Ravi Talluri
603 views
*_MAAGHA PURANAM -- 10_* *_మాఘపురాణం -10వ అధ్యాయము_* *_మృగశృంగుని వివాహము_* *దిలీప మహీజునకు వశిష్ఠువారు మాఘపురాణము గురించి ఇంకా ఈ విధముగా చెప్పసాగిరి*. *పువ్వు వికసించగానే వాసన వేయును. అది ఒకరు నేర్పవలసిన అవసరము లేదు. అది ప్రకృతినైజము. ఆవిధముగానే మృగశృంగుడు బాల్యదశ నుండి హరినామ స్మరణయందు ఆసక్తి గలవాడు అయ్యాడు*. . *అతనికి ఐదు సంవత్సరములు నిండిన తరువాత గురుకులములో చదువ వేసారు*. *అచట సకల శాస్త్రములు అతిశ్రద్ధగా నేర్చుకొనుచు, అధ్యాపకుల మన్ననలను పొందుచు పాండిత్యము సంపాదించెను*. *విద్యలు పూర్తయిన తర్వాత తల్లిదండ్రుల ఆనతిపై దేశాటన చేసి అనేక పుణ్యనదులలో స్నానమాచరించి మాఘమాస పలము సంపాదించియుండెను*. *కుమారుడు దేశాటన పూర్తిచేసి వచ్చిన తరువాత అతని తల్లిదండ్రులు కన్యను చూచి వివాహం చేయుటకు నిశ్చయించినారు*. *మృగశృంగుడు తాను వరించిన సుశీలను మాత్రమే వివాహం చేసుకొనెదనని తన మనో నిశ్చయమును తల్లిదండ్రులకు తెలుపగా కుమారుని ఇష్టప్రకారముగా ఒక మంచి ముహూర్తమున మృగశృంగునకు సుశీలకు అతివైభవముగా వివాహము చేసారు*. *సుశీల స్నేహితురాండ్రగు మిగిలిన ఇద్దరూ మృగశృంగుని చూచి “ఆర్యా! మా స్నేహితురాలగు సుశీలను పెండ్లి చేసుకొన్నట్లే మా ఇద్దరినీ కూడా ఈ శుభలగ్నమున పరిణయము చేసుకొమ్మ” ని పలికారు*. *మృగశృంగుడు ఆశ్చర్యపడి అసంభవం అది ఎట్లు జరుగును?” అని ప్రశ్నించగా – “మా సుశీలను పెండ్లాడినట్లే మమ్ము కూడా పెండ్లాడుమని ఆ కన్యలు పట్టుబట్టినారు*. *పురుషునకు ఒక్క భార్యయేకదా! ఇద్దరు భార్యలా?” అని మృగశృంగుడు ప్రశ్నించగా –* *ఇద్దరు ముగ్గురు యువతులను పురుషుడు వివాహము చేసుకొనుటకు శాస్త్రములు అంగీకరించుచున్నవి కదా! దశరథునకు ముగ్గురు భార్యలు, శ్రీకృష్ణునకు ఎనమండుగురు భార్యలు, పరమేశ్వరునకు గంగ, గౌరీ ఇద్దరు గదా! వారికి లేని అభ్యంతరములు నీకు కలవా? అని ఆ కన్యలు ప్రశ్నించి చుట్టుముట్టిరి. మృగశృంగుడు ఏమీ జవాబు చెప్పలేకపోయాడు*. *వివాహపు వేడుకలను చూడ వచ్చిన అనేకమంది మునీశ్వరులు కూడా మృగశృంగా “అభ్యంతరము తెలుపవలదు. ఆ ఇరువురి కన్యల అభీష్టము నెరవేర్చుము. వారు దుఃఖించిన నీకు జయము కలుగదు. అయిననూ ఇటువంటి ఘటనలు ఇంతకు ముందు అనేకములు జరిగి ఉన్నవి” అని పలికారు. పెద్దలందరి అభిమతము ప్రకారము మృగశృంగుడు ఆ ఇరువురు కన్యలను కూడా వివాహము చేసుకున్నాడు.