#సుభాష్_పాలేకర్_కృషి_విధానం - 2
#బీజామృతం
“సుభాష్ పాలేకర్ కృషి” అనే రథం నాలుగు చక్రాలపై నడుస్తుంది.
1. బీజామృతం
2. జీవామృతం/ఘన జీవామృతం
3. ఆచ్ఛాదనం
4. వాఫసా
బీజామృతం అంటే బీజ సంస్కారం, అంటే విత్తనానికి శుద్ధి, రక్షణ మరియు శక్తి కల్పించే ప్రక్రియ.
బీజామృతం - కావలసిన పదార్థాలు
1. నీరు – 20 లీటర్లు
2. గోమయము – 5 కిలోలు
3. గోమూత్రము – 5 లీటర్లు
4. సున్నము – 50 గ్రాములు
బీజామృతం - తయారీ విధానం
1. గోమయమును ఒక గుడ్డలో కట్టి 20 లీటర్ల నీటిలో రాత్రంతా వ్రేలాడదీయాలి. (గోమయము అత్యంత శిలీంద్ర సంహారిణి; అంటే ప్రపంచంలోని అత్యుత్తమ ఫంగిసైడ్ మన దేశీ గోమయమే.)
2.అదే రోజు సాయంత్రం 1 లీటర్ నీటిలో 50 గ్రాముల సున్నము కలిపి ఉంచాలి.
3.మరుసటి రోజు ఉదయం గోమయమును నీటిలోంచి పిండుతూ, దానిలోని సారాన్ని మాత్రమే తీసుకోవాలి; మిగతా పేడను భూమిపై వదిలేయాలి.
4.సున్నం కలిపిన నీటిలోని తేట భాగాన్ని తీసుకొని ఈ నీటిలో కలపాలి.
5.చివరగా 5 లీటర్ల గోమూత్రమును కలిపి, కర్రతో సవ్యదిశలో తిప్పుతూ బాగా కలపాలి.
ఇదే బీజామృతం.ఇది ఒకరోజు మాత్రమే చురుకుగా పనిచేస్తుంది, కాబట్టి తయారు చేసిన వెంటనే వాడాలి.
బీజామృతం -వినియోగ విధానం
•విత్తనాలపై బీజామృతం చిలకరించి, రెండు చేతులతో రుద్దుతూ బాగా పూతలా పూయాలి.
•ఆపై నీడలో ఆరబెట్టి నాటుకోవాలి.
•వేరుశనగ వంటి విత్తనాలను బలంగా రుద్దరాదు.
•కందలు, చెరుకు, వెదురువంటి నాట్లను నాటే ముందు బీజామృతంలో ముంచి నాటాలి.
•టమాట, వంకాయ వంటి నార మొక్కల వేర్లను కూడా నాటే ముందు బీజామృతంలో ముంచి నాటాలి.
•మొక్కలను నాటే సమయంలో కూడా బీజామృతాన్ని వేర్లపై పోయాలి.
విత్తనాల ఎంపికకు ముందు శుద్ధి పద్ధతి
•అన్ని రకాల మిల్లెట్స్ మరియు దేశవాళీ వరి విత్తనాలను 50 లీటర్ల నీటిలో 5 కిలోల ఉప్పు కలిపి వేసి తేలిన విత్తనాలను తీసేయాలి.
•క్రింద మునిగిన మంచి విత్తనాలను తీసుకొని నీడలో ఆరబెట్టి, తరువాత బీజామృతం చిలకరించి ఆరిన తరువాత వాడుకోవాలి.
బీజామృతం -ప్రయోజనాలు
•బీజామృతంలో 27 రకాల సూక్ష్మ రసాయన పదార్థాలు (హార్మోనులు) మరియు 16 రకాల క్షార ద్రవ్యాలు (మొక్కల్లో సహజంగా ఉండే శక్తివంతమైన రసాయన పదార్థాలు, ఆల్కలాయిడ్స్) ఉంటాయి.
•ఇవి విత్తనంపై ఉండే రోగకారక ఫంగస్ను నాశనం చేస్తాయి.
•ట్రైకోడెర్మా మరియు పెనిసిల్లియం వంటి లాభదాయక జీవాణువులు బీజామృతంలో తయారవుతాయి — ఇవి హానికర బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి.
•భూమి కూడా శుద్ధిగా మారి, విత్తనానికి జీవ శక్తి పెరుగుతుంది.
బీజామృతం తయారీ - ప్రత్యామ్నాయ పద్ధతి
ఒక 20 లీటర్ల పాత్రలో:
• గోమూత్రము – 5 లీటర్లు
• గోమయము – 5 కిలోలు
• సున్నము – 50 గ్రాములు
• పిడికెడు మట్టి (పొలంలోని గట్టుమీది మట్టి)
ఈ అన్నింటినీ సవ్యదిశలో కలిపి, గోనె సంచితో కప్పి రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం కలపకుండా పైభాగంలోని తేట భాగం మాత్రమే తీసుకొని బీజామృతంగా వాడుకోవాలి.
ZBNF పూర్తి రూపం తెలుగులో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (Zero Budget Natural Farming). దీనిని తెలుగులో జీరో బడ్జెట్ సహజ వ్యవసాయం అని కూడా అంటారు. ఇది రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఉపయోగించని ఒక సహజ వ్యవసాయ పద్ధతి.
జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ (ZBNF): రసాయనిక ఎరువులు మరియు పురుగుమందుల కోసం ఎటువంటి బయటి ఖర్చు లేకుండా సహజ పద్ధతులలో వ్యవసాయం చేయడం.
పద్ధతి: మొక్కల పోషణకు ఆవు పేడ, మూత్రం వంటి సహజ వనరులను ఉపయోగించడం.
లక్ష్యం: భూసారాన్ని పెంచడం, రసాయన రహిత పంటలను పండించడం.
ZBNF@# APCNF#@ #వ్యవసాయం ## సేంద్రియ ఎరువులతో వ్యవసాయం
