#🙏ఓం నమః శివాయ🙏ૐ ప్రభల తీర్థం.....*
*ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండలో మహాశివరాత్రి సందర్భంగా ప్రభల ప్రదర్శన అత్యంత వైభవంగా జరుగుతుంది. ప్రభల బండ్లను రంగురంగుల కాగితాలతో అందంగా అలంకరిస్తారు. కొన్ని ప్రభలకు విద్యుత్ దీపాలు అమర్చుతారు. ఈ ప్రభల ఊరేగింపులో మొక్కుబడులున్న వారు ప్రభ ముందు నడుస్తారు. ప్రభముందు తప్పెట వాయిద్యాలు. ఆ వాయిద్యాలకు తగినట్టుగా బండికి కట్టిన ఎద్దులు ఠీవిగా నడుస్తూ ఉంటే భక్తులు ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూవుంటారు.*
*ప్రభలు గ్రామాలగుండా సాగిపోతున్నప్పుడు గ్రామస్తులు ఎదురు వచ్చి స్త్రీలు కడవలతో వార పోయగా, పురుషులు కత్తి చేతబట్టి దండకాలు చదువుతారు. ఈ ఉత్సవంలో భాగంగా చిన్న పిల్లలు చిన్న ప్రభలు నిర్మిస్తే, పెద్దలు దాదాపు 100 అడుగుల ఎత్తుకుపైగా ప్రభలను నిర్మిస్తారు. ఊరేగింపులో బ్యాండు. రికార్డింగ్ డ్యాన్సులతోనూ, పగటి వేషాలవంటి పలు కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రభలను గతంలో ఎడ్లబండ్లలో తీసుకువచ్చేవారు. ప్రస్తుతం ట్రాక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటిని ఊరేగింపుగా తీసుకువెళ్లి శివుడికి కానుకగా త్రికూట పర్వతం ముందు నిలుపుతారు. కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో జరిగే ఈ తీర్థం అత్యంత వైభవంగా జరుగుతుంది. కోటప్పకొండ తిరునాళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా జరిపిస్తుంది.*
*పూర్వం కోటప్పకొండ సమీపంలోని కొండ కావూరు గ్రామంలో ఆనందవల్లి అనే పరమశివ భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు కొండపైకి వెళ్లి పాత కోటయ్యస్వామికి పూజలు చేసేది. ఒకనాడు తాను వయోభారంతో కొండ ఎక్కలేక పోతున్నానని స్వామిని వేడుకోగా స్వామి ప్రత్యక్షమై ముందు నీవు వెనక్కి చూడకుండా కిందకు నడువు నీ వెనుక నేను వస్తానని చెప్పాడు. ఆమె కిందకు దిగుతూ స్వామి వెనుక వస్తున్నారో లేదో అని వెనుదిరిగి చూడటంతో స్వామి శిలగా మారాడు. దాంతో ఆమె తిరిగి ఆ స్వామిని వేడుకోగా కొండకు కోటినొక్క ప్రభలు వస్తే అప్పుడు కొండదిగి కిందకు వస్తానిని చెప్పాడు. దాంతో ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు కోటప్పకొండకు సమీపంలోని అన్ని గ్రామాల వారు ప్రభలు కట్టుకుని కోటప్పకొండకు వస్తారు. ముఖ్యంగా నర్సరావుపేట, చిలుకలూరి పేట, అమీన్ సాహిబ్ పాలెం, గంగనపాలెం, కోమటినేనివారిపాలెం, గోవిందపురం. కమ్మవారిపాలెం, కావూరు. అప్పాపురం, పురుషోత్తపట్టణం, ఉప్పల నపాడు, నకరికల్లు, దేచవరం, గామాలపాడు, ఈవూరు, బొమ్మరాజుపల్లి గ్రామాలు, పట్టణాలనుండి భారీ ప్రభలు, వివిధ గ్రామాలనుంచి చిన్న, మధ్య తరహా ప్రభలు కొండకు వస్తాయి. ఈ సాంప్రదాయం వందల ఏళ్లనుంచి కొనసాగుతోంది.*
*ప్రతి గ్రామానికి సొంతగా ప్రభనిర్మాణానికి కావలిసిన వస్తు సామాగ్రి ఉంటుంది. శివరాత్రికి 15 రోజుల ముందు ఒక మంచి రోజున ప్రభతయారీ మొదలు పెడతారు. ఆయా గ్రామాల్లో కంసాలి సహాయంతో ప్రభలు కడతారు. ముందుగ వెదురు కర్రలతో ప్రభకు ఒక ఆకారాన్ని తీసుకొస్తారు.. వెదురు కర్రలు ఒకదానికి ఒకటి కలిసే చోట కొబ్బరి పీచు తాడుతో గట్టిగా కడతారు. ఆ ఆకారానికి తడికలు కడతారు. తరువాత వాటిపై రంగు రంగుల కాగితాలు, కాగితాలతో చేసిన పూలు అంటిస్తారు. దీంతో ప్రభకు ఒక రూపం వస్తుంది. రూపుదిద్దుకున్న ప్రభకు వందల సంఖ్యలో విద్యత్ దీపాలను చిలుకలూరి