P.Venkateswara Rao
420 views
1 days ago
#🏏క్రికెట్ 🏏 IND vs ENG: #t 20 world cup 2026 *ఇండియా, ఇంగ్లాండ్ సెమీఫైనల్లో బద్దలైన 5 రికార్డులు ఇవే.. మనదే జోరు❗* 06.03.2026🏏 2026 టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ టీం చివరివరకూ పోరాడినా 246 పరుగులు చేయగలిగింది. విజయానికి కేవలం 7 పరుగుల దూరంలో ఆగిపోవడంతో ఓడిన ఇంగ్లాండ్ జట్టు టోర్నీ నుంచి వైదొలిగింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 105 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అంతకుముందు సంజూ శాంసన్ 89 పరుగులు చేశాడు. మొత్తంగా చూస్తే ఈ సెమీఫైనల్ మ్యాచ్లో 499 పరుగులు నమోదయ్యాయి. మొదటి నుంచి చివరి వరకు భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో 5 భారీ రికార్డులు బద్దలయ్యాయి. అద్భుతమైన ఫీల్డింగ్ భారత జట్టును ఓటమి నుంచి తప్పించిందని చెప్పవచ్చు. భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్లో బద్దలైన 5 భారీ రికార్డులు ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక పరుగులు: భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్లో మొత్తం 499 పరుగులు నమోదయ్యాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఓ మ్యాచ్లో నమోదైన అత్యధిక పరుగులు ఇవే. అంతకుముందు ఈ రికార్డు 459 పరుగులు. 2016లో జరిగిన ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా మ్యాచ్లో ఆ స్కోరు నమోదైంది. జాకబ్ బెథెల్ వరల్డ్ రికార్డు: ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ బెథెల్ 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లాండ్ తరపున ఇది ఫాస్టెస్ట్ సెంచరీ. ఇదే మ్యాచ్లో 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు. ఇది టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్ తరపున అత్యంత వేగవంతమైన ఫిఫ్టీగా నిలిచింది. ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు: భారత్, ఇంగ్లాండ్ 2వ సెమీఫైనల్ మ్యాచ్లో మొత్తం 34 సిక్సర్లు నమోదయ్యాయి. భారత ఇన్నింగ్స్లో 19 సిక్సర్లు నమోదు కాగా, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 15 సిక్సర్లు వచ్చాయి. ఒక టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో ఇవే అత్యధిక సిక్సర్లు కావడం విశేషం. అంతకుముందు ఈ రికార్డు 31 సిక్సర్లతో ఉండేది. ఇదే టోర్నమెంట్లో వెస్టిండీస్, జింబాబ్వే మ్యాచ్లో ఆ రికార్డు నమోదైంది. ఒక టీ20 వరల్డ్ కప్లో అత్యధిక సిక్సర్లు (టీమ్): ఒక టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డును భారత్ తమ పేరిట లిఖించుకుంది. ఇప్పటివరకు భారత్ ఈ వరల్డ్ కప్లో 88 సిక్సర్లు బాదేసింది. ఇంకా ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ విషయంలో ఇండియా టీం వెస్టిండీస్ను అధిగమించింది. ఇదే టీ20 వరల్డ్ కప్లో విండీస్ బ్యాటర్లు 76 సిక్సర్లు బాదారు. పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250+ పరుగులు: మెన్స్ టీ20 క్రికెట్లో భారత్ 250 కంటే ఎక్కువ స్కోరు నమోదు చేయడం ఇది ఆరోసారి. ఈ విషయంలో భారత్ ఒక వరల్డ్ రికార్డు నిలిపింది. ఈ జాబితాలో రెండో స్థానంలో వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరో మూడుసార్లు ఈ ఘనత సాధించాయి.