* శ్రీ రాముని గురించి మనలో చాలా మందికి తెలియని నిజాలు.... ✍️🇮🇳🙌🌿
*ఇదే రామరాజ్యం... ✍️🇮🇳
——————————
*రామాయణం వంటి ఇతిహాసాలను అడ్డుపెట్టుకుని మత వాద శక్తులు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఇటీవల కాలంలోనే మనకు కన్పించాయి. నిజానికి రాముడు ఎటువంటి వాడో, ఆయన రాజ్యపాలన ఏ విధంగా ఉండేదో తెలిస్తే ఈ మత తత్వ వాదుల వాదనలలోని పస మనకు అర్థం కాదు. అందుకే రాజ్యాంగ నిర్మాత డా||బి.ఆర్.అంబేద్కర్ స్వయంగా వాల్మీకి రామాయణాన్ని చదివి అందులోని రామునికి సంబంధించిన నిజాలను సామాన్యులకు తెలియజేస్తూ ఓ పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం నుంచి గ్రహించిన వ్యాసమే ఇది.
మహారాజు అయిన రాముని ప్రవర్తన ఎలాంటిదో తెలియజేయడానికి కొన్ని విషయాలు వెలుగులోకి తెస్తాను. రాముణ్ణి ఒక ఆదర్శప్రాయుడైన రాజుగా అభివర్ణిస్తారు. ఆ అభిప్రాయం ఏవైనా వాస్తవాల ఆధారంతో ఏర్పరచు కొన్నదేనా? నిజం చెప్పాలంటే, రాముడు ఎప్పుడూ రాజ్యపరిపాలన చేయలేదు. నామమాత్రానికే ఆయన రాజు. పరిపాలనా భారం అంతా తమ్ముడైన భరతునికి అప్పగించాడని వాల్మీకి చెబుతాడు. రాజ్య వ్యవహారాలు, ప్రజల మంచిచెడ్డలు, బాధలు ఆయన ఎన్నడూ పట్టించుకోలేదు. రాజయిన నాటి నుంచీ, రాముని దినచర్యను, దైనందిన జీవితాన్నీ చాలా వివరంగా వాల్మీకి వర్ణించాడు.
ఆయన రాసినదాని ప్రకారం రోజును రెండు భాగాలుగా విభజించవచ్చు. మధ్యాహ్నం వరకు ఒకటి, ఆ తర్వాత రెండు. మధ్యాహ్నం వరకు రాముడు పూజా పురస్కారాలలో, ఆరాధనా కార్యక్రమాలలో మునిగిపోయేవాడు. మధ్యాహ్నం తరువాత ఒక రోజు విదూషకులతోను, మరొకరోజు అంత:పుర కాంతలతోను గడుపుతూ ఉండేవాడు. అంత:పుర కాంతలతో ఆయనకు విసుగెత్తినప్పుడు విదూషకులతో గడిపేవాడు. విదూషకులతో విసుగెత్తినప్పుడు అంత:పుర కాంతల దగ్గరకు వెళ్లేవాడు. అంత:పుర కాంతలతో రాముడు ఏవిధంగా కాలక్షేపం చేసేవాడో వాల్మీకి చాలా వివరంగా వర్ణించాడు. ఈ అంత:పురం అశోకవనంలో ఉండేది. రాముడు అక్కడ భోజనం చేస్తూ ఉండేవాడు. ఆయన భోజనం పంచభక్ష్య పరమాన్నాలతో చాలా రుచిగా ఉండేదని వాల్మీకి రాస్తాడు.
ఇందులో మాంసం, పండ్లు, మద్యం, తప్పక ఉండేవి. రాముడు మద్యం ముట్టనివాడేమీ కాదు. చాలా అధికంగా ఆయన మద్యపానం చేసేవాడు. సీతకూడా తనతో కలసి మద్యం సేవించేలా రాముడు చేసేవాడని వాల్మీకి రాస్తాడు. వాల్మీకి వర్ణించిన రాముని అంత:పుర కాంతలను చూస్తే వారేమీ తక్కువ కాదనిపిస్తుంది. నృత్యసంగీతాలలో ప్రవీణురాండ్రయిన అప్సరసలు, నాగకన్యలు, కిన్నెరలు ఉండేవారు. వీరేగాక వివిధ దేశాల నుంచి తెచ్చుకున్న సుందరాంగులు కూడా ఉండేవారు. మద్యం సేవిస్తూ, నృత్యం చేస్తూ ఆ స్త్రీల మధ్య రాముడు కాలం గడుపుతుండేవాడు. రాముణ్ణి వారు ఆనందపరిచేవారు. రాముడు వారికి పూలహారాలు వేసేవాడు. వాల్మీకి రాముణ్ణి ''స్త్రీలోలురలో రాజకుమారుడు'' అని పిలిచేవాడు. ఇది ఒక రోజు కథ కాదు. ఆయన జీవన విధానమే అంత.
ఇదివరకే చెప్పినట్లుగా రాముడు ఎప్పుడూ ప్రజల మంచిచెడ్డలు పట్టించుకోలేదు. ప్రజలకు జరిగిన అన్యాయాలను విచారించి, వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయడమనేది అనాదిగా భారతీయ రాజులు పాటిస్తున్న నియమం. దానిని ఆయన ఎన్నడూ పాటించలేదు. తన ప్రజల గోడును రాముడు ఒకే ఒకసారి స్వయంగా విన్నట్లు వాల్మీకి ఉటంకిస్తాడు. కానీ ఆసంఘటన దురదృష్టవశాత్తు విషాద ఘట్టమయింది.
