*అలమేలు మంగ - పద్మావతి తాయారు*
ఆమె కరుణాంతరంగ.. శ్రీవారి హృదయాంతరంగ..తన బిడ్డలకు వరాలిచ్చేందుకు ఆమె ఏడు కొండలూ దిగివచ్చారు... అల్లంత దూరంలో ఉండి వారి కోరికలను తన పతిదేవుడికి నివేదిస్తున్నారు... అంత ప్రేమ చూపుతారు కాబట్టే ఆమె దేవదేవుడి గుండెల్లో నిక్షిప్తమయ్యారు... జగాలేలే ఆ తండ్రి. నడి రేయి ఏ జామునో ఆమె కోసం ఏడు కొండలూ దిగి వస్తున్నారు.
అయ్యవారు - వేంకటేశ్వరుడు
అమ్మవారు - పద్మావతీదేవి
వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్షదైవం.. భక్తుల పాలిట కొంగు బంగారం. ఆపద మొక్కుల వాడు. అనాధ రక్షకుడు. తిరుమల శ్రీనివాసునికి ఆశ్వయుజమాసంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగితే అమ్మవారికి కార్తిక మాసంలో కన్నుల పండువగా జరుగుతాయి. అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించిన పంచమినాటికి ముగిసేలా తొమ్మిది రోజుల ముందు ప్రారంభించి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తమిళ కార్తికమాసం శుక్లపక్ష పంచమికి ముగిసేట్లుగా ఉత్సవాలు జరుగుతాయి
శ్రీ పద్మావతీ దేవి. దేవేరుడికి ఏ మాత్రం తీసిపోని కరుణామయి. భక్తులపాలిట కల్పవృక్షం. భక్తుల విన్నపాలను, కోరికలను పతికి విన్నవించేందుకే వెలిసిన కరుణాంతరంగ!!
ఆమె వ్యూహలక్ష్మి
తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని తమను రక్షించేందుకు భువికి వచ్చిన శ్రీమన్నారాయణుడిగా భక్తులు కొలుస్తారు. ఆగ్రహంతో విచక్షణ మరిచిన భృగు మహర్షిని అనుగ్రహించిన భర్తపై కోపంతో వైకుంఠం వదిలి భూమికి చేరిన శ్రీమహాలక్ష్మినే పద్మావతీదేవిగా భావిస్తారు. శ్రీనివాసుడు ఏడుకొండలను నివాసంగా చేసుకోగా, మహాలక్ష్మి ఆయన హృదయంపై కొలువుదీరింది. వ్యూహలక్ష్మి పేరుతో పూజలు, ఆరాధనలు అందుకునే అమ్మ భక్తులను అనుగ్రహించమని స్వామిని ప్రోత్సహిస్తూ ఉంటుందని చెబుతారని భక్తుల నమ్మకం. శ్రీ వేంకటేశ్వరుని హృదయ పీఠంపై పద్మాసన స్థితిలో వ్యూహలక్ష్మి ఉంటారు. ఈమెను దర్శించడం, ఆరాధించడం అందరికీ సాధ్యపడదు. అందుకే అందరికీ దర్శనమివ్వాలనే తలంపుతోనే అమ్మవారు సువర్ణముఖీ తీరంలో స్వతంత్ర వీరలక్ష్మిగా కొలువుదీరారని అంటారు. అంటే శ్రీనివాసుని హృదయ పీఠంపై ఉన్న దేవేరే తిరుచానూరులో ఉన్న పద్మావతీ దేవి.
సరోవరం
లక్ష్మీదేవి అలిగి భూలోకం చేరాక ఆమెను వెదుకుతూ స్వామి కూడా వచ్చేశారు. ఆయన ప్రస్తుత తిరుచానూరులో పద్మ సరోవరాన్ని ఏర్పాటు చేసుకుని పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు. కార్తిక మాసంలో పంచమి శుక్రవారం నాడు సరోవరంలోని బంగారు పద్మంలో అమ్మ ప్రత్యక్షమయ్యారు. అలా పద్మంలో నుంచి వచ్చారుకాబట్టి ఆమె పద్మావతి అయిందని అంటారు. మరో కథ ప్రకారం సంతానం కోసం యజ్ఞం చేసిన నారాయణవనాన్ని పరిపాలించే ఆకాశరాజు యజ్ఞ భూమిని దున్నుతున్న సమయంలో ఓ పెట్టె దొరికింది. అందులో వెయ్యి రేకులున్న తామర పుష్పంలో స్త్రీ శిశువు దర్శనమిచ్చింది. ఆమెను బిడ్డగా స్వీకరించిన ఆకాశరాజు పద్మంలో లభించినందువల్ల పద్మావతి అని పేరు పెట్టి పెంచుకుని యుక్త వయసు రాగానే శ్రీనివాసునికిచ్చి వివాహం జరిపించారని అంటారు.
