పేదరికాన్ని జయించి... ఎక్సైజ్ ఎస్సై కొలువు సాధించి
-గ్రూప్-2 సాధించిన అంగన్వాడీ టీచర్ కుమార్తె
-కష్టాల్లోంచి పుట్టికొచ్చిన "దీప్తి" సక్సెస్ స్టోరీ
పేదరికాన్ని జయించి చాలామంది ప్రభుత్వ కొలువులు సాధిస్తున్నారు. వారి సక్సెస్ స్టోరీలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి. అయితే మనం చెప్పుకోబోయే అమ్మాయి గ్రూప్-2 తొలి ప్రయత్నంలోనే సాధించిన తీరు కంటతడి పెట్టిస్తుంది.కష్టాలన్నీ కట్టకట్టుకుని వెంటాడినా కష్టపడి చదివి అనుకున్నది సాధించింది.చదువు విలువ చాటి చెప్పింది..
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చింతపర్తి దీప్తి ఎకైజ్ ఎసై గా ఎంపికై మంగళవారం బాధ్యతలు స్వీకరిస్తుంది. ఆ చిన్నారి పడ్డ కష్టాలు మాటల్లో చెప్పలేనివి.తండ్రి రాజు(ఇస్సాక్)ఏడో తరగతి మాత్రమే చదివాడు.తల్లి సుమలత పదో తరగతి చదివి అంగన్ వాడీ టీచర్ గా పనిచేస్తుంది. దీప్తి తో పాటు డిగ్రీ చదువుతున్న మరో చెల్లెలు ఉంది. తండ్రి ఇస్సాక్ కు ఆరోగ్యం అంతంతమాత్రమే.ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ మందులుతో కాలం గడుపుతున్నారు.బరువు పనులు చేయకూడదు. అందుకునే టైలర్ గా పనిచేసేవారు. ఆ వృత్తికి ఆదరణ లేకపోవడంతో ఓ ఫైనాన్స్ కంపెనీ వద్ద పనిచేస్తున్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు.రెండు ఫోర్షన్ల చిన్న ఇంటిలో రాజు అతని తమ్ముడు కుటుంబాలు ఉంటున్నాయి.
ఆ రూ.500ల ప్రోత్సాహం ముందుకు తీసుకెళ్లింది
. దీప్తి చదువు ఒకటి నుంచి పది వరకు దామిరెడ్డిపల్లి కి సమీపంలో ఉన్న వీరవరం ఎలిమెంటరీ, హైస్కూల్లో సాగింది. అయితే ఏడో తరగతిలో స్కూల్ పస్ట్ వచ్చిందని ఆ అమ్మాయికి ఓ దాత రూ.500 లు ప్రోత్సాహం ఇచ్చారు. అది ఆ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. చదువుకుంటే ఇలాంటి ప్రోత్సాహం ఉంటుందని తల్లిదండ్రులు చదివించడం కొనసాగించారు. హైస్కూల్లో పదవతరగతి మంచి మార్కులతో పాస్ అయ్యింది. దీంతో ఇంటర్మీడియట్ కడియం వాగ్దేవి అనే చిన్న జూనియర్ కాలేజీలో చదివింది.అంటే కడియం లో ప్రభుత్వ కళాశాల లేదు. ఇంటర్మీడియట్ లో కూడా మంచి మార్కులు సాధించడంతో డిగ్రీ చదవడానికి ముందుకు వచ్చింది. సరే ఏదొకటి అవుతుందని డిగ్రీ చదవడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీలో బిఎస్సి కంప్యూటర్స్ చదివింది.2020 సంవత్సరంలో డిగ్రీ పూర్తయింది.పూర్తి అయ్యిందని చెప్పుకున్నంత సులభంగా మాత్రం కాదు.తన ఊరి నుంచి వీరవరం కిలోమీటర్ నడిచి వెళ్లాలి.అక్కడ నుంచి ఆటోలో కడియం చేరుకోవాలి.అక్కడ కనబడతాయి ఆర్టీసి బస్సులు.అంటే దీప్తి ఊరు నుండి సర్వీసు ఆటోలు కూడా నేరుగా ఉండవు.ఇంత కష్టపడి చదివిన తర్వాత ఏమి చెయ్యాలి..? అందరూ పెళ్ళి చేసేయమని ఒక్కటే వత్తిడి.అయితే ఆ అమ్మాయి మాత్రం ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తానని పట్టుదల.
