Ravi Talluri
546 views
11 hours ago
*_26/04/2026 - వైశాఖ శుద్ధ దశమి - శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన_* *సత్యాన్ని వెతుకుతూ పోయి దాని ఆధారంగా ఉండే బ్రహ్మం ఇదేనని తెలుసుకోగలిగితే మానవ జీవితానికి అంతకు మించిన పరమార్ధం లేదు. సామాన్యులు కూడా సత్యాన్ని తెలుసుకోవచ్చు, బ్రహ్మజ్ఞానాన్ని పొందవచ్చు అని వివరించేవే బ్రహ్మంగారి తత్త్వాలు. కాలజ్ఞాని, దైవస్వరూపుడు అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన తత్త్వాలే బ్రహ్మంగారి తత్త్వాలుగా లోకంలో ప్రచారంలోకి వచ్చాయి*. *పదిహేడో శతాబ్దం మధ్యకాలం నుంచి బ్రహ్మంగారి కాలజ్ఞాన వచనాలు, గోవింద నామాలు, తత్త్వాలు, ద్విపదలు, పాటలు, కందార్ధ దరువులు, వచనాలు అన్నీ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లాయి. అభ్యుదయ భావాలతో నిండి వినడానికి మధురంగా, జ్ఞానసుబోధకంగా ఉండడమే బ్రహ్మంగారి తత్త్వాల ప్రత్యేకత. ఆయన సృష్టించిన ఇతర సాహిత్యం నిండా తత్త్వోపదేశంతో పాటు, ఆనాటి భాషా సౌందర్యం, పడికట్టు పదాలు కనిపిస్తాయి. సామాజిక చైతన్యం కలిగిస్తూ అస్పృశ్యత, మద్యపానం తదితర సామాజిక రుగ్మతలను దుయ్యబడుతున్నట్లుగా కనిపిస్తాయి ఆయన తత్త్వాలు. మత సామరస్యం, శాంతి కామనల అవసరాన్ని తెలియ చెబుతూ ఉంటాయి. అలాగే బ్రహ్మంగారి సాహిత్యంలో సామాజిక పరంగా ఆర్ధిక సమానత్వం లాంటి అంశాల ప్రస్తావన కూడా కనిపిస్తుంది*. *_కాలజ్ఞాన తత్వాలు_* *బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో తత్త్వాలు ఒక విభాగం. ఇవి మౌఖిక " సాహిత్యంగా ఆనోట ఆనోట బహుళ ప్రచారంలో ఉన్నాయి. తత్త్వం అంటే పరమాత్మ అని, స్వభావం అని అర్థాలున్నాయి. పరమాత్మను గురించిన అనేకానేక అంశాలను గురించి గేయరూపంలో చెప్పినవే బ్రహ్మంగారి తత్త్వాలు. గేయరూపంలోనే కాకుండా పద్యపూర్వకంగా అనేక ఛందస్సుల్లో కూడా కాలజ్ఞాన తత్త్వరచన కనిపిస్తుంది. ‘పోతులూరి వీరబ్రహ్మముగారి కాలజ్ఞాన తత్త్వములు' సంకలనంలో బ్రహ్మంగారి తత్త్వాలతో పాటు, ఆయన శిష్యులైన సిద్ధయ్య లాంటివారి తత్త్వాలు కూడా కనిపిస్తాయి. కేవలం బ్రహ్మంగారి తత్త్వాలన్నీ ఒక వరుసలో మాత్రం ఎక్కడా కనిపించవు. కాలజ్ఞాన గ్రంథంలో వచనం, ద్విపద, జీవైక్యబోధ, గోవింద వాక్యాలు, తత్త్వాలు ఉన్న విషయాన్ని ఎందరెందరో పరిశోధకులు వివరించారు*. *_వీరగురుడు_* *పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వేదాంతానికి పునాది సంస్కరణవాదం. కాలజ్ఞాన ప్రబోధం చేయడం వెనుక ఆయన లక్ష్యం ప్రజలను కర్తవ్యోన్ముఖులను చేయడమే. పదిహేడో శతాబ్దంలో జన్మించిన స్వామి బనగానపల్లె ప్రజలకు మహిమలు చూపి గురుఅవతారంగా కీర్తినందుకున్నారు. కలియుగంలో జరగబోయే ఎన్నో సంఘటనలు తెలిపారు. భక్తులను తరింపజేసే వీరనారాయణ మంత్రోపదేశం చేసి 'వీరగురు 'డయ్యారు. 1693లో జీవ సమాధిలోకి ప్రవేశించారు*. *బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి పొందిన ఆంధ్రప్రదేశ్ కడపజిల్లా కందిమల్లయ్య పల్లెలోని శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠంలో వైశాఖ శుద్ధ దశమినాడు ఆరాధనోత్సవం వైభవంగా జరుగుతుంది. ఏటా శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి 32 రోజుల దీక్షను ధరించిన భక్తులు ఆరాధన సమయంలో దీక్షావిరమణ చేస్తారు.* #మన సంప్రదాయాలు సమాచారం