6️⃣2️⃣.
*_శ్రీ మహావిష్ణు పురాణం_*
*_(అరవై రెండవ భాగం)_*
*_పురూరవ చక్రవర్తి కథ:_*
*చంద్రుని మనవడు, బుధుడి కుమారుడైన పురూరవుడు భూమండలానికి చక్రవర్తి అయ్యి పరిపాలించసాగాడు.* *పురూరవుడు అనేక యజ్ఞయాగాదులు చేసి భూమండలానికి సుఖసంతోషాలు ప్రసాదించాడు. మహా దాన శీలి అయిన పురూరవుడు ధర్మ పాలన చేసి అటు దేవతలు, ఇటు మహర్షుల ప్రశంసలు పొందాడు. భూమిని మోసే ఆదిశేషుడు కూడా భూమిని ధర్మబద్ధంగా ఉంచినందుకు పురూరవుని ప్రశంసించాడు.*
*మిత్రావరణ మహర్షి శాపం చేత ఊర్వశి దేవలోకం వీడి భూమిపై కొంతకాలం నివసించ వలసి వచ్చింది.* *పురూరవుని రాజ్యం సరైనది అని తెలిసి అక్కడ ఒక వనంలో నివసించ సాగింది. విహారానికి వనానికి వచ్చిన పురూరవుడు ఊర్వశిని చూసి ఆమె అందానికి మోహితుడయ్యాడు*. *ఊర్వశి కూడా పురూరవుని ఇష్టపడింది. అయితే కలసి ఉండటానికి రెండు నిబంధనలు పెట్టింది.*
*“రాజా నేను శాపము వలన భూలోకంలో కొంతకాలం నివసించాలి. ఆ సమయం నీతో గడిపి కాపురం చేయడానికి అభ్యంతరం లేదు*. *కానీ రెండు నిబంధనలు ఉన్నాయి. అవి అతిక్రమించిన నాడు నిన్ను వదలి వెళ్లిపోతాను*.
*మొదటిది: నా దగ్గర రెండు మేషములు(మేకలు) ఉన్నాయి. అవి అంటే నాకు చాలా ఇష్టము. వాటి రక్షణ భారం నీవు వహించాలి. వాటి అపహరణ జరిగినా, వాటిని బాధించినా నేను నిన్ను వదిలేస్తాను. రెండవది: నీవువస్త్రములు లేకుండా నాకు కనపడకూడదు. నిన్ను అలా చూస్తే వెంటనే వదలి శాశ్వతంగా వెళ్లి పోతాను” అని ఊర్వశి చెప్పింది*.
*పురూరవుడు ఊర్వశి నిబంధనలకు అంగీకరించాడు*.
*ఊర్వశి వచ్చి పురూరవునితో రాజభవ నంలో ఉండసాగింది. ఇరువురు అరవై వేల సంవత్సరాలు దాంపత్య జీవనం గడిపారు. శాప సమయం ముగిసినా పురూరవుడు నియమాలు పాటించి ఉండటంతో ఊర్వశి పురూరవుని తోనే ఉండసాగింది*.
*శాపం సమయం గడచినా ఊర్వశి రాకపోవడంతో ఇంద్రుడు కారణం ఏమిటా అని ఆలోచించాడు*. *పురూరవుడు ఊర్వశి పెట్టిన నిబంధనలు ఆచరిస్తూ ఉండటం వలన ఊర్వశి అతనితోనే ఉన్నది అని తెలిసింది. విశ్వావసుడు అనే గంధర్వునకు పురూరవుని ఊర్వశిని విడదీసే బాధ్యత అప్పగించి పంపాడు*.
*విశ్వావసుడు అదృశ్యరూపంతో అర్ధరాత్రి సమయంలో పురూరవుని అంతఃపురంలోకి ప్రవేశించాడు*.
*ఊర్వశి పురూరవుడు ఏకశయ్యాగతులై గాఢనిద్రలో ఉన్నారు. అక్కడే సమీపంలో కట్టేసి ఉన్న మేషములలో ఒక దానిని అపహరించాడు. ఆ మేక గట్టిగా అరవసాగింది. ఊర్వశి మేలుకుని “పురూరవ! నా మేషాన్ని అపహరిస్తున్నారు. రక్షించు” అని రోదిస్తూ అడిగింది*.
*మేలుకున్న పురూరవుడు లేచి వెళ్ళడానికి సంకోచించాడు. ఎందుకంటే అతని శరీరము పై వస్త్రాలు లేవు.*
*అదృశ్యరూపంలో ఉన్న విశ్వావసుడు గమనించి రెండవమేషాన్ని కూడా అపహరించాడు. అది అరుస్తుంటే ఊర్వశి మరింతగట్టిగా “నేను పౌరుషం లేని మానవుని వలచినందుకే ఈ కష్టాలు పడవలసి వస్తోంది” అని రోదించసాగింది*.
