#🗞️డిసెంబర్ 1st ముఖ్యాంశాలు💬
రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు షురూ..
ధాన్యం రవాణాకు జీపీఎస్ వాహనం తప్పనిసరి
ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక మార్గదర్శకాలు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం, డిసెంబర్ 01: ఖరీఫ్ 2025-26 సీజన్కు సంబంధించి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రతి రైతు సేవా కేంద్రాన్ని (ఆర్ఎస్కే) ధాన్యం కొనుగోలు కేంద్రంగా గుర్తించి, ప్రభుత్వం ద్వారా నేరుగా ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ ప్రకటన ప్రకారం రైతులు తాము పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు లోబడి, ముఖ్యంగా తేమ శాతం 17 శాతానికి మించకుండా ఆరబెట్టుకుని, తమకు దగ్గరలోని రైతు సేవా కేంద్రాలలో విక్రయించి పూర్తి మద్దతు ధర పొందవచ్చని సూచించారు.
ధాన్యం కొనుగోలుకు ముఖ్య మార్గదర్శకాలు:
* షెడ్యూలింగ్ సౌలభ్యం: రైతులు తమకు అనువైన తేదీన, సమయాన ధాన్యం అమ్ముకునేందుకు వీలుగా, రైతు సేవా కేంద్రంలోగానీ లేదా వాట్సాప్ ద్వారా గానీ షెడ్యూల్ చేసుకుని కూపన్ పొందవచ్చు.
* మిల్లు ఎంపిక స్వేచ్ఛ: తమ ధాన్యాన్ని ఏ మిల్లుకు పంపించాలో రైతులే సొంతంగా నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం కల్పించింది.
* రవాణా ఛార్జీల చెల్లింపు: రవాణా రైతు ఏర్పాటు చేసుకున్నప్పటికీ, మిల్లు మండలం లో ఎంత దూరమైనా సరే, రవాణా ఖర్చు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోకి ప్రభుత్వం జమ చేస్తుంది.
పారదర్శకత కోసం జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి
ధాన్యం రవాణాలో అవకతవకలు జరగకుండా పూర్తి పారదర్శకత కోసం కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
* జీపీఎస్ వాహనాలు: ధాన్యం కళ్లo నుండి మిల్లుకు చేరే వరకు ప్రతి వాహనాన్ని జీపీఎస్ పరికరం ద్వారా ప్రభుత్వం ట్రాక్ చేస్తుంది.
* తప్పనిసరి నిబంధన: ప్రతి ఆర్ఎస్కే వద్ద జీపీఎస్ పరికరం అమర్చబడిన వాహనాలు అందుబాటులో ఉంచబడతాయి. రైతులు తప్పనిసరిగా రైతు సేవా కేంద్రం ద్వారా జీపీఎస్ వాహనాలలోనే ధాన్యాన్ని తరలించాలి. జీపీఎస్ లేని వాహనంలో తరలించడం అనుమతించబడదు.
* ట్రక్ చిట్ విధానం: ట్రక్ చిట్ జెనరేట్ అయినప్పటి నుండి ట్రిప్ ట్రాకింగ్ మొదలవుతుంది. మిల్లు వద్దకు చేరిన వెంటనే ముగుస్తుంది. ముందుగా మిల్లుకు ధాన్యం పంపడం లేదా మిల్లులో ట్రక్ చిట్ జెనరేట్ చేయడం నిషిద్ధం.
ఎఫ్టీఓ, చెల్లింపు ప్రక్రియ
* కస్టోడియన్ ఆఫీసర్: ప్రతి మిల్లు వద్ద జిల్లా యంత్రాంగం ఒక కస్టోడియన్ ఆఫీసర్ (సీఎస్డీటీ/ఆర్ఐ/వీఆర్వో) ను నియమించింది. మిల్లు వద్ద ధాన్యాన్ని దింపించడం, మిల్లర్లు ధాన్యం ముట్టినట్టు అక్నాలెడ్జ్ చేయించడం, రసీదు తీసుకోవడం ఈ అధికారి బాధ్యత.
* ఎఫ్.టి.ఓ. జనరేషన్: ధాన్యం తూకం పూర్తయ్యాక, రైతు సేవా కేంద్రం సిబ్బంది ట్రక్ షీట్తో పాటు ఎఫ్టీఓ (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) ను జనరేట్ చేసి రైతుకు అందించాలి. ఎఫ్టీఓ జనరేట్ చేయడానికి రైతు యొక్క వేలిముద్ర లేదా ఓటీపీ తప్పనిసరి.
* డబ్బు జమ: ఎఫ్.టి.ఓ, మిల్లు అక్నాలెడ్జ్మెంట్ రెండూ పూర్తయిన తర్వాతనే రైతు ఖాతాలో డబ్బు జమ అవుతుంది.
ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు
ధాన్యం అమ్మకంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే పరిష్కరించడం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1967 మరియు జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్ 9963479141 లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే, ఆర్ఎస్కే వద్ద ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి కూడా తమ అభిప్రాయం లేదా సమస్యలను ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.
#🌅శుభోదయం #📰ఈరోజు అప్డేట్స్ #🗞️డిసెంబర్ 2nd ముఖ్యాంశాలు💬 #🆕Current అప్డేట్స్📢