ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా హన్వాడ మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహణ – జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ పాల్గొన్నారు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలోని గురువారం గ్రామసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపిఎస్ గారు హాజరై గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి, ప్రజా భద్రత, నేర నియంత్రణ మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో నేరాల నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమని పేర్కొంటూ, గ్రామ ప్రవేశ ద్వారాలు, ప్రధాన రహదారులు మరియు ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అదేవిధంగా “అరైవ్ అలైవ్” కార్యక్రమం భాగంగా రోడ్డు భద్రతపై ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగించడం, ట్రిపుల్ రైడింగ్, ఓవర్ స్పీడ్, రేస్ డ్రైవింగ్, ఓవర్ లోడ్, రాంగ్ డ్రైవింగ్ వంటి ప్రమాదకర చర్యలను నివారించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్) ప్రమాదకరమని హెచ్చరిస్తూ, డిఫెన్సివ్ డ్రైవింగ్ పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడటంలో ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. యువత మాదకద్రవ్యాలు మరియు మద్యపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పీడీ నరసింహ, స్థానిక ఎంఆర్వో కిష్టయ్య నాయక్, హన్వాడ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, డిప్యూటీ ఎంఆర్వో వెంకటేశ్వర్లు, హన్వాడ గ్రామ సర్పంచ్ సుధాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్, , గ్రామ కార్యదర్శి, పాలక వర్గ సభ్యులు మరియు పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
#MahabubnagarPolice #ArriveAlive #📰 వార్తలు