పేట, నర్సారావు పేటకు చెందిన సాంకేతిక నిపుణులు అమర్చుతారు. చిన్న ప్రభలు 6 అడుగుల నుంచి 60 అడుగులు వరకు కడతారు. వీటిలో కొన్ని సాదా, కొన్ని విద్యుత్ ప్రభలు ఉంటాయి. పెద్ద ప్రభలు మాత్రం ఒక్కొక్క ప్రభ 60 అడుగుల నుంచి 100 అడుగుల ఎత్తు వరకు కడతారు. ప్రభలకు అమర్చిన విద్యత్ దీపాలను వెలిగించటానికి పెద్ద జనరేటర్లు వాడతారు. ప్రభల ఎత్తు, డిజైన్ విషయంలో గ్రామాల మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. ప్రభతయారికి రూ.10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. గ్రామాల్లో స్థానిక ప్రజలు ఏడాదికి ఒక వర్గం చొప్పున వంతులు వారీగా చందాలు వేసుకుని ప్రభల నిర్మాణం చేపడతారు. పురుషోత్తమపట్నం గ్రామంలో పోటా పోటీగా మూడు, నాలుగు విద్యుత్ ప్రభలు కడతారు.*
*కోటప్పకొండకు 20 కి.మీ. ఆ పై దూరంగల గ్రామాలలోని విద్యుత్ ప్రభలు కొండకు చేర్చటానికి శివరాత్రికి ఒక రోజు ముందే గ్రామంనుంచి ప్రభ బయలు దేరుతుంది ముందుగా ప్రభను రాతి చక్రాలతో కూడిన చెక్కరథంపై ఉంచుతారు. ఆ రథాన్ని ముందుగా సాంప్రదాయబద్ధంగా కోడెగిత్తల ద్వారా లాగుతారు. ఆ తరువాత వాటి స్థానంలో ట్రాక్టరును వాడుకుంటున్నారు. ఒక్కొక్క ప్రభను తరలించటానికి రథానికి 50 నుంచి 100 జతలు గిత్తలు కట్టి రథాన్ని లాగించేవారు. ప్రస్తుతం కొన్ని ప్రభల రథాలను ట్రాక్టర్లు లాగుతున్నాయి. పమ్మతాడులు పట్టుకునే వారు చేదుకో... కోటయ్య.. అని ఆ కోటయ్య స్వామిని స్మరిస్తూ తాడులు పట్టకుని ప్రభపడిపోకుండా జాగర్తగా ముందుకు నడుపుతారు. కొండకు ప్రభ చేరేలోపు కనీసం రెండు సార్లు అయినా రథం ఇరుసు ఇరుగుతుంది. ఇరుసులు సిద్ధంగా ఉంటాయి. దాన్ని మార్చటానికి రెండు మూడు గంటలు సమయం పడుతుంది. ఇలా అనేక ప్రయాసలు పడి ఒక రోజు ముందు బయలు దేరినా శివరాత్రి రోజున రాత్రి 8 గంటల సమయానికి వేరుకుంటుంది మరీ ఎక్కవ ఇబ్బందులు ఎదురైతే మాత్రం ప్రభ ఒక్కొక్క సారి 1 గం. 2 గం.లకు తెల్లవారుజామున చేరుకుంటాయి. ప్రభలు ఇరిగిపోయిన సంఘటనలు, విరుగత్ షార్ట్ అయ్యి ప్రభలు కాలిపోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ప్రభలను గ్రామాలలో కట్టుకొని కొండకు తీసుకెళటం అనేది ఒక్క కొటప్పకొండలో మాత్రమే కనపడుతుంది.*
*కోటప్పకొండ సమీపంలోని గ్రామాల్లో అన్నిపండుగల కన్నా మహాశివరాత్రి పర్వదినాన్నే పెద్ద పండుగగా సాంప్రదాయ బద్దంగా చేసుకుంటారు. ఈ పండుగకు ఇతర ప్రాంతాల్లో ఉన్న తమ కూతుళ్లను. అల్లుళ్లను ఆహ్వానించడం ఇక్కడి సాంప్రదాయం. వేరు వేరు కారణాలతో ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు కుటుంబసమేతంగా పండుగలకు మూడు. రోజుల ముందే తమ స్వగ్రామాలకు చేరుకుంటారు. మొక్కుబడులు ఉన్నవారు శివరాత్రి ఉదయం పూటనే కొండకు చేరుకొని తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకుంటారు.*
*బంధువుల రాకతో ప్రతి ఇల్లు సందడిగా ఉంటుంది. పిండివంటల సువాసనలు గ్రామం అంతా నిండిపోతాయి. ప్రభనిర్మాణం పూర్తి అయ్యిన తరువాత శివరాత్రికి మూడు రోజుల ముందుగా గ్రామాలలో ప్రభలపై సాంఘిక, పౌరాణిక నాటికలు, నృత్య ప్రదర్శనలు, కోలాట విన్యాసాలు, కనకతప్పెట్ల కోలాహలం అందరిని ఆకట్టుకుంటాయి.*
*ఈ సందర్భంగా త్రికుటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. ఆర్.టి.సి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది.*
*┈┉┅━❀꧁శివోహం꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🚩🍁 🙏🕉️🙏 🍁🚩🍁