రూ.4 వేలుకు స్కూల్ వాలంటీర్ గా చేరి
ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తానని పట్టుదలతో ఉన్న దీప్తి కుటుంబం పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సొంత గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్ట్ లో చేరింది. నెలకు రూ.4వేలు జీతం. ఆ జీతం డబ్బులతో పుస్తకాలు కొని చదవడం ప్రారంభించింది. అమ్మాయికి చదువుపై ఉన్న పట్టుదలను చూసిన తల్లిదండ్రులు ఇంట్లో ఏ పని చెప్పకుండా చదువుకోడానికే అవకాశం ఇచ్చేవారు. ఓ పక్కన పిల్లలకు పాఠాలు చెపుతూ మరో పక్కన చదవడంపై దృష్టి పెట్టింది. తన లక్ష్యం ఏకంగా సివిల్స్ వైపుకు వెళ్ళింది. అది కొట్టడం అంటే ఆసామాషి విషయం కాదని తనకు తెలియందేమి కాదు.2021,22 రెండు సంవత్సరాలు స్కూల్లో పనిచేస్తూనే చదువు సాగించింది. అయితే రోజురోజుకు చదువు తపన విపరీతంగా పెరిగిపోతుంది. కాని గైడ్ లైన్స్ ఇవ్వడానికి తన బంధుమిత్రులు ఎవరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం ఆర్ సి రెడ్డి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేరితే సాధిస్తావని కడియంకు చెందిన కంప్యూటర్ సెంటర్ యజమాని లావేటి రాధాకృష్ణ అతని సోదరులు ప్రోత్సహించారు. అందుకు తల్లిదండ్రులు అంగీకరించారు. కొంచెం కొంచెం కూడబెట్టుకుని సమకూర్చుకున్న బంగారు వస్తువులు తాకట్టు పెట్టి కోచింగ్ సెంటర్లో చేర్చారు. కోచింగ్ సెంటర్లో చేరినంత మాత్రాన ఉద్యోగాలు వచ్చేస్తాయని గ్యారెంటీ ఏమీ ఉండదు. అక్కడ కూడా కష్టపడే చదివితేనే సాధించగలుగుతారు. అయితే డబ్బు విలువ తెలిసిన దీప్తి ఆ కోచింగ్ సెంటర్ లో ఏ క్షణాన్ని వదిలిపెట్టలేదు. ఓ పక్క క్లాసులు కి వెళ్తూనే మరోపక్క రేయింబవళ్ళు చదువుతూనే ఉంది. చదవడం అంటే గదిలో మిగిలిన విద్యార్థులు ఉన్నప్పుడు రాత్రి అంతా లైట్ వేసుకుంటానంటే కుదరదు కదా. అయితే ఈ అమ్మాయి రాత్రి వేళ్లతో ఆరుబయట చలిలో దుప్పటి కప్పుకుని అలా చదివుతూనే ఉండేది.పండుగల సెలవులకు అందరూ ఇంటికి వెళ్లినా తను మాత్రం హాస్టల్లో ఉంటూ చదివేది. ఈ అమ్మాయి పట్టుదల చూసి అక్కడ వార్డెన్లు ఆశ్చర్యపోయేవారు.దగ్గరికి పిలిచి నువ్వు కచ్చితంగా సాధిస్తామని మనస్ఫూర్తిగా దీవెనలు ఇచ్చేవారు.
