*_1️⃣4️⃣5️⃣_*
*_సంపూర్ణ మహాభారతము_*
*_145 వ రోజు_*
*_వన పర్వము షష్టమాశ్వాసము:_*
*_అశోకవనం; త్రిఝటా స్వప్నం_*
*అశోకవనంలో సీత రాముని తలచుకుంటూ కాలం గడుపుతోంది*. *సీతకు కాపలాగా రాక్షస స్త్రీలైన త్ర్యక్షి, లలాటాక్షి, త్రిస్తని, ఏకపాద, దీర్ఘజిహ్వ, అజిహ్వ, త్రిజట, ఏకలోచన మొదలైన వారు సీత చుట్టూ కాపలా ఉన్నారు. వారు రావణుని వరించమని ఆమెను వేధిస్తున్నారు. సీత వారి మాటలు వినలేక “అమ్మా! నేను రాముని తప్ప అన్యులను మనసులో కూడా తలవను ఇది సత్యం నాకు జీవించవలెను అన్న కోరిక లేదు. నన్ను ఏమైనా చెయ్యండి” అన్నది*.
*సీత చావటానికి భయపడ లేదని చెప్పడానికి కొందరు స్త్రీలు రావణుని వద్దకు వెళ్ళారు. అప్పుడు త్రిజట*
*“అమ్మా! సీతా నీకు సంతోషం కలిగించే మాట ఒకటి చెప్తాను. రాముని మేలు కోరే వాడు అవింద్యుడు అనే వాడు నన్ను ఇక్కడ నియమించాడు. నీకు హితమైన మాటలు చెప్పమన్నాడు. రామలక్ష్మణులు నిన్ను వెతుకుతూ సుగ్రీవుని కలుసుకుని మైత్రి చేసుకున్నారు. సుగ్రీవుడు నిన్ను వెతికించే కార్యము మొదలు పెట్టాడు. రావణునికి రంభ కారణంగా నలకూబరుడు ఒక శాపం పెట్టాడు.*
*ఆ కారణంగా రావణుడు నిన్ను బలాత్కరించడు కనుక భయపడ వలదు. దుర్మార్గుడైన రావణునికి చేటు కాలం దాపురించిందని తెలిపే కల నాకు వచ్చింది. గాడిదలు కట్టిన రథం పై ఒంటి నిండా నూనె రాసుకుని తల విరబోసుకుని రావణుడు దక్షిణదిక్కుగా వెళుతున్నాడు*. *అతని వెంట కుంభకర్ణుడు ఇతర రాక్షసులు ఎర్రని పూలు ధరించి జుట్టు విరబోసుకుని దిగంబరులై యముని దిక్కుగా వెళుతున్నారు*. *విభీషణుడు తెల్లని వస్త్రములు ధరించి, తెల్లని పూలు ధరించి తెల్లని కొండపై మంత్రులతో కొలువు తీరటం నేను స్వప్నంలో చూసాను*. *సీతా! అలాగే రాముడు ఏనుగునెక్కి లక్ష్మణునితో కలసి సంతోషంగా పాయసం సేవిస్తున్నట్లు కనబడింది నా కల నిజమౌతుంది. నీవు నీ భర్తను త్వరగా చేరగలవు” అని పలికింది*.
*_రావణుడి ప్రేలాపన:_*
*రావణుడు సీత మీది మోహంతో అశోక వనానికి వచ్చి సీతతో “ఓ సీతా! నీ మీద నేను మనసు పడ్డాను. అన్న పానీయాలు విడిచి ఎందుకు నీవు ఇలా కృశిస్తావు*. *కృపతో నన్ను ఏలుకొమ్ము. నేను దేవతలను, యక్షులను, రాక్షసులను జయించిన వాడిని*. *ఎంతో మంది స్త్రీలు*
*నా ఆధీనంలో ఉన్నా నా మనసు*
*నీ మీద లగ్నం అయింది*. *రాజ్యం పోగొట్టుకుని పిచ్చి వాడి వలె అడవులలో తిరిగే అల్పుడైన రాముడు నా ముందెంత? నేను సకల లోకములకు ఈశ్వరుడను*. *రాక్షసులు, యక్షులు వేల సంఖ్యలో నన్ను కొలుస్తున్నారు. విశ్వవసుడు నా తండ్రి, కుబేరుడు నా అన్న. గంధర్వ కన్యలు, అప్సరసలు నన్ను సేవిస్తున్నారు. నన్ను పంచమ లోక పాలకుడని ముల్లోకాలు కీర్తిస్తున్నాయి. దేవేంద్రుని వద్ద నున్న సమస్తం నా వద్ద ఉన్నాయి. నా జీవితమునకు రాణివై నన్ను పాలించుము” అని పలికాడు.*
*సీత ఒక గడ్డి పోచను రావణునికి తనకు మధ్య పెట్టి “నేను పరస్త్రీని, అబలను, మానవాంగనను, పతివ్రతను* *నీవు రాక్షసుడవు నీయందు నాకేమాత్రం ప్రేమ లేదు. నాతో ఏమి సుఖిస్తావు*. *బ్రహ్మదేవుని మనుమడిని, కుబేరుని తమ్ముడిని అని చెప్పుకునే నీకు ధర్మం తెలవాలి.* *చెడు ప్రవర్తన విడిచి పెట్టాలి కాని ఇలా సిగ్గు లేకుండా మాట్లాడటం ధర్మమా?” అని సీత ఏడుస్తుంటే రావణుడు కొన్ని దుర్భాషలాడి వెళ్ళి పోయాడు*
*_వన పర్వము షష్టమాశ్వాసము సమాప్తం_* #మన సంప్రదాయాలు సమాచారం