నిన్న అర్ధరాత్రి కన్నుమూసిన ఉష భర్త శ్రీనివాసన్
కబడ్డీ క్రీడాకారుడిగా పేరుగాంచిన శ్రీనివాసన్
1991లో పెళ్లి చేసుకున్న ఉష, శ్రీనివాసన్
భారతదేశం గర్వించదగ్గ క్రీడాకారిణి, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె భర్త వెంగళిల్ శ్రీనివాసన్ కన్నుమూశారు. ఆయన వయసు 67 సంవత్సరాలు. నిన్న అర్ధరాత్రి ఆయన కోజికోడ్ జిల్లాలోని తిక్కోడి పెరుమల్పురంలో ఉన్న నివాసంలో అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక్కసారిగా కుప్పకూలారు. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ప్రకటించారు.
భర్త మరణించిన సమయంలో పీటీ ఉష ఇంట్లో లేరు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆమె ఢిల్లీలో ఉన్నారు. తన భర్త మరణవార్త తెలియగానే ఆమె వెంటనే ఢిల్లీ నుంచి బయల్దేరి కేరళకు చేరుకున్నారు.
శ్రీనివాసన్ విషయానికి వస్తే... ఆయన కబడ్డీ ఆటగాడు. సీఐఎస్ఎఫ్ లో డిప్యూటీ ఎస్పీగా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందారు. పీటీ ఉషకు ఆయన దూరపు బంధువు అవుతారు. 1991లో వీరు వివాహం చేసుకున్నారు. వీరికి ఉజ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నాడు. శ్రీనివాసన్ మృతి వార్తతో భారత క్రీడా ప్రపంచంలో విషాదం నెలకొంది. పీటీ ఉషకు క్రీడ, రాజకీయ ప్రముఖుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి.
#😰ఇంట్లో కుప్పకూలి..పీటీ ఉషా భర్త కన్నుమూత!


