*_పాంచజన్యం_*
*భగవాన్ శ్రీకృష్ణపరమాత్ముడి శంఖం పాంచజన్యం. ఆయన ఈ శంఖాన్ని కుఱుక్షేత్ర యుద్ధంలో పూరించేవాడు. వసుదేవుడు బలరామ,కృష్ణులకు గర్గాచార్యుడనే పురోహితుడి ద్వారా ఉపనయనం చేయించాడు*.
*అనంతరం ఆ ఆచార్యులు వారికి గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బలరామ కృష్ణులను సాందీప మహాముని ఆశ్రమానికి తీసుకువెళతారు. ఆ ఆశ్రమంలో అన్ని విద్యలను ఆచార్యుల వారు వారికి బోధించారు. ఈ ఆశ్రమంలోనే కుచేలుడు కృష్ణునికి స్నేహితుడిగా పరిచయమవుతాడు*.
*కొంతకాలం అనంతరం శిక్షణ ముగియడంతో బలరాముడు,కృష్ణుడు ఆచార్యులకు ప్రణమిల్లి గురుదక్షిణ ఏమివ్వాలో ఆజ్ఞాపించమని కోరతారు. వీరు సామాన్యులు కాదని వైకుంఠం నుంచి భువిపై అవతరించిన వారని తన దివ్యజ్ఞానంతో సాందీపుడు తెలుసుకొంటాడు. తన మరణించిన కుమారుడిని తిరిగి బతికించమని కోరతాడు. గురుపత్ని శోకాన్ని నివారించినట్టు అవుతుందని వారికి సూచిస్తాడు*.
**** **** ****
*గురుకుమారుడు కొంతకాలం క్రితం సముద్రస్నానం చేస్తూ భారీ అల రావడంతో కడలిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు*.
*ఆ సముద్రతీరానికి వెళ్లిన బలరామ కృష్ణులు గురుకుమారుడిని తిరిగివ్వమని సాగరుణ్ని కోరారు.*
*సాక్షాత్తు నారాయణుడే తన దగ్గరకు రావడంతో సముద్రుడు వారికి వినమ్రంగా నమస్కరించి ‘గురుపుత్రుడిని మింగింది పంచజనుడనే రాక్షసుడనీ, కడలి గర్భంలో దాగి వున్నాడనీ’ వెల్లడిస్తాడు*.
*దీంతో వారు సముద్రంలోపలికి వెళ్లి పంచజనుడితో యుద్ధం చేసి అతన్ని సంహరిస్తారు. అనంతరం అతని కడుపును చీల్చిచూడగా గురు కుమారుడు కనిపించడు. ఒక శంఖువు మాత్రమే కనిపిస్తుంది*.
*ఆ శంఖాన్ని శ్రీకృష్ణుడు తీసుకున్నాడు. గురుకుమారుడు నరకంలో వున్నాడని గ్రహించిన వారు అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఆ శంఖువును పూరిస్తాడు కృష్ణుడు*.
*ఆ శబ్దానికి భీతిల్లిన యమధర్మరాజు అక్కడకు చేరుకొని ఇద్దరినీ తీసుకెళ్లి అతిథి మర్యాదలు చేసి ఎందుకొచ్చారో తెలుసుకుంటాడు*.
*భగవంతుని ఆజ్ఞ కావడంతో వెంటనే సాందీపుని కుమారుడిని వారితో పంపిస్తాడు*.
*మునికుమారుడిని వెంటబెట్టుకొని ఆశ్రమానికి చేరుకుంటారు.*
*మృతుడైన తమ కుమారుడు తిరిగి రావడంతో సాందీప దంపతులు ఎంతో సంతోషిస్తారు.*
*పంచజనుడి నుంచి తీసుకున్న శంఖం కనుకనే దానికి పాంచజన్యం అని పేరొచ్చింది* #మన సంప్రదాయాలు సమాచారం