6️⃣4️⃣
*_శ్రీమహావిష్ణుపురాణం_*
*_(అరవై నాల్గవ భాగం)_*
*_కృతవీర్యుడు - కార్తవీర్యార్జునుడి జనన కథ:_*
*సూత మహర్షి శౌనకాదులతో “మునులారా! పరశురామ అవతార కథ ముందు మనం కృతవీర్యుడు, అతని పుత్రుడు కార్తవీర్యార్జునుడి గురించి తెలుసుకుందాం” అని కార్తవీర్యార్జునుడి జనన కథ చెప్పసాగాడు..*
*‘పూర్వము కృతవీర్యుడు అనే బలపరాక్రమ వంతుడైన రాజు ఉన్నాడు. ధర్మపరిపాలన చేస్తూ యజ్ఞయాగాదులు, దానధర్మాలు చేస్తూ పరిపాలించేవాడు. కృతవీర్యుడి భార్య సుగంధి సుగుణవతి, సౌశీల్యవతి. వారికి చాలా కాలం సంతానం కలుగ పోవడంతో రాజ్యం మంత్రులకు అప్పగించి భార్యతో సంతానం కోసం తపస్సు చేయడానికి అరణ్యానికి వెళ్లాడు*.
*అక్కడ కృతవీర్యుడు రాలిన ఆకులు తింటూ కొంతకాలం, తరువాత వాయువు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ భార్యతో కలసి తపస్సు చేయసాగాడు. శరీరం శుష్కించిపోయినా తపస్సు మానలేదు. ఆకాశమార్గాన వెళుతున్న నారదుడు చూసి దయ కలిగి అక్కడకి వచ్చి సంతానం కోసం కృతవీర్యుడు దంపతులు చేస్తున్న తపస్సు గురించితెలుసుకుని పితృలోకం వెళ్లి కృతవీర్యుడి తండ్రికి ఆ విషయం తెలిపి వెళ్లి పోయాడు.*
*కృతవీర్యుడి తండ్రి బ్రహ్మ దగ్గరకు వెళ్లి నమస్కరించి “పితామహా! నా కుమారుడు ఆహారం మానివేసి సంతానం కోసం తపస్సు చేస్తూబలహీనుడై రేపోమాపో మరణించేట్టు ఉన్నాడు. ధర్మబద్దంగా పాలనచేస్తున్నా వాడికి సంతానం ఎందుకు కలగటం లేదు. మీరు దయవుంచి వాడికి ఏంచేస్తే సంతానం కలుగుతుందో చెబితే, నేను నా కుమారుడికి చెప్పి మార్గదర్శనం చేస్తాను” అని అభ్యర్థించాడు.*
*బ్రహ్మ దయతో కృతవీర్యుడి తండ్రికి “మీ కుమారుడు పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను. నీ రాజధానిలో సాముడు అనే కిరాతుడు ఉండేవాడు. దుర్మార్గుడు, క్రూరుడైన అతడు దొంగతనం చేయడానికి ఎవరు అడ్డం వచ్చినా చంపేసి దోచుకునే వాడు. ఒకసారి ధనం అధికంగా దొరుకుతుంది అన్న సమాచారం తో సత్పురుషులైన పన్నెండు మంది బ్రాహ్మణులను చంపి వారి ధనము, సంపదలు దోచుకుని రాత్రికి ఇంటికి చేరాడు*.
*ఆ రోజు మాఘ బహుళ చవితి.* *పగలంతా దోపిడిలో తిండి లేకుండా గడిపిన సాముడు రాత్రి కుమారుని పేరుతో ‘గణేశా! గణేశా’ అని పిలిచి, కుమారుని తో కలసి భోజనం చేసాడు.* *కొంతకాలానికి సాముడు మరణించాడు. తెలియకుండానే మాఘ బహుళ చవితి నాడు పగలంతా ఉపవాసం ఉండి చంద్రోదయమైన తరువాత గణేశ స్మరణ చేసి ప్రసాదం (భోజనం) తినడం వలన సంకష్ట చతుర్థీవ్రత పుణ్యఫలం సాముడికి లభించింది.*
*ఆ పుణ్యఫలం చేత నీకు కుమారుడై జన్మించి కృతవీర్యుడు అనే నామంతో రాజైనాడు. కానీ పూర్వజన్మ బ్రహ్మహత్యా పాప ఫలం అలాగే ఉండిపోయింది. ఆ పాపం తొలిగితేనే సంతానం కలుగుతుంది" అని చెప్పగా కృతవీర్యుడి తండ్రి "పాపం తొలిగి పోయే ఉపాయం చెప్పమని" ప్రార్థించాడు*.