* *ఈ విధంగా మృగశృంగుని వృత్తాంతము దిలీపునకు వివరింపగా “మహర్షీ! వివాహములు ఎన్ని విధములు? వాటి వివరములు తెలియజేసి నన్ను సంత్రుప్తుని చేయమ” ని ప్రార్థించగా వశిష్ఠ మహర్షి “రాజా! వివాహములు ఎన్ని విధములో వాటి వివరములు చెప్పెదను. సావదానుడై ఆలకింపుము” అని చెప్పసాగెను*. *1. బ్రాహ్మణ కన్యను బాగుగా సింగారించి వరుని పిలిపించి చేయు వివాహమునకు “బ్రాహ్మము” అని పేరు*. *2. దైవము: యజ్ఞము చేయు వానికి యజ్ఞము చేయుటకు వధువును ఇచ్చి చేయు పెండ్లికి “దైవము” అని పేరు*. *3. ఆర్షము: పెండ్లికుమారుని నుండి రెండు గోవులను పుచ్చుకొని అతనికి పెండ్లి కూతురునిచ్చి పెండ్లి చేయు దానిని “ఆర్షము” అని పేరు.* *4. ప్రాజాపత్యము: ధర్మము కోసం దంపతులు కట్టుబడియుండమని దీవించి చేయు వివాహమునకు ‘ప్రాజాపత్యము’ అని పేరు*. *5. అసురము: డబ్బు పుచ్చుకొని కన్యను ఇచ్చి చేయు వివాహమునకు ‘అసుర’ అని పేరు*. *6. గాంధర్వము: ఒకరినొకరు ప్రేమించుకొని వారంతట వారు చేసుకొను వివాహమును ‘గాంధర్వ’ వివాహము అని పేరు*. *7. రాక్షసము: వరుడు కన్యను బలాత్కారం చేసి వివాహమాడిన దానికి ‘రాక్షస’ వివాహము అని పేరు.* *8. పైశాచిక: మోసగించి అనగా మాయమాటలచే నమ్మించి పెండ్లి చేసుకొన్న దానిని “పైశాచిక’ వివాహము అని పేరు*. *ఇవి వివిధ రకములైన వివాహ సంబంధమైన పేర్లు*. *వాటి ధర్మములు తెలియపర్చెదను ఆలకించు*. *గృహస్థాశ్రమ లక్షణములు* *మంచి నడవడికతో ఇహము, పరము సాధించవలయునన్న ఈ గృహస్థాశ్రమము ఒక్కటియే సరియైన మార్గము. భార్య, భర్త అనుకూలంగా నడచుకొనుట, ఉన్నంతలో తృప్తిచెంది దైవభక్తితో నడచుకొనుట, అతిథి సత్కారములను ఆచరించుట, మొదలగు సద్గుణములతో నడచుకొను వాడినే సరియైన గృహస్థుడు అంటారు. నోములు నోచుట, వ్రతములు చేయుట, పర్వదినములలో ఉపవాసములుండి కార్తికమాసమందునా, మాఘమాస మందునా నదీస్నానం చేసి, కడునిష్ఠతో శివకేశవులను స్మరించుట మొదలగు కార్యములను ఆచరించు వారికి మంచి తేజస్సు కలుగును.* *ప్రాతః కాలమున నిద్రనుంచి లేచినప్పుడు భగవంతుని స్మరించుకొని లేచి, కాలకృత్యములు తీర్చుకొని స్నానం చేసి నిష్ఠతో భగవంతుని పూజించవలయును. కార్తిక మాసమందు, మాఘ మాసమందు, వైశాఖ మాసమందు తన శక్తి కొలది దానధర్మములు చేసినచో గొప్ప ఫలం కలుగును. ప్రతి మనుష్యుడు ఇహ సుఖములకే కాక పరలోకమును గురించి కూడా ఆలోచించవలయును.* *_పతివ్రతా లక్షణములు_* *పురుషుడు తనకు సద్గతి కలిగే నిమిత్తము అనేక ఘనకార్యములు చేసిన కాని మంచి ఫలము పొందలేక పోతున్నాడు. ప్రతి స్త్రీ తన భర్తను దైవంగా భావించి మనసారా ఆరాధించవలెను*. *తన భర్త యొక్క మంచి గుణములనే స్వీకరించవలెను గాని, అందమును, ఆకారమును చూచి మోసపోకూడదు.* *పురుషులు స్త్రీ యొక్క అందమునే చూడక, శీలము, గుణమును లెక్కించి ప్రేమతో ఆదరించవలెను.