ఒక దోషాన్ని సవరించే పని నెత్తినవేసుకున్న ప్రయత్నంలో చరిత్రలో ఎక్కడా నమోదుకాని ఒక ఘోర దురంతానికి రాముడు ఒడిగట్టాడు. అదే శూద్రుడైన 'శంబుక వధ' గాథ.
రాముని పరిపాలనలో అకాల మరణాలు ఉండేవి కావని వాల్మీకి అంటాడు. అయితే ఎందుకనో ఒక బ్రాహ్మణ కుమారుడు అకాల మరణానికి గురయ్యాడు. శోకతప్తుడైన తండ్రి తన కుమారుని మృత దేహాన్ని మోసుకొని వెళ్ళి రాజప్రసాద ద్వారం ముందు ఉంచి బిగ్గరగా రోదిస్తూ తన కుమారుడి మరణానికి రాముణ్ణి నిందిస్తూ ఉన్నాడు. రాముని పరిపాలనలో ఎక్కడో పాపం జరిగిందని దాని ఫలితంగానే తన కుమారుడు మరణించాడనీ, ఆ పాపాన్ని హరించకపోయినట్లయితే రాజే స్వయంగా నేరం చేసినవాడవుతాడని తన కుమారుణ్ణి గనుక తిరిగి బతికించకపోయినట్లయితే రామునికి వ్యతిరేకంగా రాజప్రసాదం ఎదుటనే ధర్నా చేస్తూ తన ప్రాణాన్ని కూడా అంతం చేసుకుంటానని బెదిరించాడు. దానిమీదట రాముడు తన కొలువులో ఉన్న విద్వాంసులైన ఎనిమిదిమంది రుషులతో సంప్రదింపులు జరిపాడు.
వారిలో నారదుడు రాముని రాజ్యంలో ఎవరో శూద్రుడు తపస్సు చేస్తున్నాడనీ తద్వారా ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాడనీ రామునితో చెప్పాడు; ఎందుకంటే ధర్మసూత్రాల ప్రకారం తపస్సు చేసే ఆచారం ద్విజులకు మాత్రమే ఉంటుంది. శూద్రుల కర్తవ్యం ఏమంటే ద్విజులకు సేవ చేయటమే. ఒక సూద్రుడు ఆవిధంగా తపస్సు చేయటం ద్వారా ధర్మాన్ని అతిక్రమిస్తున్నందువల్లనే బ్రాహ్మణ కుమారుడు మరణించి ఉంటాడని రామునికి గట్టి నమ్మకం కుదిరింది. అంతే, వెంటనే రాముడు వాయురథం ఎక్కి నేరస్థునికోసం రాజ్య మంతా వెతకటం మొదలుపెట్టాడు.
ఆఖరికి దక్షిణానికి దూరంగా ఎక్కడో ఒక అడవి ప్రాంతంలో ఒకరకమైన కఠోర తపస్సు చేస్తున్న మనిషిని వీక్షించాడు. అంతే, రాముడు ఆ మనిషిని సమీపించి, అతనెవరో ప్రశ్నవేసి అతనొక శూద్రుడని, అతనిపేరు శంబుకుడని బొందితో కైలాసానికి వెళ్లడం కోసం ఘోరమైన తపస్సు చేస్తున్నాడని తెలుసుకోవడం తప్ప, ఇంక ఏమీ కనీసం హెచ్చరికలాంటిది అయినా చేయకుండా, పోనీ తపస్సు మానివేయమని నచ్చచెప్పడం లాంటిది కూడా చేయకుండా అతని శిరస్సును నరికివేశాడు. అంతే! ఆశ్చర్యం! అతని తల నేలకు పడగానే ఎక్కడో దూరంగా ఉన్న అయోధ్యలో మరణించిన బ్రాహ్మణ బాలుడు తిరిగి శ్వాస పీల్చుకోవడం ఆరంభించాడు.
ఇక్కడ, ఈ అరణ్యంలో అర్హత లేని ఒక శూద్రుడు తపోమహిమతో దేవలోకంలోకి ప్రవేశించకుండా నిరోధించినందుకు ఆనందం పట్టలేక దేవతలు రాముని మీద పూల వర్షం కురిపించారు. అంతటితో ఆగక, ఆ అడవిలో ప్రత్యక్షమై తాను చేసిన పనికి రాముణ్ణి అభినందించారు.అయోధ్యలో రాజప్రసాదం ముందు చనిపోయి పడిఉన్న బ్రాహ్మణ కుమారుని తిరిగి బతికించవలసిందిగా ఆ దేవతలను రాముడు ప్రార్థిస్తే అతను ఎప్పుడో బతికి వచ్చాడని వారు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత వారు అంతర్ధానమయ్యారు.
రాముడు అక్కడకు సమీపంలో ఉన్న ఆగస్త్య మహాముని ఆశ్రమంకు వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే శంబుకుని చంపడానికి రాముడు తీసుకున్న నిర్ణయం ఎంతో సముచితమైనదని, అందుకు అతణ్ణి అభినందించి ఒక దివ్యమణి కంకణాన్ని రామునికి బహూకరించాడు. రాముడు ఆ తరువాత రాజధానికి తిరిగివచ్చాడు. అటువంటివాడు రాముడు.
(అంబేద్కర్ రాసిన ''ది రిడిల్ ఆఫ్ రామా అండ్ కృష్ణా'' తెలుగు అనువాదం 'రాముని కృష్ణుని రహస్యాలు' నుంచి... ✍️🇮🇳🙌
*
#🇮🇳 మన దేశ సంస్కృతి #🛕అయోధ్య రామ మందిరం🙏 #📙ఆధ్యాత్మిక మాటలు