"అదృష్టహీనులు"
అనంగనంగా ఒక వూరు. ఆ వూళ్లో ముగ్గురు బీద పిల్లలు వుండేవారు. అదేమి చిత్రమోగాని, పాపం వాళ్ల ముగ్గురికి కూడా పట్టుమని పదేళ్ళన్నా నిండకముందే తలిదండ్రులు చనిపోయారు. అసలే బీదవారు గదా, పైగా దిక్కులేని పక్షులైపోవటంచేత ఎలా బ్రతకాలో వారికి ఏమీ పాలుపోలేదు. ముగ్గురూ ఒకేవిధమైన కష్టదశలో వుంటాన యిట్టే స్నేహితులయారు. ఏ పని చేసినా ఒకరినొకరు సంప్రదించుకుని, ఒకరికొకరు అండగా వుంటూ, ఆ వూళ్లోనే నాలుగిళ్ళలో అడుక్కుని జీవిస్తుండేవారు.
-ముగ్గురూ క్రమంగా పెద్దవారైనారు. ఎంతకాలమని అడుక్కుని తింటానికి సాగుతుంది. క్రమంగా వూళ్లోవాళ్లు వాళ్లకి ముష్టి వెయ్యటం మానివేశారు. పోనీ ఏదైనా
పనిచేసి నాలుగు డబ్బులు సంపాయిద్దామంటే వాళ్లకు పని యిచ్చే నాధుడు లేడు. ఒక పూట తింటే మరొకపూటకు లేక, పస్తులుంటూ, కట్టుకోను గుడ్డలు లేక పాపం ఆ ముగ్గురు స్నేహితులూ ఎంతో కష్టంగా కాలం వెళ్లబుచ్చుతున్నారు.
నానాటికీ వాళ్లకి కష్టాలెక్కువైపోయి, జీవించటమే దుర్భరం కాసాగింది. చివరికి ముగ్గురూచేరి కూడ బలుక్కుని ఒక నిశ్చయానికి వచ్చారు. అదేమంటే, "ముగ్గురూ విడిపోయి, ఎవరిత్రోవన వారు బయలుదేరి వెళ్లి ఒక్క సంవత్సరంలోగా ఏదైనా విద్య నేర్చుకోవాలి. సంవత్సరం పూర్తి కాగానే ముగ్గురూ ఒకచోట కలుసుకుని ఎవరు నేర్చినవిద్య వారు ప్రదర్శించాలి. ఇక ఆయా విద్యలవల్ల వాళ్లు జీవితం వెళ్లబుచ్చగలగాలి." ఇలా నిశ్చయించుకుని ముగ్గురు స్నేహితులూ మూడు దార్ల వెంట బయలుదేరిపోయారు.
మొదటివాడికి, వెళ్ళగా, వెళ్ళగా ఒక సన్యాసి కనిపించాడు. సన్యాసికి శిష్యుడుగా వుండి అతనికి సేవచేస్తూ అతను కాలం వెళ్ళబుచ్చసాగాడు. సన్యాసి అతని సేవకు మెచ్చుకుని ఒక విద్య నేర్పాడు. అదే మంటే, ఏదైనా ఒక జంతువుయొక్క ఎముకతో ఆ జంతువు యొక్క అస్థి పంజరాన్నంతా పూర్తిచేయవచ్చు. ఈ విద్య నేర్చుకుని శిష్యుడు సన్యాసి దగ్గరే సంవత్సరంగడువు వెళ్లేదాకా వుండసాగాడు.
రెండవవాడు పోయి, పోయి, ఒక ఋషీశ్వరుని దర్శించి, అతని సేవచేయ సాగాడు. ఋషీశ్వరుడు మెచ్చి అతనికి ఒక విద్య నేర్పాడు. అదేమంటే, ఏదైనా ఒక అస్థిపంజరమునకు, చర్మమూ, పంచేంద్రియాలు వచ్చేటట్లు చెయ్యవచ్చు. ఈ విద్య నేర్చుకుని రెండోవాడు కూడా సంవత్సరం గడువుకు ఎదురుచూస్తూ ఋషీశ్వరుడిదగ్గరే వుండసాగాడు.
ఇక మూడోవాడు, నడిచి, నడిచీ చిట్ట చివరకు ఒక అరణ్యం చేరుకున్నాడు. అక్కడ ఒక యోగి కనిపించాడు. తన కష్టదశనంతా యోగితో చెప్పుకుని ఏదైనా ఉపాయం చెప్పమని కోరాడు. యోగికి కూడా జాలికలిగి ఒక విద్య నేర్పాడు. అదేమంటే ఏదైనా ప్రాణంలేని జీవానికి ప్రాణం తెప్పించవచ్చు. శిష్యుడు చాల సంతోషంగా యోగి సేవచేస్తూ సంవత్సరం గడువుకు ఎదురుచూస్తూన్నాడు.
ఇట్టే సంవత్సరం గడిచి పోయింది. అనుకున్న ప్రకారం ఒకచోట ముగ్గురు స్నేహితులూ కలుసుకొన్నారు. నువ్వేమి నేర్చుకొచ్చావంటే నువ్వేమి నేర్చుకొచ్చా వని ఒకరివిద్య ఒకరు తెలుసుకొని చాల సంతోషించారు. ప్రత్యక్షంగా ఎవరి విద్యలను వాళ్లు ప్రదర్శించాలని తీర్మానించు కున్నారు.
మొదట అసలు ఎముక ఒకటి అవసరం గనక ముగ్గురూచేరి వెతగ్గా ఒక ఎముకకనిపించింది, వెంటనే మొదటివాడు తను నేర్చిన విద్యవల్ల దాని పూర్తి అస్థి పంజరాన్ని తయారుచేశాడు. వెంటనే రెండవ వాడు తను నేర్చిన విద్యవల్ల దానికి మాంసము, చర్మము, పంచేంద్రియములు కల్పించాడు. తీరాచూస్తే అది ఒక సింహం. ప్రాణంలేని సింహం. ఇక మూడో వాడు తనూ తన విద్య చూపాలిక దా!
వెంటనే తను నేర్చిన విద్యవల్ల ఆ సింహానికి ప్రాణం రప్పించాడు. ఇంకేముందీ; ప్రాణం వచ్చీ రావడంతోనే సింహం ఒక్క పరుగున వాళ్ళ మీదికి వురికి ముగ్గురినీ చీల్చి చెండాడి తినేసింది.
చూశారా, పాపం! అదృష్టం అంటూ లేంది మనం ఎంత తన్నుకున్నా కలిసి రాదు. అదృష్టహీనులను కష్టాలు ఎప్పుడూ వెంటాడుతూనే వుంటాయి.
🙏ఓం నమః శివాయ 🙏
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status