P.Venkateswara Rao
678 views
4 months ago
#ఇది మన ప్రజాస్వామ్యం *అప్పటి వరకూ నిందలు మోయాల్సిందే❗* NOVEMBER 13, 2025🎯 “ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యం అంటారు” అనేది చిన్నప్పుడు అందరం చదువుకున్నాం. మనది కూడా ప్రజాస్వామ్య దేశమని రాజకీయ నాయకులు, ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు చెబుతూ ఉంటారు. కానీ, ఈ మధ్య జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మనం నిజంగా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదా అన్న సందేహం కలుగుతోంది. ఇంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఈ మధ్య జరుగుతున్న ఎన్నికలు, ఆ ఎన్నికల నిర్వహణ చూస్తుంటే చాలా మందికి అదే అనిపిస్తోంది. సాధారణంగా ఎక్కడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయిందంటే, అక్కడి సర్వాధికారాలు ఎన్నికల కమిషన్ (ఈసీ) చేతుల్లోకి వెళ్తాయి. పోలీసులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు మొత్తం ఎన్నికల కమిషన్ చెప్పిందే వినాలి. నిజంగా ఇక్కడ అధికారులు కూడా నాయకుల మాట కంటే ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ మాటే తూచా తప్పకుండా పాటిస్తారు. కానీ, ఇక్కడే అందరికీ అనుమానం కలుగుతోంది. సాధారణ ఎన్నికలు కానీ, ఉప ఎన్నికలు కానీ జరుగుతున్న సమయంలో ఒక పార్టీకి చెందిన వారినే అధికారులు ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. “ఫలానా పార్టీకి చెందిన వ్యక్తి టైమ్ దాటినా తర్వాత ప్రచారం చేశాడు”, “ఫలానా వ్యక్తి ఓటర్లకు భోజనాలు పెట్టాడు” అంటూ కేసులు పెట్టడం కనిపిస్తోంది. ఇంకో పార్టీకి చెందిన నాయకులు అంతకంటే ఎక్కువ టైం ప్రచారం చేస్తుంటారు, బోజనాలు పెడుతునే ఉంటారు. అలాగే కొన్ని పార్టీలు ఎన్నికల ముందు నుంచే తమకు కావాల్సిన అధికారులను తమకు నచ్చిన ప్రాంతాల్లోకి పెట్టించుకుంటారు, అలాగే కొత్తగా లక్షలాదిగా ఓటర్లను ఓట్ల లిస్ట్లో ఎక్కించుకుంటాయి. ఎప్పటినుంచో కూర్చున్న అధికారులకు సైతం పెద్ద పెద్ద అధికారాలు దక్కుతాయి. వేలల్లో కొత్త ఓటర్లు పుట్టుకొస్తారు. దానిపై ఏ పార్టీ అయినా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తే “విచారణ చేయిస్తాం” అంటారు. ఆ విచారణ పూర్తయ్యేలోగా ఎన్నికలు అయిపోతాయి. “ఫలానా అధికారులు మా పార్టీని ఇబ్బంది పెడుతున్నారు” అంటూ రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేసినా, “విచారణ చేయిస్తాం” అంటూనే వారితోనే ఎన్నికలు జరిపిస్తారు. తీరా, ఆ అధికారుల వల్ల వారికి జరిగిన నష్టానికి పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ మధ్య ఓటు చోరీ పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో సహా ఓటర్ల జాబితాను మీడియా ముందు పెట్టినా, ఎన్నికల కమిషన్ రియాక్ట్ కాలేదు. సీసీ కెమెరాలు ఇవ్వమంటే "వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం” అని చెబుతూనే, తమకు ఇష్టం లేని పార్టీకి చెందిన వ్యక్తులకు డ్యామేజ్ కలిగించే వీడియోలు మాత్రం వారికి నచ్చిన పార్టీలకు ఇస్తుంటే ఇది ఎటువంటి స్వేచ్ఛో ఎవరికీ అర్థం కాదు. చనిపోయినా వారి ఓట్లు, ఊరిలో లేని వారి ఓట్లు పోలింగ్ రోజున పడుతున్నాయంటే మన కమిషన్ ఎంత గొప్పగా పని చేస్తుందో అంచనా వేయొచ్చు. ఎన్నికలు జరిగే ప్రతి సారి నాయకులు “ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది”, “ఆ పార్టీ యథేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడింది" అని విమర్శలు చేస్తూనే ఉంటారు. మరోవైపు ఎన్నికల కమిషన్ మాత్రం "ఎప్పుడూ జరగని విధంగా ఈ సారి ఎన్నికలు జరిపించాం” అంటూ ప్రెస్ మీట్లు పెడుతుంది. నిజానికి సామాన్య ఓటర్లకు మాత్రం ఎన్నికల కమిషన్ చూపించే పక్షపాతం కళ్లకు కట్టినట్టే కనిపిస్తోంది. ఎన్నికల కమిషన్ విధులను ఆయా అధికారులు సక్రమంగా పాటిస్తే, కనీసం ఎన్నికలపై ఓటర్లకు నమ్మకం కలుగుతుంది. ఎన్నికల కమిషన్, నాయకుల నిర్వాకాల వల్ల ఇప్పటికే చాలా మంది ఓటు వేయడానికి వెళ్లడం లేదు. కొన్ని చోట్ల 20-30 శాతం ఓట్లు కూడా పోలింగ్ కాకపోవడం చూస్తే, ఎన్నికలపై ఎంత విశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల సమయంలో అధికారులు, నాయకులపై ఏవైనా ఫిర్యాదులు వస్తే త్వరితగతిన చర్యలు తీసుకుంటూ, ఒక పార్టీకి ఒక న్యాయం, ఇంకో పార్టీకి మరో న్యాయం లాంటివి లేకుండా ఎన్నికలు జరిపిస్తే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేదంటే మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్యం పుస్తకాలకే పరిమితం అవుతుంది. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. లేదంటే నిందలు మోయాల్సిందే.