* *ఆవిధముగా స్త్రీ పురుషులిద్దరూ అన్యోన్యానురాగముతో కాపురము చేసిన యెడల ఆ సంసారము ఎంతో బాగుండును. ఉత్తమ స్త్రీ తన భర్తను ఏవిధంగా ప్రేమతో సేవించునో అదే విధముగా అత్తమామల సేవ, అతిథి సేవలను తగు భక్తిశ్రద్ధలతో చేసినయెడల ఆ స్త్రీకి సద్గతి కలుగును*. *భార్య తన భర్త ఆలోచనయందు మంత్రివలె సలహాలు ఇస్తూ , పనిపాటల యందు సేవకురాలి వలె నడుచుకొనవలయును. భోజనం వడ్డించు సమయములో ప్రతి తల్లి తన కుమారునకు ఎంత ఆప్యాయంగా భోజనం పెట్టులో ఆవిధముగా భర్తకు భోజనము వడ్డించవలెను*. *శయన మందిరమున వేశ్యవలె భర్తకు ఆనందం కలుగచేయవలయును. రూపములో లక్ష్మిని పోలి, ఓర్పు వహించుటలో భూదేవిని పోలి ఉండవలెను*. *ఈవిధముగా నడచుకొను ఆమె ఉత్తమ స్త్రీ అనిపించుకుంటుంది*. *స్త్రీ బహిష్టు అయిన నాలుగు దినములు ఏ పనిని చేయరాదు. అతిగా మాటలాడకూడదు. ఎవరినీ ముట్టుకొన రాదు. అ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకొనవలెను*. *నాలుగవ రోజున సూర్యోదయము కాకుండా తలంటి నీళ్ళు పోసుకొని, శుభ్రమైన వస్త్రములు ధరించి, భర్త పాదములకు నమస్కరించి, సూర్య భగవానునకు నమస్కరించి తర్వాత తమ ఇష్ట దేవతలను పూజించవలయును*. *ఎటువంటి సమయములో అయినా భర్త భుజించకుండా తాను భుజించకూడదు.* *ఇటువంటి లక్షణములు కలిగివున్న ఆ ముగ్గురు కన్యలను మృగశృంగుడు పెండ్లాడి ఆనందముగా కాలము గృహస్థాశ్రమమును ఆదరించుచుండెను*. *_మృకండుని జననము:_* *ఉత్తమ లక్షణములు గల స్త్రీలను పెండ్లియాడితిగదా అని మృగశృంగుడు మిగుల ఆనందముతో ఆ ముగ్గురు పడతులతోను సంసారము చేయుచుండెను. కొంతకాలం జరిగినది. సుశీల అను భార్య గర్భం ధరింఛి ఒక శుభలగ్నమున కుమారుని కన్నది. తన కుమారుడు అన్ని విద్యలయందు గొప్ప ప్రవీణుడు కావలయునని ఆశ కలవాడై జాతకర్మలు జరిపించి కుమారునికి “మృకండు”డని నామకరణం చేశారు. మృకండుడు దినదిన ప్రవర్థమానుడై తల్లిదండ్రుల యెడ, బంధుజనుల యెడ, పెద్దలయెడ, భయభక్తులు గలిగి పెరుగుచుండెను. ఐదేళ్ళు నిండినవి. మృగశృంగుడు మృకండునకు ఉపనయనము చేసి విద్యనభ్యసించుటకై గురుకులమునకు పంపించాడు. గురుకులములో గురువు చెప్పిన సకల శాస్త్రములు నేర్చుకొనుచు సకల లక్షణయుతుడై గురువుయొక్క మన్ననలు పొందుచు, యుక్త వయస్సు వచ్చువరకు చదివి సకల శాస్త్రములయందు ప్రావీణ్యతను సంపాదించాడు. మృకండుడు విద్యను పూర్తి చేసుకొని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. మరికొంత కాలమునకు అతనికి ‘మరుద్వతి’యను కన్యతో వివాహం చేసారు. ఆనాటినుండి మృకండుడు గృహస్థాశ్రమము స్వీకరించాడు*. *మృగశృంగుని మిగిలిన ఇద్దరు భార్యలకు కూడా పుత్రులు జన్మించినందున వారికి కూడా అన్ని విద్యలు నేర్పించారు. పెద్దవారలయిన తరువాత వివాహములు చేసారు. తన కుటుంబమంతయును మాఘమాసంలో