Ravi Talluri
537 views
7 hours ago
*_ఆంధ్రప్రదేశ్ చరిత్రను చదవాలనే ఆసక్తితో చరిత్ర పుస్తకాలు తిరగేస్తూ వెళ్తే, రెండు మూడు చారిత్రిక ఘట్టాలు నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తాయి. అవే, తళ్ళికోట యుద్ధం, బొబ్బిలి యుద్ధం, శ్రీరంగపట్నం ఒడంబడిక (Treaty of Seringapatam). వీటిలో తళ్ళికోట యుద్ధం గురించి వచ్చిన సాహిత్యం ఎంతో ఉంది. కన్నడ నుంచి అనువాదం చేసిన పుస్తకాలు కానీ, తెలుగులో రాసిన కథలు కానీ చాలానే ఉన్నాయి. ఎన్ని వచ్చినా, ఎన్ని విధాలుగా ఆ చరిత్రను చదివినా, ఇంకా చదవాలనిపిస్తూనే ఉంటుంది. ఆ జాబితాలోనిదే బండి నారాయణ స్వామి గారు రాసిన చారిత్రక నవల ‘కడపటి యుద్ధం’ పుస్తకం కూడా ఒకటి_*. *_కథను స్థూలంగా పరిచయం చేసుకుంటే, శ్రీకృష్ణదేవరాయల అల్లుడైన ఆరవీటి రామరాయలు విజయనగర పాలన మొదలుపెట్టినప్పటి నుంచి, తళ్ళికోట యుద్ధంలో రామరాయల వీరమరణం వరకు జరిగిన చారిత్రక పరిణామాలను ప్రామాణికంగా తీసుకొని, అప్పటి సమాజపు పోకడలు, ఆహార అలవాట్లు, సంప్రదాయాలు వంటి ఎన్నో అంశాలను స్పృశిస్తూ రాసిన రచన_*. *_దాదాపు 600 పేజీలలో, విజయనగర సామ్రాజ్యపు సమాజాన్ని పరిచయం చేయడమే కాకుండా, తళ్ళికోట యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులను వివరించిన నవల. పంచ పాదుషాలు ఏకమై అళియ రామరాజుపై యుద్ధం ఎందుకు ప్రకటించారు? ఇద్దరు పాదుషాలు అళియ రామరాజుకి పుత్ర సమానులు. మిగిలిన వారికి అవసరమైనప్పుడు సహాయం కూడా చేశాడు. అయినా కూడా ఎందుకు విజయనగర సామ్రాజ్యం మీద యుద్ధం చేశారు? దక్షిణ భారతదేశం మీద ఆధిపత్యం కోసమా? లేదా తమ మత ప్రచారం కోసమా? అనే ప్రశ్నలకు రచయిత తనదైన శైలిలో సమాధానం ఈ నవల ద్వారా ఇచ్చారు._* *_ఇది కేవలం రాజుల కథ కాదు. విజయనగర సామ్రాజ్యంలో వివిధ వర్గాల ప్రజల కథ. శ్రీవైష్ణవాన్ని నమ్ముకొని జీవితమంతా దైవం కోసం అర్పించిన ఉత్తణ్ణ, పంచముల్లో పుట్టినా దుర్గాధిపతిగా ఎదిగినా, కేవలం కులం కారణంగా తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయిన రెండుకత్తుల హంసణ్ణ, యవ్వనాన్ని తనివితీరా అనుభవించే తెలుగుల మాధవుడు, వేశ్య రత్నమాలను మనసారా ప్రేమించిన వ్యాపారి టిట్టిభ శెట్టి... ఒకటా, రెండా, దాదాపు అరవై పాత్రలు ఉన్నా కూడా ప్రతి పాత్రనీ గుర్తుపెట్టుకునే విధంగా రచన ఉంటుంది_*. *_నవల ప్రారంభంలో గుర్రంపై ప్రయాణిస్తున్న ఆ వేగు, హంపీ సరిహద్దు నుంచి రాజధానిలో ప్రవేశించడం, అంతఃపురాన్ని చేరుకోవడం, అళియ రామరాజుని దర్శించడం వరకు ఉండే వర్ణనలతో, హంపి రాజధాని ఎలాంటిదో మనకు ఒక అవగాహన రావడమే కాకుండా, మనం ఎలాంటి పుస్తకం చదువుతున్నామో కూడా అర్థం అవుతుంది. రచనా శైలి ఎంత సులువుగా ఉందంటే, మనం ఒక 600 పేజీల పుస్తకం చదువుతున్నామనే భావన ఎక్కడా కలగలేదు._* *_చరిత్రను ఒక్కొక్కరు తమకు నచ్చిన విధంగా విశ్లేషించే అవకాశం ఉంది. ఈ నవలలో కూడా కొన్ని కొన్ని వాక్యాలు చదివినప్పుడు, విజయనగర సామ్రాజ్యం మీద దాడిలో కేవలం రాజ్యకాంక్ష మాత్రమే కాకుండా మత కోణం కూడా ఉందనే ప్రతిపాదన కనిపిస్తుంది_*. *_‘కడపటి యుద్ధం’ అనే టైటిల్ పెట్టడం వల్ల ఇది కేవలం యుద్ధం చుట్టూ ఉంటుంది అనే అపోహ ఉండవచ్చు. అలా కాకుండా మొదటి పేజీలో పెట్టిన ‘మహాజనుల హంపి’ అనే పేరునే ఉంచినట్లయితే, నవలలో పేర్కొన్న అంశాలకు సరిగ్గా సరిపోతుంది అనిపించింది. అలానే చారిత్రక ఘట్టాలను ప్రస్తావించినప్పుడు సంవత్సరాలను కూడా ప్రస్తావించినట్లయితే మరింత బాగుండేది అనిపించింది_*. *_Historical Fiction ఇష్టం ఉన్న వాళ్ళు తప్పకుండా చదవాల్సిన రచన ఇది. అలానే హంపి అంటే, విజయనగర సామ్రాజ్యం అంటే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా చదవడానికి ఇది ఒక మంచి ఎంపిక అవుతుంది_*. *_ఈ పుస్తకం అమెజాన్ లో దొరుకుతుంది._* *_ధర :700/-_* *_పేజీలు : 590_* #మన సంప్రదాయాలు సమాచారం