*అలసిన వానిని ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*🌷🌷ఫిబ్రవరి 20🌷🌷*
*నేనాయనను చూడగానే చచ్చినవానివలె ఆయన పాదముల యొద్ద పడితిని" (ప్రకటన 1:17)*
హెబ్రీ 12:2 లో నున్న " యేసు వైపు చూచుచు" అను ఈ మూడు చిన్నమాటలలో ఎంతో గొప్ప రహస్యము గలదు. అవి మనకు మొట్టమొదటిగా, ఇప్పుడు మనము యేసు ప్రభువువైపు చూడవలెననియు, పిమ్మట ఈ భూమి మీద మాత్రమే గాక నిత్యత్వమంతయు ఆయననే చూచుచు ఉండవలెననియు చెప్పుచున్నవి. ప్రపంచ అద్భుతములు ఏడింటిలో కెనడాలోని, నయాగరా జలపాతము ఒకటిగా ఎంచ బడుచున్నది. అది ఎంతో రమ్యమైన దృశ్యము. 1928 లో నేను అచ్చట ఆరు దినములు ఉంటిని, అప్పుడు నేను ఆ జలపాతమును సూర్యోదయమున, మధ్యాహ్నమున, సూర్యాస్తమయమున వెళ్లి దర్శించసాగితిని. వాటిని నేను నూతన విధానములో చూడ సాగితిని. ఈ అద్భుత దృశ్యమును ఎంత ఎక్కువగా చూచితినో అంత అధికముగా అది సౌందర్యముగా ఉండుటను గమనించితిని. ఏదేమైనను నయాగరా జలపాతము యొక్క సంపూర్ణ సౌందర్యమును కొనియాడుటకు ఒకరు వాటిని శీతాకాలములో, వేసవికాలంలో మరియు ఇతరకాలములలో కూడా చూడవలసి యున్నది. దేవుని సృష్టిలో కేవలము అతి స్వల్ప భాగ్యమేయైన నయాగరా జలపాతము యొక్క సౌందర్యమును కొనియాడుటకు దీర్ఘ కాలము పట్టిన యెడల, సృష్టికర్త యైన మన ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క సౌందర్యమును కొనియాడుటకు మనకు నిత్యత్వము పట్టుననునది నిశ్చయము. నీ వ్యక్తిగత జీవితములో లేక పరిచర్య లో నీవు క్రుంగి పోయి, నిరాశ, నిస్పృహలతో ఉన్నట్లుగా ఉన్నప్పుడు, నీవు, "ఓ దేవా, నీ కుమారుని మహిమ యొక్క నూతన దర్శనమును నాకు దయచేయుము” అని ప్రార్ధించ వలెను.
అపొస్తలుడైన యోహానుకు ప్రభువును అతి సన్నిహితముగా చూచు ఆధిక్యత గలదు. అతడు ఆయనను ఎంతో నమ్మకముగా సేవించెను. అతడు ఆయనను ఏ ప్రశ్నయైనను అడుగవచ్చును. నిజముగా, అతడు ప్రభువు యొక్క రొమ్ముపై తన తలను ఆనించ వచ్చును. అతడు ప్రభువు రూపాంతరము పొందుటను చూచెను. అతడు ఆయన తిరిగి లేచుటను మరియు పరమునకు ఆరోహణమగుటను చూచెను. అయితే ఇప్పుడు ప్రకటన గ్రంధములో, యోహాను తన వృద్ధాప్యములో ఆయనను పూర్తిగా నూతన విధానములో చూచెను. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని అతనికి తెలియును. "నీవు ఎవరు?" అని అతనికి అడగవలసిన అవసరత లేదు, ఎందుకనగా " అల్ఫా యు ఒమేగయు నేనే .. నేను మొదటివాడను కడపటి వాడను" అను స్వరము చెప్పుట వినెను ( ప్రకటన 1:8,18), యోహాను తనతో మాటలాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగిన వెంటనే అతడు ఆయన పాదముల యొద్ద పడి, " ఓ ప్రభువా, నీవు ఎంతో సౌందర్యము గలవాడవు, నీవు ఎంతో గొప్పవాడవని నేనెంతమాత్రమును ఎరుగలేదు " అని చెప్పెను .
ఎందుకు మన ప్రభువు యోహానుకు అట్లు కనబడెను? జవాబు చాలా సామాన్యమైనది. మన ప్రభువు యోహానుతో, "నా ప్రజలు నా వలె కావలెనని కోరుచున్నాను" అని చెప్పుచున్నాడు. అందుచేతనే ప్రభువు యొక్క ప్రజలు ఆ సమయములో అత్యధికమైన శ్రమల ద్వారా వెళ్ళవలసి వచ్చెను. ప్రస్తుతము ఉదాహరణకు స్వచ్ఛమైన, ప్రకాశించు బంగారము కావలెనని కోరిన యెడల బంగారము అగ్నిలో కరిగించబడి, శుద్ధి చేయబడవలెను. కంసాలి కరిగించబడిన లోహము యొక్క ఉపరితలంలో అద్దము వలె తన ముఖమును చూడ గల్గునంతవరకు అగ్నిని అధికముగా వేడి చేయును. బంగారము సంపూర్ణముగా స్వచ్ఛమైనదనుటకు పరీక్ష ఏమనగా, కరిగిన లోహములో కంసాలి ముఖము యొక్క ప్రతిబింబము కనబడుటయే. అదే విధముగా మనలో కూడా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమ కనబడు పర్యంతము మనము అగ్నివంటి శ్రమల ద్వారా శుద్ధీకరించ బడవలెను.
Please share
🙏🏼Praise the LORD.🙏🏼
#📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝

