#😇My Status
*ఇందిర భైరి(గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని)*
ఇందిర భైరి (1962, జూలై 7 - 2023, ఫిబ్రవరి 19) తెలంగాణకు చెందిన గజల్ కవయిత్రి, ఉపాధ్యాయిని. తెలంగాణ తొలి గజల్ కవయిత్రిగా పేరొందింది. 2018లో దక్కన్ గజల్ అకాడమీ స్థాపించింది. ఉపాధ్యాయురాలిగా పాఠాలు బోధిస్తూనే తీరిక సమయాల్లో గజల్స్ రాయడంతోపాటు తెలంగాణ గజల్ కావ్యం, సవ్వడి, గజల్ భారతం, మన కవులు పేరుతో గజల్స్ సంకలనాన్ని తీసుకొచ్చింది. బతుకమ్మ, తెలంగాణ అమరవీరులు, ఉద్యమ నేపథ్యం, సాయుధ పోరాటం, తెలంగాణ పండుగలపై కూడా అనేక గజల్స్ రాసింది.
ఇందిర 1962, జూలై 7న భైరి రామ్మూర్తి - వెంకటరమణ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో జన్మించింది. ఎంఏ, బీఈడి, ఎంఫిల్ చదివింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, కారేపల్లి తదితర ప్రాంతాల్లో పలు ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యాయినిగా పనిచేసింది. ప్రభుత్వ ఉద్యోగం రాకముందు ఇల్లెందు పట్టణంలోని శాంతినికేతన్ అనే ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తించింది. ఆ తరువాత ఇల్లందులో 20 ఏళ్ళపాటు ప్రభుత్వ పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో 2020లో ప్రధానోపాధ్యాయురాలిగా ఉద్యోగ విరమణ పొందింది.
1980లో ఇందిరకు రామశంకరయ్యతో వివాహం అయింది. భర్త సింగరేణి ఉద్యోగి. వారికి ఇందుసాగర్, రఘురాం, హిమజా రామం సంతానం. హిమజా రామం గాయనిగా రాణిస్తోంది.
బాల్యంలో తండ్రి నేర్పిన పుష్ప విలాపం, పోతన పద్యాలు, గబ్బిలం, మాలపల్లి వంటి కావ్య ప్రస్తావనలు అభ్యుదయ కవిత్వ దిశగా అడుగులు వేయించాయి. లోకం తెలుస్తున్న తరుణంలో తండ్రి పోత్సాహంలో కవిత్వం రాయడం ప్రారంభించి తొమ్మిదో తరగతిలో 'ఉక్కు పిడికిళ్లు' పేరుతో మొదటి కవిత రాసింది. ఆ తరువాత అప్పుడప్పుడు రాస్తుండేది. ఉద్యోగంలో చేరిన 1997 నుండి పూర్తిస్థాయి సాహిత్యరంగంలోకి అడుగుపెట్టింది. హైకూ, మినీ, నానో, వచన కవిత, గజల్, కథ, గేయం, పాట, అనువాదం, పరిశోధన మొదలైన ప్రక్రియలన్నింటిలో రచనలు చేసింది. అవన్నీ పలు దిన పత్రికలు, విద్యా వైజ్ఞానిక పత్రికలు, పుస్తకాలలో అచ్చయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాహితీ స్రవంతి కార్యకర్తగా ఖమ్మం, హైదరాబాద్లలో జరిగిన జనకవనం, సాహిత్య కార్యశాలలో కూడా పాల్గొన్నది.
*రచనలు*
2005: అలవోకలు (హైకూలు)
2007: అభిమతం (వచన కవిత్వం)
2015: తెలంగాణ గజల్ కావ్యం
2017: సవ్వడి (శతాధిక గజళ్లు)
2018: మనకవులు (గీతికలు)
2018: ఘనచరితలు (గేయ కవిత్వం).
1998లో ఆస్ట్రేలియా పత్రిక 'తెలుగు పలుకు' వారిచే తొలి కవితా పురస్కారం
1999లో రాగమయి ఆర్ట్స్ అకాడమీ జాతీయ స్థాయి అవార్డు (కవిత్వం)
2004లో అంబేద్కర్ రాష్ట్ర(ఉమ్మడి) అవార్డు (కవిత్వం)
2010లో చిగురు సాహిత్య సంస్థ జాతీయ స్థాయి అవార్డు (నానో)
2015లో మానస సాహిత్య సంస్థ జాతీయ స్థాయి అవార్డు (కవిత్వం)
2016లో అనసూయ-రత్నావతి పురస్కారం (గజల్)
2018లో రావి రంగారావు సాహిత్యపీఠం వారి ‘జనరంజక కవితా పురస్కారం.
కాన్సర్ వ్యాధికి చికిత్సను తీసుకుంటూ 2023, ఫిబ్రవరి 19న హైదరాబాదులో మరణించింది. ఇందిర కవిత రాసుకున్న ప్రకారమే 2023 ఫిబ్రవరి 20న సోమవారం ఉదయం హైదరాబాదులోని నిజాంపేటలో అంత్యక్రియలు జరిగాయి.
*మాధవి కాళ్ల*
*సేకరణ*