*పురూరవునికి పౌరుషం వచ్చింది. ‘చీకటిలో వస్త్రాలు లేకపోయినా కనపడను కదా’ అనుకుని మంచం మీద నుంచి దిగి కత్తి పట్టుకుని వెతకసాగాడు*.
*చీకటిలో ఊర్వశికి పురూరవుని నగ్న శరీరం కనపడలేదు. ఇది గ్రహించిన విశ్వావసుడు తన మాయాశక్తితో శయన మందిరపు దీపాలు వెలిగించి ప్రకాశమయం చేసాడు. ఆ వెలుగులోకి ఊర్వశి పురూరవుని నగ్న శరీరము చూసింది. పురూరవుని ప్రతిజ్ఞ భగ్నం కావడంతో వెంటనే అదృశ్యమయ్యింది*.
*ఊర్వశిని ప్రాణాధికంగా ఇష్టపడిన పురూరవుడు ఊర్వశి వియోగంతో పిచ్చివాడు అయ్యాడు. రాజ్యం వదలి వనాల వెంట ఊర్వశిని వెతుకుతూ తిరుగుతూ కురుక్షేత్రం చేరాడు. అక్కడ ఒక సరోవరంలో తోటి అప్సరసలతో కలసి ఊర్వశి జలకాలాడుతోంది. ఊర్వశిని చూడగానే పురూరవునికి ప్రాణం లేచి వచ్చింది. ‘ఊర్వశీ’ అని పిలుస్తూ దగ్గరకు వచ్చిన పురూరవుని పరిస్థితి చూసి ఊర్వశి బాధపడింది.*
*“రాజా! నేను నీ వలన గర్భవతి అయ్యాను. సంవత్సరం తరువాత వస్తే నీకు కుమారుని ఇస్తాను. ఆ రోజు తప్పక నీతో కలసి గడుపుతాను" అని స్వర్గానికి వెళ్లి పోయింది.*
*మనశ్శాంతి పొందిన పురూరవుడు మాములు మనిషియై సంతోషంతో తన రాజ్యానికి వెళ్లి పరిపాలనలో మునిగిపోయాడు*.
*సంవత్సరం తర్వాత కురుక్షేత్రం వచ్చిన పురూరవునికి ఊర్వశి తాను కన్న కుమారుని అప్పగించింది. పురూరవుని కోరిక పై అక్కడ అతనితో దాంపత్య జీవనం గడిపింది. ఫలితంగా వారికి మరో ఐదుగురు పుత్రులు జన్మించారు. ఊర్వశి వెళ్లిపోయే సమయం వచ్చింది. అప్పుడు వారిని విడదీసిన గంధర్వుడు ప్రత్యక్షమై “ఇంద్రుని కోరిక పై మిమ్మలి విడదీసాను. ఆ దోష పరిహారార్ధం ఒక వరము ఇస్తాను, కోరుకో!” అని పురూరవుని అడిగాడు*.
*“నాకు జీవించి ఉన్నంతవరకు ఊర్వశితోనే జీవితం గడపాలని కోరిక ఉంది” అని పురూరవుడు తన కోరిక చెప్పాడు*.
*గంధర్వుడు నవ్వి ఒక అగ్నిఘటం* *(నిప్పు ఉన్న కుండ) ఇచ్చి )*
*“ఈ అగ్నిని ఆగమశాస్త్రానుసారంగా త్రిధాకరించి నీ కోరిక సంకల్పంతో చెప్పుకుని వేల్చుము*. *నీ కోరిక తీరుస్తుంది” అని అదృశ్యమయ్యాడు.*
*అగ్నిఘటం అరణ్యమార్గంలో తీసుకువెళుతూ పురూరవుడు “నేను వరం కోరకున్నప్పుడు ఊర్వశిని పంపమని కోరుకోకుండా గంధర్వుడు ఇచ్చిన నిప్పుల కుండ తీసుకున్నానే” అని బాధపడి ఆ కుండ అక్కడ వదిలి వెళ్లిపోయాడు*
*రాజ్యానికి వచ్చాక “అగ్నిని తెచ్చి యాగం చేసుకుని ఉంటే ఊర్వశి శాశ్వతంగా దక్కుతుంది కదా” అని పునరాలోచన చేసి అరణ్యానికి వెళ్లాడు*.
*అగ్నిఘటం వదిలిన చోటులో ఒక అశ్వత్థ వృక్షము మొలచి ఉంటుంది*.
*పురూరవుడు ఆ అశ్వత్థ వృక్ష మూలము సేకరించి రాజ్యానికి వచ్చి అశ్వత్థ వృక్ష మూలము అరణిగా చేసుకుని హోమం చేశాడు*.
*తన కోరిక సంకల్పంతో చెప్పుకుని ఆహుతులను అర్పించి యాగం పూర్తి చేశాడు. ఫలితంగా పురూరవుడు దేవ లోకం చేరి ఊర్వశితో తన జీవితాంతం వరకు కలిసి సుఖించాడు* #మన సంప్రదాయాలు సమాచారం