ఏడు సెకన్లల్లో చేజారిన ఎసై ఉద్యోగం
2023లో జరిగిన సబ్ ఇన్స్పెక్టర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. అయితే ఫిజికల్ పరీక్షలలో 1600 మీటర్ల రన్నింగ్ లో ఏడు సెకన్లు ఆలస్యంగా చేరుకోవడం వల్ల ఆ ఉద్యోగం చేజారింది. ఆ సమయంలో వర్షం రావడం ఆ వర్షంలో ఎప్పుడూ రన్నింగ్ ప్రాక్టీసు చేయకపోవడం వల్ల సాధించ లేకపోయింది. కాని మరింత పట్టుదల పెరిగింది.ఆ పట్టుదల గ్రూప్-2 సాధించడానికి దోహద పడింది.ఎకైజ్ ఎసై గా ఎంపికైన దీప్తి మంగళవారం కాకినాడలో రిపోర్ట్ చేస్తుంది. అనంతరం ట్రైనింగ్ కి వెళుతుంది. అయితే తన కుమార్తె ఈ ఉద్యోగం సాధించిందనే నిజం నుంచి తల్లిదండ్రులు బయటకు రాలేకపోతున్నారు.ఎందుకు చెప్పడం అంటే దీప్తి తండ్రి ఇస్సాక్ చాలా మాటలు పడ్డారు. ఆయన బందువులు,స్నేహితులు మీ అమ్మాయిని ఏదో చదివిస్తున్నావంట...అలాంటివి మన పేటలో వాళ్లకు రావు...డబ్బు, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే వస్తాదని వాదిస్తుంటే ఎక్కడో భయం వెంటాడేది.ఇద్దరు అమ్మాయిలతో జీవితాన్ని ఎలా నెగ్గుకు రావాలనే బెంగ పట్టుకునేది.
గ్రూప్-2 సాధించినా ఎవరికి చెప్పుకోలేదు
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జనవరిలో అందరితో పాటే దీప్తి గ్రూప్-2 కి ఎంపికైది.కాని ఉద్యోగంలో చేరే వరకూ ఎవరికి చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. అందుకునే ఈ విషయం ఇప్పటి వరకూ ఎవరికి తెలియదు.మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రెండేళ్ళ క్రితం వరకూ ఈ అమ్మాయికి టచ్ ఫోన్ లేదు. అయితే యూట్యూబ్ ద్వారా కొంత సమాచారం తెలుసుకోవడానికి దోహద పడుతుందని కంప్యూటర్ సెంటర్ రాధాకృష్ణ ఓ ట్యాబ్ ను ఇచ్చారు.చివరిగా ఆశ్చర్యం కలిగించే పేదరికం విషయం తెలుసుకుందాం... గ్రూప్-2 పరీక్ష రాసిన తరువాత ఫలితాలు రావాల్సి ఉంది. గత సంవత్సరం ఇదే రోజుల్లో దీప్తి రోజుకు రూ.500 పనికి వెళ్లింది. ఆ పని ఏంటంటే ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్లు దిద్దుతారు కదా వారికి సహాయం చేయడానికి. అంటే పేపర్ల కట్టలు లోపల నుండి తేవడం, రుద్దిన పేపర్లు తిరిగి కట్టలు కట్టి లోపల పెట్టడం వంటివి నెల రోజులు పాటు రాజమహేంద్రవరం ప్రభుత్వ జూనియర్ కాలేజిలో పనిచేసింది. ఇప్పుడు ఎక్సైజ్ ఎసై ఉద్యోగం సాధించింది. అంటే తను పేదరికాన్ని ఎలా జయించింది అని చెప్పడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే.తన కృషి,పట్టుదల నేటి తరానికి ఎంతో ఆదర్శం. తల్లిదండ్రులు చెమట చుక్కలతో చదివితే ఫలితం ఇలా ఉంటాదని దీప్తి చాటి చెప్పింది.
గ్రూప్ -1 సాధించాలనే లక్ష్యం
అయితే తాను గ్రూప్-1 సాధించాలనే లక్ష్యంగా పెట్టుకున్నానని దీప్తి చెబుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి విజయవాడ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సెంటర్లో చదువుకుంటుంది. కొద్ది నెలల క్రితం పరీక్షలు రాసి ఆ సీటు ఉచితంగా సాధించింది.ఓ పక్క ఉద్యోగం చేస్తూనే తన లక్ష్యం నెరవేర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటానని ధీమా వ్యక్తం చేస్తుంది.తనను చదివించడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాలు జీవితాంతం మరువలేనని దీప్తి తెలిపింది.
దీప్తి లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అభినందనలు.
#Group2Mains
#రాజమంహేంద్రవరం
#kadiyam
#😇మోటివేషనల్ వీడియోలు #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #🙆 Feel Good Status #షేర్ చాట్ బజార్👍


