Ravi Talluri
17.5K views
9 hours ago
6️⃣6️⃣ *_శ్రీ మహావిష్ణు పురాణం_* *_(అరవై ఆరవ భాగం)_* *_పరశురామ అవతారం:_* *తండ్రి ఆదేశంతో చంపిన..* *_తల్లి సోదరులను_*. *_తండ్రి ఇచ్చిన వరముతో పరశురాముడు బ్రతికించుకునుట:_* *కార్తవీర్యార్జునుడిని చక్రవర్తిగా అంగీకరించి సమస్త రాజ్యాల రాజులు సామంతులై అమూల్యమైన వస్తువులు కానుకలుగా సమర్పించారు*. *కార్తవీర్యార్జునుడు బలపరాక్రములు ఎదిరించే వారు లేకపోవడంతో అహంకారం, గర్వం వచ్చాయి. రావణుడంతటి వాడినే బంధించి చెఱసాలలో పెట్టాడు. రావణుడితాత పులస్త్యమహర్షి వచ్చి బ్రతిమాలడంతో వదిలి పెట్టాడు*. *చక్రవర్తిని అనుసరిస్తూ భూలోకంలో రాజులు కూడా అహంకార గర్వాలు పొంది క్షత్రియ ధర్మమైన ధర్మ పరిపాలన, ప్రజా రక్షణ వదలి వేశారు. సుఖభోగాలలో మునిగిపోయారు. యజ్ఞయాగాదులు మానివేశారు. గర్వం అహంకారంతో తమకు మంచి చెప్పబోయిన మునులను, బ్రాహ్మణులను అవమానించారు. ఇతర వర్ణాల వారిని బాధలు పెడుతూ కష్టాలు పెట్టసాగారు. రాజు చెప్పినదే చేయాలని, రాజే దేవుడని కొలవమని ప్రజలకు మునులకు చెబుతూ అలా చేయని వారిని బంధించి హింసించ సాగారు*. *క్షత్రియ రాజులను దండించగల, దారిలో పెట్టగల సమర్ధుడైన క్షత్రియుడు దేవతలకు కనపడలేదు. ఎవరి రాజ్యం, ఎవరి స్వార్థం వారిదై పోయింది. బ్రహ్మాది దేవతలు, మహర్షులు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి భూమి మీద జరుగుతున్న ధర్మనాశనం ఫలితంగా ఉత్పన్నమయిన లోకసంక్షోభం గురించి చెప్పారు. బ్రాహ్మణులను, మునులను కించపరిచి అవమానిండమే కాకుండా క్షత్రియ రాజులు యజ్ఞయాగాదులు ఆపివేశారు అని విన్నవించారు*. *మహావిష్ణువు తాను భూలోకంలో అవతారం ధరించి ధర్మ పరిరక్షణ చేస్తానని అభయమిచ్చి దేవతలను మునులను పంపివేశాడు. ఋచీక మహర్షి తపస్సు చేసినప్పుడు ఇచ్చిన వరము జ్ఞప్తి చేసుకుని ఋచీక మహర్షి పుత్రుడైన జమదగ్ని మహర్షికి కుమారుడిగా జన్మించదలచాడు. బ్రాహ్మణుడిగా జన్మించినా క్షత్రియ స్వభావము కలిగి దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ చేయవచ్చునని జమదగ్ని మహర్షి భార్య రేణుక గర్భంలో ప్రవేశించాడు*. *జమదగ్ని మహర్షికి రేణుకకు అప్పటికే నలుగురు పుత్రులు జన్మించి ఉన్నారు. శ్రీహరి ఐదవ పుత్రుడిగా రేణుకాదేవి గర్భం నుంచి నవమాసాలు అయిన తర్వాత జన్మించాడు. చేతిలో పరశుతోనే జన్మించడం వలన జమదగ్ని మహర్షి పుట్టిన బాలునికి పరశురాముడు అని నామకరణం చేశారు*. *తండ్రి వద్దనే అన్నలతో పాటు పరశురాముడు వేద విద్యలు అభ్యసించాడు. కాలక్రమంలో ధనుర్విద్యాది యుద్ద విద్యలలో ప్రవీణుడయ్యాడు. ప్రతిరోజు పరశుతో అరణ్యం లోకి వెళ్లి యుద్యవిద్యలు అభ్యసించి ఆశ్రమానికి కావలసిన కట్టెలు దర్భలు మొదలైనవి తెచ్చి ఇచ్చేవాడు*. *జమదగ్ని మహర్షి ప్రతిరోజు భగవంతునికి అభిషేక అర్చన పూజలు చేసేవాడు. ఇందుకోసం రేణుక ప్రతిదినము ఆశ్రమం సమీపంలో గల కౌశికి నదికి వెళ్లి స్నానం చేసి తన పాతివ్రత్య మహిమతో ఇసుకతో కుండను చేసి నదీజలాలలను నింపి భర్తకు అభిషేకానికి తెచ్చి ఇచ్చేది. సమయ పాలన