అలమేలు మంగ ఎవరు
పద్మావతీ అమ్మవారిని అలమేలు మంగాదేవి అనికూడా పిలుస్తారు. దీనికో కథ చెబుతారు. పూర్వం శుక మహర్షి హిమాలయాల నుంచి బయల్దేరి వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్వర్ణముఖీనదీ తీరంలోని ప్రస్తుత క్షేత్రానికి చేరి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని నివసించసాగారు. తర్వాత అక్కడ ఒక ఊరు ఏర్పడింది. దీన్ని మహర్షి పేరుమీదే శ్రీ శుకనూరు అని పిలిచేవారు. తర్వాత అది తిరుగచ్చనూరు అయింది. అది కాల క్రమంలో తిరుచానూరు అయింది. తిరుచానూరులో అమ్మవారు పద్మంపై ఆశీనురాలై ఉంది. తమిళంలో అమ్మవారిని అలర్మేల్ మంగై అని అంటారు. అంటే తామర పువ్వుపై ఉన్న దేవత అని అర్థం. అందువల్లనే పద్మావతీదేవికి అలమేలు మంగా దేవి అని, తిరుచానూరుకు అలమేలు మంగాపురం అని పేర్లు వచ్చాయి.
ముందుగా అమ్మ దర్శనం
సాధారణంగా పిల్లలు ముందు తల్లి వద్దకు వెళ్లి గోముగా అడుగుతారు. ఆ తర్వాతే తండ్రి వద్దకు...! ఇక్కడా అంతే. తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ముందుగా వరాహ స్వామిని దర్శించిన తర్వాత స్వామి చెంతకు వెళ్లాలని నియమం. అయితే తిరుమల కంటే ముందు తిరుచానూరు చూడాలని చెబుతారు. కొండపైకి వెళ్లే ముందు దిగువున కొలువై ఉన్న అమ్మవారిని దర్శించుకుని, ప్రార్థించి తమ కోరికలను విన్నవించుకోవాలి. తర్వాత కొండకు చేరి అయ్యవారిని వేడుకోవాలి. అందుకేనేమో
32 వేలకు పైగా కీర్తనల్లో శ్రీనివాసుడిని అర్చించిన పదకవితా పితామహుడు అన్నమాచార్య తొలిసారిగా అమ్మవారి పైనే శతకాన్ని రచించారు. కీర్తనలతో అర్చించారు.
‘చొచ్చితి తల్లీ! నీ మరుగు
సొంపుగ నీ కరుణాకటాక్షమెట్లబ్బెదో
నీకు నేడు పరమేశ్వరీ!
యోయలమేలు మంగ...’ అంటూ
ఆ తల్లిని గురించి తొలిసారిగా శతకం రచించారు.
