#😇My Status #మాత రమాబాయ్ అంబేద్కర్
*మాతా రమాబాయి అంబేడ్కర్ త్యాగానికి, సహనానికి, మౌన విప్లవానికి ప్రతీక*
*(128వ జయంతి సందర్భంగా)*
*✍️ అరియ నాగసేన బోధి*
*M.A., M.Phil.,TPT.,LL.B*
*సద్ధమ్మ ప్రచారకులు*
*భారత సామాజిక విప్లవ చరిత్రలో రమాబాయి స్థానం*
*భారతదేశ సామాజిక చరిత్రలో డా.బి.ఆర్. అంబేడ్కర్ పేరు ఎంత గొప్పదో, ఆ మహోన్నత విప్లవం వెనుక నిలిచిన మాతా రమాబాయి అంబేడ్కర్ త్యాగం అంతే విశాలమైనది. ఆమె మాట్లాడలేదు, రాయలేదు, సభలు పెట్టలేదు. కానీ తన జీవితం మొత్తం ఒక మౌన పోరాటంగా మార్చి, ఈ దేశంలో కోట్ల మందికి వెలుగు నింపిన విప్లవానికి పునాది వేసింది.*
*రమాబాయి లేకపోతే అంబేడ్కర్ గారి విద్యా ప్రయాణం, సామాజిక పోరాటం, రాజ్యాంగ నిర్మాణం – ఇవన్నీ ఊహించలేనివి.*
*జననం – బాల్యం – అనాథత్వం*
*మాతా రమాబాయి అంబేడ్కర్ 1898 ఫిబ్రవరి 7న మహారాష్ట్ర రాష్ట్రంలోని కొంకణ్ ప్రాంతం, ధాబోల్ సమీపంలోని వణంది గ్రామంలో జన్మించారు. చిన్నప్పట్లో ఆమెను రామీబాయి అని పిలిచేవారు. చిన్న వయసులోనే తల్లి మరణించింది. తండ్రి భికూధూత్రే తీవ్ర పేదరికంలో చేపల బుట్టలు మోస్తూ పిల్లలను పోషించేవారు. ఆ కఠిన శ్రమే ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేసి, గుండెనొప్పితో ఆయన కూడా మరణించారు. అలా రమాబాయి సహా నలుగురు పిల్లలు అనాథలయ్యారు.*
*చిన్నాన్న సంరక్షణ – వివాహానికి దారి*
*అనాథలైన పిల్లల బాధ్యతను రమాబాయి చిన్నాన్న శంకర్ ధూత్రే స్వీకరించారు. ఆయన ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవారు. రమాబాయి అక్క గౌరీబాయి, చెల్లెలు మీరాబాయి, తమ్ముడు శంకర్. ఆ కాలంలో బాల్యవివాహాలు సామాజికంగా అమలులో ఉన్నవి. రమాబాయి వివాహం గురించి ఆలోచిస్తున్న సమయంలోనే అంబేడ్కర్ తండ్రి రామ్ జీ సక్పాల్ తన కుమారుడికి వివాహం చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. ధాబోల్ ప్రాంతంలో సంబంధాలు చూస్తున్న సందర్భంలో రమాబాయి గుణగణాలు గమనించిన రామ్ జీ సక్పాల్ ఆమెనే తన కుమారుడికి సరైన జీవన సహచరిణిగా నిర్ణయించారు.*
*వివాహం – సామాజిక వాస్తవానికి అద్దం*
*1908 సంవత్సరం ముంబయి నగర సబ్ స్టేషన్ పరిధిలో భాయ్ జిల్లాలోని చేపల మార్కెట్లో రాత్రి సమయంలో అంబేడ్కర్–రమాబాయి వివాహం జరిగింది. ఆ వివాహ వేదిక ఈ దేశ కులవ్యవస్థ వాస్తవాన్ని బహిర్గతం చేసింది. చేపల వాసన, మురికి నీరు, అవమానకర పరిస్థితులు అస్పృశ్యుల జీవితానికి ప్రతీకలుగా నిలిచాయి.*
*వివాహ సమయంలో రమాబాయి వయస్సు – 9 సంవత్సరాలు - అంబేడ్కర్ వయస్సు – 16 సంవత్సరాలు. ఇది కేవలం ఒక కుటుంబ కథ కాదు, అది ఆ కాలపు సామాజిక క్రూరత్వానికి ప్రత్యక్ష సాక్ష్యం.*
*తల్లిగా రమాబాయి – కోల్పోయిన సంతానాలు*
_1924 నాటికి అంబేడ్కర్–రమాబాయి దంపతులకు ఐదుగురు పిల్లలు:_
*1. యశ్వంత్ రావు*
*2. గంగాధర్*
*3. రమేశ్*
*4. ఇందు*