పాటిస్తూ రేణుక తెచ్చే నీటితోనే జమదగ్ని మహర్షి అభిషేకార్చనలు చేసేవాడు*. *ఒకరోజు నదీతీరంలో రేణుక కుండ చేయడానికి ఇసుక సేకరించసాగింది. అదే సమయంలో చిత్రరథుడు అనే యక్షుడు తన భార్యతో వచ్చి నదిలో జలక్రీడలు ఆడ సాగాడు. యక్ష దంపతుల మధ్య శృంగార భరితంగా సాగుతున్న జలక్రీడ చూసిన రేణుక మనస్సు చెదిరింది. శృంగార భావం కలిగి మనస్సు నియంత్రణ తప్పడంతో రేణుక ఇసుకతో ఎంత ప్రయత్నించినా కుండను చేయలేక పోయింది. సమయం చాలా వ్యర్థం అయ్యింది*. *జమదగ్ని మహర్షికి ఆగ్రహం వస్తుందని నీరు తేకుండానే ఆశ్రమానికి వచ్చి రిక్త హస్తాలతో భర్త ముందు తల వంచుకుని నిలబడింది*. *జమదగ్ని మహర్షి చంచలమైన మనస్సుతో, నదీజలాలు తేకుండా నిలబడ్డ భార్యను చూసి దివ్య దృష్టితో జరిగింది గ్రహించాడు. “మహర్షి పత్ని మనస్సు శృంగార భావంతో స్థిరత్వం కోల్పోవడం క్షమించరాని నేరము. పాతివ్రత్యం భంగమైంది. మరణమే దానికి దండన” అని ఆగ్రహించి పెద్ద కుమారుడైన రుమణ్వంతుని పిలిచి "మీ తల్లి పాతివ్రత్య దోషానికి పాల్పడింది. తక్షణం ఈమె శిరస్సు ఖండించు" అని ఆదేశించాడు*. *రుమణ్వంతుడు తండ్రి ఆజ్ఞ పాటించి తల్లిని చంపలేకపోయాడు. మౌనంగా తల వంచుకుని నుంచున్నాడు. జమదగ్ని మహర్షి మరింత ఆగ్రహంతో సుషేణ, వసు, విశ్వావసు అనే ముగ్గురు కుమారులను వరుసగా పిలిచి రేణుకను సంహరించమని ఆదేశించాడు.* *వారు కూడా అన్న వలె తల్లి మీద ప్రేమతో ఆజ్ఞ పాటించక అన్న పక్కనే వెళ్లి నిలబడ్డారు*. *జమదగ్ని ఆశ్రమ సమీప అడవిలో ఉన్న తన ఆఖరి పుత్రుడైన పరశురాముని "పరశురామా! వెంటనే రా" అని గట్టిగా పిలిచాడు. "తండ్రీ! ఏమిటి మీ ఆజ్ఞ" అంటూ పరశురాముడు అక్కడ ప్రత్యక్షమైనాడు.* *జమదగ్ని మహర్షి జరిగింది చెప్పి "పాతివ్రత్య దోషానికి పాల్పడిన నీ తల్లిని, తండ్రి ఆజ్ఞను పాటించని నీ అన్లనను తక్షణమే సంహరించు!" అని ఆదేశించాడు*. *తక్షణమే పరశురాముడు తన పరశువుతో తల్లిని, అన్నలను సంహరించి తండ్రి ఆజ్ఞ పాటించాడు*. *జమదగ్ని పరశురాముని పితృవాక్య పాలనకు సంతోషించి వరము కోరుకోమని అన్నాడు*. *పరశురాముడు తండ్రికి నమస్కరించి "తండ్రీ! మీ ఆజ్ఞ పాటించి తల్లిని సోదరులను సంహరించాను. మీ అమోఘమైన తపశక్తితో వారికి పునఃప్రాణదానం చేసి బ్రతికించండి" అని వరం కోరాడు*. *భార్య, సోదరుల శిరస్సు మొండాలు దగ్గరకు చేర్చమని జమదగ్ని మహర్షి చెప్పి తన తపశక్తితో అతికించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు*. *పునఃజీవితయై పాతివ్రత్య దోషం తొలగి పునీతయైన రేణుకను అర్థాంగిగా జమదగ్ని మహర్షి స్వీకరించాడు*. *పరశురాముడు తల్లికి నమస్కరించి "అమ్మా! తండ్రి ఆజ్ఞను పాటించి నిన్ను వధించడం వలన మాతృహత్యా మహాపాపం పొందాను. ఆ పావ పరిహార్థం నేను తపస్సుకి వెళుతున్నాను. చాలా సమయం పడుతుంది. నీకు అవసరం అయినప్పుడు నన్ను స్మరించి పిలువుము. తక్షణమే వస్తాను. నన్ను క్షమించి తపస్సిద్దికై ఆశీర్వదించు" అని తల్లి రేణుక ఆశీస్సులు తీసుకున్నాడు. తండ్రి జమదగ్ని అనుమతి పొంది తపస్సుకి వెళ్లి పోయాడు* #మన సంప్రదాయాలు సమాచారం