పంచమీ తీర్థం
బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైంది పంచమీ తీర్థం. ఇది బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు జరుగుతుంది. అమ్మవారు ఆవిర్భవించిన పద్మ సరోవరంలో ఆమె ఆవిర్భవించిన రోజు జరిగే సేవ ఇది. పద్మ సరోవరం వద్ద అమ్మవారికి స్నపన తిరుమంజనం జరుగుతుంది. తర్వాత చక్రస్నానం నిర్వహిస్తారు. ఈ సందర్భంలో లక్షలాది మంది భక్తులు పంచమీ తీర్థంలో స్నానం చేస్తారు. ఆనాటి రాత్రి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
తిరుమల నుంచి సారె
బ్రహ్మోత్సవాల్లో తొమ్మిదో రోజు జరిగే పంచమీ తీర్థంలో చక్రస్నానంనాడు తిరుమల నుంచి అమ్మవారికి సారె పంపడం ఆనవాయితీ. ఆ రోజు తిరుమల నుంచి అర్చకులు, ఆలయ అధికారులు కాలినడకన సారెను తీసుకువస్తారు. ఇందులో రెండు పట్టు చీరెలు, రెండు పట్టు రవికలు, పచ్చి పసుపు చెట్లు, పసుపు, చందనం ముద్దలు, పూల మాలలు, తులసి మాలలతో పాటు రెండు బంగారు నగలు ఉంటాయి. ఇంకా వివిధ పిండి వంటలు ఒక్కో పడి వంతున పంపుతారు. అంటే 51 పెద్ద లడ్డూలు, 51 వడలు, 51 దోసెలు సారెలో భాగంగా పంపుతారు. వీటిని ఏనుగు అంబారీపై ఉంచి అమ్మవారికి సమర్పిస్తారు. తిరుచానూరులో పంచమీ తీర్థం ముగిశాకే తిరుమలలో స్వామివారికి నైవేద్యం సమర్పించడం ఆనవాయితీ.
నీరాజనం
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునికి ఇద్దరు దేవేరులు. శ్రీదేవి, భూదేవి. శ్రీవారి మూలవిరాట్టుపై శ్రీదేవి శాశ్వత స్థానాన్ని పొందగా, భూదేవి రూపాన్ని స్వామి వక్ష స్థలంపై అలంకరిస్తారు. వ్యూహలక్ష్మి తిరుచానూరులో కొలువుదీరి ఉన్న పద్మావతీదేవి కాగా, భూదేవి ఎక్కడ కొలువుదీరారనే సందేహం కలుగుతుంది. ఈ విషయాన్ని వరాహ పురాణంలోని వేంకటాచల మహాత్మ్యం వివరిస్తుంది. స్వామి వారి ఆనంద నిలయాన్ని నిర్మించింది తొండమాన్ చక్రవర్తి. ఆయన ఒకసారి నేరుగా శ్రీవారి ఏకాంత మందిరంలోకి వచ్చినప్పుడు, హఠాత్తుగా ప్రవేశించిన ఆయనను చూసి శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలో దాక్కుంటే, భూదేవి ఆలయంలోని బావిలో దాక్కు,న్నారు. ఆ బావే ఇప్పటి సంపంగి ప్రదక్షిణంలో ఉన్న పూలబావి అని చెబుతారు. తర్వాత రామానుజులు తిరుమల సందర్శించినప్పుడు ఈ గాథ తెలుసుకుని ఆ బావిలోనే అమ్మను ప్రతిష్ఠించి నివేదనలు జరిగేలా ఏర్పాట్లు చేశారు. స్వామి వారి పూలమాలలను కూడా ఆ బావిలోనే వేసే ఏర్పాట్లు చేసినట్లు చెబుతారు..
పూర్వం అయ్యవారి ఆరాధన ఇక్కడే
సుమారు 9, 10 శతాబ్ధాలకంటే ముందే తిరుచానూరులో ఎక్కువ మంది అయ్యవారిని ఆరాధించేవారట. అందుకే తిరుచానూరులో కూడా శ్రీ వేంకటేశ్వరుడి మూర్తిని కూడా ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతారు. కాగా తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు కూడా తిరుచానూరులోనే జరుగుతుండేవి. అప్పట్లో తిరుమలలో బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు ధ్వజారోహణ ఉత్సవం మాత్రమే జరిగేది. వాహన సేవలన్నీ తిరుచానూరులోనే జరుగుతుండేవి. రామానుజాచార్యుల కాలం నుంచి కొండపై ఉత్సవాలను నిర్వహించటం మొదలయ్యింది.
#🕉️🙏 శ్రీ మహాలక్ష్మి నమస్తుతే 🙏🕉️ #శుక్రవారం శ్రీ మహాలక్ష్మి #శ్రీ మహాలక్ష్మి దేవి #ఓం శ్రీ మహాలక్ష్మీయ్ నమః #🙏🕉️శ్రీ మహా లక్ష్మీదేవి🕉️🙏