స్నానములు, జపములు, దానధర్మములు మరింత నిష్ఠతో జరుపవలసినదిగా ప్రోత్సహించెడివాడు. తాము ఆర్జించుకున్న మాఘమాస ఫల ప్రభావముచే సంసారమునందు ఏ ఇబ్బంది లేకుండా ఉండుటే గాక మృగశృంగునకు మనుమలు కూడా కలిగినందున మరింత ఆనందించి తన వంశవృక్షం శాఖోపశాఖలగుచున్నదని సంతోషించుచు తనకింక ఏ ఆశలూ లేనందున భగవసాన్నిధ్యమునకు పోవలయునని సంకల్పించి, తపస్సు చేసుకొనుటకు అడవికి వెళ్ళి తన తపోబలముతో శ్రీ మహావిష్ణువును ప్రసన్నుని చేసికొని, నారాయణుని కృపకు పాత్రుడై వైకుంఠము చేరాడు. “విన్నావు కదా భూపాలా! మృగశృంగుడు తాను చేసుకున్న మాఘమాస ఫలము వలన తనకు పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుటయే గాక బొందితో శ్రీమన్నారాయణుని వెంట వైకుంఠానికి వెళ్ళాడు. ఇక అతని జ్యేష్ట కుమారుడైన మృకండుని యొక్క వృత్తాంతమును చెపుతాను ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజునకు చెప్పసాగారు*. *మృగశృంగుడు అడవికి వెళ్ళిపోయిన నాటినుండి జ్యేష్టపుత్రుడగు మృకండుడే సంసార భారమంతయు మోసి, గృహమునందు ఏ అశాంతియు లేకుండా ఉన్నప్పటికి, తాను వివాహమాడి చాలాకాలం గడిచిననూ సంతానము కలుగలేదు అన్న విచారముతో అతడు లోలోన కుమిలిపోతూ ఒకనాడు “కాశీ మహాపుణ్యక్షేత్రము. సాంబశివునకు ప్రత్యక్ష నిలయము. వారణాసిని చూచినంత మాత్రమున సకల పాపములు హరించుటయే గాక మనస్సునందు కోరికలు నెరవేరును*. *అనేకమంది కాశీ విశ్వనాథుని దర్శనము చేసుకొని వారి అభీష్టములను తీర్చుకున్నారు. నేను నా కుటుంబ సమేతముగా వెళ్ళెదను.” అని మనసున నిశ్చయించుకొని ప్రయాణ సన్నద్ధుడై బయలు దేరి వెళ్ళాడు.* *మార్గమధ్యమున అనేక కౄరమృగముల బారినుండి, క్రిమికీటకముల ప్రమాదమునుండి అతికష్టము మీద తప్పించుకొని కుటుంబ సహితముగా కాశీ క్షేత్రము వెళ్ళాడు*. *కాశీ పట్టణము ఆనుకొని పవిత్ర గంగానది తన విశాల బాహువులను చాచి ప్రశాంతముగా ప్రవహించుచున్నది*. *మృకండుడు పరివార సహితముగా ప్రసిద్ధి చెందిన మణికర్ణికా ఘట్టమున కాలకృత్యాది స్నాన విధులు నెరవేర్చుకొని విశ్వనాథుని మందిరమున ప్రవేశించగానే మృకండునకు ఎక్కడలేని ఆనందం కలిగి తన జన్మ తరించెనని తాను కైలాసమందున్నట్లు తలంచి విశ్వేశ్వరుని భక్తి శ్రద్ధలతో నమస్కరించాడు*. *ఈవిధంగా కుటుంబ సమేతముగా మృకండుడు కాశీవిశ్వేశ్వరుని ధ్యానించి ఒక లింగమును ప్రతిష్ఠించి దానికి మృకండేశ్వర మహాలింగమని నామకరణం చేసి దానికి ఎదురుగా తన భార్య పేర మరొక లింగమును ప్రతిష్టించి ఒక సంవత్సరము విశ్వేశ్వరుని సన్నిధానమందు గడపవలెనని నిర్ణయించుకున్నాడు. ఒక దినమున మృకండుని మువ్వురు తల్లులు పవిత్ర గంగానదిలో స్నానమాచరించి విశ్వేశ్వరుని