ఒకసారి మంచి స్నేహితులు మరియు బాబా భక్తులైన ఇద్దరి మధ్య ఒక సందర్భంలో భేదాభిప్రాయం వచ్చింది. ఒక మిత్రుడు మనసు బాగాలేక రెండవ మిత్రునితో కొంచెం కటువుగా మాట్లాడాడు. అందుకు రెండవ వ్యక్తి చాలా నొచ్చుకున్నాడు. అందువలన తాను వెంటనే మొదటి వ్యక్తితో బంధం తెంచుకుందామని భావించి, ఆ వ్యక్తి దగ్గరనున్న తన పుస్తకాలను తిరిగి తీసుకున్నాడు. వారిరువురూ నాకు మంచి స్నేహితులు కావడం వలన వారి వివాదం నా వద్దకు వచ్చింది. అప్పుడు నేను, కటువుగా మాట్లాడిన వ్యక్తితో “నీవు ఎవరితోనూ కోపించి మాట్లాడవద్దు. చెడుగా మాట్లాడవద్దు. ఎవరి గురించైనా నీవు చెడుగా మాట్లాడితే నాకు చాలా బాధ కలుగుతుంది” అనే బాబా బోధను చెప్పాను. ఆ మాటలలో సూక్ష్మాన్ని గ్రహించిన నా మిత్రునికి “అరే, ఎంత అయోగ్యమైన పని చేశాను. కటువుగా మాట్లాడి నా చిరకాల మిత్రుని బాధించడమే కాకుండా, బాబాను కూడా బాధించాను” అని పశ్చాత్తాపం కలిగింది. తరువాత నా రెండవ మిత్రునికి, " మేమెటువంటివారమంటే గొడవ పడినప్పుడు పెనుగు లాటలో ఒకరి మీద ఒకరం కూర్చుంటాం, కానీ, ఒకరిని ఇంకొకరం ఎప్పటికీ వదులుకోము” అనే బాబా యొక్క ఇంకొక బోధను చెప్పాను. అప్పుడు ఆ మిత్రుడు " అరే, నా మిత్రుడు నాతో కొంచెం కటువుగా మాట్లాడాడన్న కారణంగా, తనతో వెంటనే మిత్రబంధం త్రెంచుకోవడానికి సిద్ధపడ్డాను. అటువంటి ప్రవర్తనను బాబా అసలు ఇష్టపడరు” అని బాధపడ్డారు. అలా ఆ ఇరువురి మిత్రులకి బాబా బోధల వలన, వారి వారి ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం కలిగి, వారు మరలా మునుపటి మాదిరిగానే మంచి స్నేహితులయ్యారు.
శ్రీ కాకాసాహెబ్ దీక్షిత్ (దీక్షిత్ డైరీ) నుండి
#సాయి