*🌻 'మకరతోరణం' అంటే ఏమిటి? దాని విశేషం ఏమిటి? ఈరోజు తెలుసుకుందాం. 🌻*
🍃🌺 మన దేవాలయాలలో దేవతా/దేవుని విగ్రహాల వెనుక అమర్చిన తోరణం మధ్యభాగంలో కనుబొమ్మలు ముందుకు చొచ్చుకు వచ్చిన ఒక రాక్షసముఖం కనిపిస్తుంది. దానికే 'మకరతోరణం' అని పేరు.
🍃🌺 ఈ రాక్షసముఖాన్ని తోరణం మధ్యభాగంలో అమర్చడానికి గల కారణం గురించి స్కంద మహాపురాణంలో ఒక కథ ఉంది. పూర్వం "కీర్తిముఖుడు" అనే రాక్షసుడు బ్రహ్మను మెప్పించి అనేక వరాలను పొంది, ఆ బలపరాక్రమాలతో సమస్త భువనాల సంపదలను తన సొంతం చేసుకున్నాడు.
🍃🌺 చివరకు పరమశివుని పత్నియైన జగన్మాతను కూడా పొందాలని ఆశించాడు. అతని దురాశను చూసి కోపించిన మహేశ్వరుడు అతనిని మ్రింగివేయమని భీకరమైన అగ్నిని సృష్టించాడు. పరమేశ్వరుని ఆజ్ఞ మేరకు ఆ జ్వాలాగ్ని ఆ రాక్షసుణ్ణి తరిమింది.
🍃🌺 మరణం లేకుండా వరం పొందినప్పటికీ, శివుని ఆజ్ఞ వల్ల ఆ అగ్ని తనను ఎక్కడ దహించి వేస్తుందో అని భయంతో లోకాలన్నీ తిరిగి, ఆ అగ్ని ప్రతాపానికి తట్టుకోలేక చివరకు పరమశివుని శరణు కోరాడు. భక్తసులభుడైన బోళాశంకరుడు ఆ రాక్షసుణ్ణి రక్షించటానికి ఆ అగ్నిని ఉపసంహరించి తన నుదుటి మూడవ కన్నుగా ధరించాడు.
🍃🌺 ఆ తరువాత కీర్తిముఖుడు తనకు తీవ్రమైన ఆకలి ఉందని, తినడానికి ఏదైనా ఇవ్వమని మహాదేవుని ప్రార్థించాడు. అప్పుడు శివుడు "నిన్ను నువ్వే తిను" అని చెప్పాడు. శివుని ఆజ్ఞ మేరకు కీర్తిముఖుడు మకర (మొసలి) రూపం ధరించి తనను తాను తోక భాగం నుండి కంఠం వరకూ తిన్నాడు.
🍃🌺 అయితే తన తలను తానే ఎలా తినాలో తెలియక, ఇంకా ఆకలి తీరక మళ్లీ శివుని ప్రార్థించాడు. ఆ ప్రార్థన విన్న పరమశివుడు, ఇకపై దేవాలయాలలో దేవతామూర్తుల వెనుక తోరణాగ్రభాగాన్ని అలంకరించి, దైవ దర్శనానికి వచ్చే ప్రజలలోని అహంకారం, దురాశ వంటి దుష్ట వికారాలను తినుతూ ఉండమని వరమిచ్చాడు. నీవు అందరికీ పూజనీయుడవుతావు అని అనుగ్రహించాడు.
🍃🌺 అప్పటి నుండి కీర్తిముఖుడు దేవాలయాలలో దేవతా విగ్రహాల వెనుక తోరణ మధ్యభాగంలో తన మకరముఖంతో స్థిరపడి, భక్తులలోని అహంకారం, దురాశ వంటి దుష్ట భావాలను తొలగిస్తున్నాడు.
🍃🌺 ఈ కారణంగానే దేవతామూర్తుల వెనుక మధ్యభాగంలో అమర్చబడిన తోరణాన్ని 'మకరతోరణం' అని పిలుస్తారు. మన సంస్కృతిలో ప్రతి అంశానికి పురాణాల్లో ఒక కథ ఉంటుంది.
__________________________________________
Haribabu.G
___________________________________________
#✌️నేటి నా స్టేటస్ #🏹 జై శ్రీ రామ్! #🙏రామ నవమి శుభాకాంక్షలు🌸 #ఆధ్యాత్మిక జ్ఞానామృతం #తెలుసుకుందాం


