ShareChat
click to see wallet page
search
అసలు ప్రజల జీవితం ఎక్కడ? గతం తవ్వడం – వర్తమానం పూడ్చడం ఆ పార్టీ వాళ్లు ,వాళ్ల నాయకులు ఏం చేశారు… ఈ పార్టీ నేతలు గతంలో ఏం చేశారు… అని ఒకరిపై ఒకరు ఫైళ్లను తవ్వుకుంటూ, వీడియోలను కట్ చేస్తూ, పాత ప్రసంగాలను తిప్పి చూపిస్తూ రోజులు గడుస్తున్నాయి. ప్రజల సమస్యలు నేటివి. కానీ రాజకీయాల చర్చ, రచ్చలు మాత్రం నిన్నటిదే. వాళ్లని వీళ్లు తిట్టుకుంటారు. వీ ళ్లని వాళ్లు దూషిస్తారు. ఒకరిని ఒకరు అవినీతి పాఠశాలలుగా చూపిస్తారు. ఎవరు పవిత్రులు కారు. కానీ పవిత్రుల్లా నటించడంలో మాత్రం అందరూ ప్రావీణ్యులు. సోషల్ మీడియాలో ఇంకో రంగస్థలం. అక్కడ అనవసర ఎలివేషన్‌లు, అతి బిల్డప్‌లు. ఒక నాయకుడు ఊపిరి పీల్చినా “చరిత్రాత్మక నిర్ణయం” అంటారు. మరొకరు మాట తడబడినా “దేశద్రోహి” అని ముద్ర వేస్తారు. ట్రెండ్‌లు, హ్యాష్‌ట్యాగ్‌లు, ఫ్యాన్ వార్‌లు – అసలు ప్రజల జీవితం ఎక్కడ? అసెంబ్లీ అనే వేదిక ప్రజాస్వామ్య ఆలయం కావాలి. కానీ అది చాలాసార్లు అరుపుల అరంగేట్రంగా మారిపోతోంది. సమయం వృథా. ప్రజల డబ్బుతో నడిచే ప్రతి నిమిషం ఖర్చు అవుతోంది. ఒక రోజు అసెంబ్లీ నడవకపోతే కోట్ల రూపాయల నష్టం. ఆ నష్టం ఎవరిది? అదే ప్రజలది. మైక్‌లు విరగడం, పేపర్లు చించేయడం, వెల్‌లోకి దూకడం – ఇవే ఇప్పుడు “పోరాటం”గా ప్రచారం. సమస్యలపై గంభీర చర్చలు, చట్టాలపై లోతైన విశ్లేషణ – ఇవి వార్త కావడం లేదు. ఇంకా బాధాకరం ఏమిటంటే… ఈ అన్నింటినీ చూసి కూడా ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. “మా నాయకుడు బాగా బుద్ధి చెప్పాడు” అని గర్వపడుతున్నారు. అసెంబ్లీ గౌరవాన్ని కాపాడని నాయకులను ప్రశ్నించకుండా, వారి ప్రవర్తనను సమర్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నాయకులు తప్పు చేస్తే అది వారి స్వభావం. కానీ ప్రజలు ప్రశ్నించకపోతే అది సమాజం యొక్క బలహీనత. ప్రజాస్వామ్యం అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓటు వేయడం మాత్రమే కాదు. మధ్యలో జరిగేదాన్ని గమనించడం, తప్పు అయితే ఖండించడం కూడా బాధ్యతే. గతాన్ని తవ్వి తిట్టుకోవడం సులువు. వర్తమానాన్ని సరిచేయడం కష్టం. కానీ కష్టం చేయకపోతే భవిష్యత్తు చీకటిగా మారుతుంది. నాయకులు మారకపోతే నష్టం ప్రజలది. కానీ ప్రజలు మారకపోతే నష్టం తరాలది. మీరు ఏమనుకుంటున్నారు? అసెంబ్లీ గౌరవాన్ని కాపాడని నాయకులను బహిరంగంగా ఖండించాలా? లేక పార్టీ భావోద్వేగం పేరుతో మౌనం వహించాలా? మీ ఘాటు అభిప్రాయాన్ని కామెంట్స్‌లో రాయండి. #🏛️రాజకీయాలు #🟢వై.యస్.జగన్ #🟨నారా చంద్రబాబు నాయుడు #✡జనసేనాని పవన్ కళ్యాణ్