగా దేశాన్ని అమ్మేసే ఉంటే అలాంటి అమ్మేసిన వాడి పార్టీలోకి ఈ భార్యాభర్తలిద్దరూ ఎందుకు వెళ్ళినట్టు? అంటే సొంత లాభం ఉంటే ఎలాంటి పనికైనా సిద్ధపడిపోతారా? కొంచెం మనిషి లాగా ప్రవర్తించాలి కదా? ఆ మాత్రం ఆశించడం మనది అత్యాశ అవుతుందా?