*5. రాజారత్న*
*పోషకాహార లోపం, రక్తహీనత, వైద్యసౌకర్యాల లేమి వల్ల యశ్వంత్ రావు తప్ప మిగతా నలుగురు చిన్న వయసులోనే మరణించారు. ఈ వరుస మరణాలు రమాబాయి శరీరాన్ని మాత్రమే కాదు మనసును కూడా నలిపేశాయి.*
*రాజారత్న మరణం – తల్లి హృదయ విరగడం*
*చిన్నవాడు రాజారత్న రమాబాయికి ప్రాణం. 9 నెలల వరకు తానే సపర్యలు చేసి పెంచింది. 1926 జూలై 19న న్యుమోనియాతో రాజారత్న మరణించాడు. అత్యంత దారుణమైన వాస్తవం ఏమిటంటే రమాబాయి కూడా రక్తహీనతతోనే మరణించింది.*
*ఈ పేదరికాన్ని డా.బి.ఆర్. అంబేడ్కర్ తన గ్రంథం “Thoughts on Pakistan” లో వేదనతో గుర్తు చేసుకున్నారు.*
*పేదరికంలోనూ గౌరవం – జీవన పోరాటం*
*రమాబాయి కుట్టుమిషన్ పనులు చేసింది. పేడ ఏరింది. పిడకలు తయారు చేసి ఇంటింటికి తిరిగి అమ్మింది. వెటకారాలు ఎదుర్కొంది. అవమానాలు భరించింది. కానీ ఆమె ఎప్పుడూ తలవంచలేదు. “కుటుంబం కోసం పనిచేయడంలో సిగ్గేముంది?” అని గట్టిగా సమాధానం చెప్పింది.*
*డా. అంబేడ్కర్ చదువుల వెనుక నిలిచిన ఆర్థిక క్రమశిక్షణ*
*డా.అంబేడ్కర్ ఇచ్చిన 50 రూపాయలను రమాబాయి రోజుకు రూ.1.50 చొప్పున 30 పొట్లాలుగా విభజించి ఖర్చు చేసేది. మిగిలిన 5 రూపాయలను అత్యవసరాల కోసం దాచేది. ఈ ఆర్థిక క్రమశిక్షణే అంబేడ్కర్ విద్యా ప్రయాణానికి పునాది.*
*కరుణామూర్తి రమాబాయి – పూణే ఒప్పందం సందర్భం*
*కమ్యూనల్ అవార్డు సమయంలో గాంధీ ఎరవాడ జైలులో నిరాహార దీక్ష చేసినప్పుడు కస్తూరిబా, సరోజిని నాయుడు అంబేడ్కర్ ఇంటికి వచ్చి వేడుకున్నారు. రమాబాయి గాంధీ ప్రాణాలు కాపాడాలని అంబేడ్కర్ను వేడుకుంది. ఇది రాజకీయ వ్యూహం కాదు, మానవీయ కరుణ.*
*అనారోగ్యం – ఒంటరితనం – చివరి కోరిక*
*రమాబాయి అనారోగ్యంతో మంచాన పడినప్పుడు అంబేడ్కర్ తలుపు దగ్గర నుంచే చూసి వెళ్లేవారు. ఆమెకు సమయం ఇవ్వలేకపోయిన బాధను అంబేడ్కర్ స్వయంగా అంగీకరించారు. పండరీపురం వెళ్లి విఠోభాను చూడాలన్న ఆమె చివరి కోరిక అంటరానితనం వల్ల 100 గజాల దూరంలోనే ఆగిపోయింది. ఆ రోజు అంబేడ్కర్ దేవుడినే ప్రశ్నించారు.*
*మరణం – అంబేడ్కర్ విరిగిపోయిన క్షణం*
*1935 మే 27న దాదర్, బొంబాయిలో 38 ఏళ్ల వయసులో మాతా రమాబాయి మరణించారు. అంబేడ్కర్ చిన్న పిల్లవాడిలా ఏడ్చారు. వారం రోజుల పాటు గది దాటి రాలేదు. భిక్షువుగా మారాలనుకున్నారు. కానీ కోట్లాది ప్రజల కోసం మళ్లీ పోరాటాన్ని ఎంచుకున్నారు.*
*అంకితభావానికి అక్షర సాక్ష్యం*
*1945లో “Pakistan or the Partition of India” గ్రంథాన్ని అంబేడ్కర్ రమాబాయికి అంకితం చేస్తూ ఆమె త్యాగాన్ని శాశ్వతంగా లిఖితబద్ధం చేశారు.*
*రమాబాయి లేని అంబేడ్కర్ ఊహించలేం*
*రమాబాయి ఒక భార్య మాత్రమే కాదు ఒక ఉద్యమానికి వెన్నెముక. ఆమె త్యాగం లేకపోతే డా.బి.ఆర్. అంబేడ్కర్ లేరు. అంబేడ్కర్ లేకపోతే ఈ దేశ ప్రజాస్వామ్యమే లేదు.*
*అమర్ రహే మాతా రమాబాయి అంబేడ్కర్*
*త్యాగానికి శాశ్వత ప్రతీక🙏*