*దానికి బ్రహ్మ "నీ కుమారుడు "అనఘాష్టమీ వ్రతము" నియమనిష్టలతో, శ్రద్దా భక్తులతో చేస్తే బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి పొందుతాడు. సంతానం పొందుతాడు. అశ్వమేధ యాగం చేసిన ఫలం కూడా లభిస్తుంది" అని చెప్పాడు*.
*కృతవీర్యుడి తండ్రి కృతవీర్యుడి కలలో కనిపించి బ్రహ్మ చెప్పిన అనఘాష్టమీ వ్రతము గురించి, వ్రత విధానం గురించి తెలిపగా "ఈ వ్రతము చేస్తే తప్పక సంతానం కలుగుతుంది" అని చెప్పగా అతను భార్యతో కలసి రాజధానికి తిరిగి వెళ్లాడు.*
*అనఘా అనఘుల (దత్తాత్రేయుడు, అనఘాదేవి) బంగారు ప్రతిమలు చేయించాడు*. *పుష్పమండపంలో వారిని ప్రతిష్టించి, విధివిధానాలతో భక్తి శ్రద్థలతో అనఘాష్టమీ వ్రతము, చేశాడు. దత్తాత్రేయ మంత్రం పఠిస్తూ హోమము చేసాడు*. *బ్రాహ్మణులకు అన్నసమారాధన చేసి దక్షిణలతో సంతృప్తి పరిచాడు. దంపతులిరువురు సంతాన ప్రాప్తికై బ్రాహ్మణుల ఆశీస్సులు పొందారు*.
*కొంతకాలానికి కృతవీర్యుడి భార్య గర్భవతి అయ్యి నవమాసాలు ముగిసిన తర్వాత కుమారుని కన్నది. ఆ కుమారుడు సుందరమైన ముఖము, చక్కని ముక్కు నేత్రములు కలిగినా కాళ్లు చేతులు లేకుండా జన్మించాడు. చేతులు లేని భుజాలు, కాళ్లు లేని తొడలు గల శరీరము తో ఉన్న కుమారుని చూసి తల్లి దుఖించింది. కృతవీర్యుడికి తెలిసి అక్కడకు వచ్చి కాళ్లు చేతులు లేని కుమారుని చూసి బాధపడ్డాడు*.
*"ఏం పాపము చేసామో కదా! అనఘాష్టమీ వ్రతముతో దత్తాత్రేయుడి అనుగ్రహం పొందినా అంగవిహీనుడైన కుమారుని పొందాము" అని దుఖిస్తున్న మహారాజుని చూసిన మంత్రులు "మహారాజా!విధివిధా నాన్ని ఎవరూ తప్పించలేరు. దుఖం చెందవద్దు. మీరు ఎంత దుఖించినా పుట్టిన బాలునికి పరిపూర్ణత రాదు. భగవంతుడు ఇచ్చిన దానిని స్వీకరించండి. కాలానుగుణంగా లోకంలో ఫలాలు పరిపక్వమైనట్టు అన్నీ తగిన సమయంలో వస్తాయి. దత్తాత్రేయుని నామ స్మరిస్తూ ఉండండి" అని హితోపదేశం చేశారు.*
*కృతవీర్యుడు తేరుకుని బ్రాహ్మణులను పిలిచి పిల్లవాడికి పుణ్యాహవచనము, జాతకర్మలు చేయించాడు. దాన ధర్మాలు చేసాడు. బాలునికి "కార్తవీర్యుడు" అని నామకరణం చేసి పెంచసాగారు* #మన సంప్రదాయాలు సమాచారం