పూజించుచుండగా వెంటనే తెలివి తప్పి ప్రాణములు విడచిపెట్టారు*. *మృకండుడు చాలా కాలము దుఃఖించెను. విధిని ఎవ్వరూ తప్పించలేరు గదా! అయినా ఈశ్వరుని ధ్యానిస్తు చనిపోయిన ముగ్గురు తల్లులకు మృకండుడు యధావిధిగా దహన సంస్కారములు చేసి తన మాతృ ఋణమును తీర్చుకున్నాడు. మృకండునకు సంతానం కలుగనందున కాశీక్షేత్రమునకు వచ్చినాడు గదా! సంతానం కొరకు భార్యా సమేతుడై విశ్వనాథుని గూర్చి తపస్సు చేసాడు. అనేక దానధర్మములు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమైనారు. మృకండునకు అతని భార్య మరుద్వతికి అమితానందం కలిగి పరమేశ్వరుని అనేక విధముల స్తుతి చేసారు*. *పరమేశ్వరుడు - “మహామునీ! మీ భక్తికి ఎంతయో సంతసించినారము. మీరు చేయు తపస్సు మమ్మెంతో ఆకర్షించినది. మీ నిష్కళంక భక్తికి మెచ్చి మీ కోర్కెలను దీర్చగా వచ్చినాము. మీ అభీష్టము నెరింగింపుడు” అని పలికెను.* *మృకండుడు నమస్కరించి పార్వతీ పరమేశ్వరులను “మహాదేవా! తల్లీ అన్నపూర్ణా! ఇదే మా నమస్కృతులు. లోకరక్షకా! మీ దయవలన నాకు సలక్షణవతి, సౌందర్య సుకుమారవతియగు పత్ని లభించినది*. *నేను మిమ్ము ధ్యానించుచు ఆమెతో సంసార సుఖం అనుభవించుచున్నాను*. *ఎంతకాలమైననూ మాకు సంతానం కలుగనందున విచార పడుతున్నాము. సంతానం లేని వారికి ఉత్తమగతులు లేవు గదా! మాకు పుత్రసంతానం ప్రసాదించ వేడుకొనుచున్నాను” అని ప్రార్థించాడు.* *_మృకండుని దీనాపములు ఆలకించి త్రినేత్రుడు_* *“మునిసత్తమా! నీ మనోభీష్టము నెరవేరగలదు. కాని ఒక్క నియమము ఉన్నది. బ్రతికి ఉన్నంతవరకు వైధవ్యముతో ఉండే పుత్రిక కావలయునా? లేక అల్పాయుష్కుడగు పుత్రుడు కావలయునా? అని ప్రశ్నించారు*. *మృకండునకు ఆశ్చర్యము కలిగి పరమశివుని మాటలకు ఆలోచనలో పడవలసి వచ్చింది. కొంతసేపు ఆగి “ హే శశిధరా! నన్ను పరీక్షింప ఎంచితివా? నాకు జ్ఞానోదయము అయినది మొదలు నేటి వరకు మీ ధ్యానమునే చేస్తూ సేవించుచున్న నాకు ఏమి చెప్పవలయునో తోచకున్నది*. *అయినను కలకాలము వైధవ్యముతో కృంగి కృశించే పుత్రికకన్నా అల్పాయుష్కుడగు పుత్రరత్నమునే ప్రసాదింపుడు” అని అడిగాడు.* *“అటులనే యగుగాక” అని త్రిశూలధారి వరమిచ్చి పార్వతీ సమేతముగా అంతర్ధానమయ్యాడు. పరమేశ్వర అనుగ్రహముచేత వారికి ఒక శుభముహూర్తమున పుత్రుడు కలిగాడు*. *మృకండునకు పుత్రసంతానము కలిగెనని అనేకమంది ఋషిసత్తములు బాలుని చూడవచ్చారు*. *వ్యాసమహర్షి కూడా వచ్చి ఆ బిడ్డకు జాతకర్మ చేసి, మార్కండేయుడని నామకరణం చేసి వెళ్ళాడు. ఓ దిలీప మహారాజా! పరమ పూజ్యుడును భాగవతోత్తముడును, అగు మృకండుడు పరమేశ్వరుని మెప్పించి, వారి దయకు పాత్రుడయి సుపుత్రుని పొందాడు* #మన సంప్రదాయాలు సమాచారం