ShareChat
click to see wallet page
search
#😇My Status #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణఆంజనేయులు తెప్పపై విహారం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. శ్రీవారి తెప్పోత్సవాల చరిత్ర తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే ఐదు రోజుల తెప్పోత్సవాలను “తెప్ప తిరునాళ్లు”గా పిలుస్తారు. ఈ సందర్భంగా శ్రీవారు స్వామి పుష్కరిణిలో అలంకరించిన తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. జీవన సాగరంలో మునిగిపోకుండా భక్తులను రక్షించే దైవానుగ్రహానికి ఇది ప్రతీకగా భావిస్తారు. తెప్ప అనగా పడవ, ఓడ. ఓడలో సుఖాశీనులైన శ్రీవారిని కోనేటిలో విహారం చేయించడాన్నే తెప్పోత్సవం అంటారు. తిరుమలలో తెప్పోత్సవాలు అత్యంత ప్రాచీనకాలం నుండి జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రతి సంవత్సరం ఫాల్గుణ / చైత్ర మాసాల్లో (ఫిబ్రవరి–మార్చి) ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. శ్రీ సాళువ నరసింహరాయలు క్రీ.శ 1468లో పుష్కరిణి మధ్యలో నీరాళి మండపాన్ని నిర్మించి తెప్పోత్సవాలకు అనువుగా తీర్చిదిద్దారు. ఆయన కుమారుడు పెద్ద తిరుమలయ్య పుష్కరిణి పునరుద్ధరణ చేపట్టి, స్వామి పుష్కరిణి – వరాహ పుష్కరిణిలను వేరు చేసినట్లు శాసనాల్లో పేర్కొనబడింది. క్రీ.శ.15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య తిరుమల తెప్పోత్సవాలను గొప్పగా కీర్తించారు. మధ్యలో కొంతకాలం విరామం వచ్చినప్పటికీ, 1921లో తిరిగి ఈ ఉత్సవాలు పునరుద్ధరించబడ్డాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీ.ఆర్.నాయుడు, ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -------------------- టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
😇My Status - ShareChat