P.Venkateswara Rao
#🙏 శ్రావణ మాసం 🙏 విశిష్టత.
హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం విశిష్టమైనదిగా భావిస్తారు. చాంద్రమానం ప్రకారం.. తెలుగు మాసాల్లో ఐదో మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే శుభ మాసం. శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు, నభో అంటే ఆకాశం అని అర్ధం. పౌర్ణమి తిది రోజు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. అలాగే.. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ మాసం అని కూడా వచ్చిందని చెబుతారు. ఈ మాసంలో చేసే పూజలు ఎంతో విశిష్టమైనవిగా హిందు ఆచారాన్ని పాటించే వారి నమ్మకం.దేవతలకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైన ఈ మాసంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పెద్దల ఉవాచ. తిథులతో కూడా సంబంధం లేకుండా అష్టమి, నవమి, అమావాస్య రోజుల్లో కూడా పూజలు, పండుగలు చేసే మాసం ఈ శ్రావణ మాసం మాత్రమే. అందుకే దీన్ని అత్యంత శుభప్రదమైన మాసంగా భావిస్తారు.
శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా, చంద్రుడు మనఃకారకుడు. అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావము చూపే మాసము. ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును. చంద్రుని చార నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు, మంచి కలిగించుటకు, ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది. మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్ధము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి, ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు, మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసం లో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించడం ముఖ్యోద్దేశమైనది.
ఈ శ్రావణ మాసంలో శివ కేశవులను నిష్టతో, అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం ఇలా ఈమాసంలో ప్రతి రోజూ విశిష్టతతో కూడుకున్నదే. ఈ మాసంలో ఒక్కోరోజు ఒక్కో దేవున్ని పూజిస్తారు.
సోమవారాల్లో శివుడికి అభిషేకాలు,
మంగళవారం గౌరీ వ్రతం
బుధవారం విఠలుడికి పూజలు,
గురువారాల్లో గురుదేవుని ఆరాధన,
శుక్రవారాల్లో లక్ష్మీ, తులసి పూజలు
శనివారాల్లో హనుమంతుడికి, తిరుమలేశునికి, శనీశ్వరునికి ,భక్తులు ప్రత్యేక పూజలు చేస్తూ కొలుస్తారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కో దేవున్ని పూజించడం తర తరాల నుండి సాంప్రదాయంగా వస్తుంది. రోజు చేస్తున్న పూజలు కాకుండా ఈ మాసంలో నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పొలాల అమావాస్య వంటి పండుగలు ఈ మాసంలోనే వస్తాయి.
స్థితికారుడైన శ్రీమహావిష్ణువు, ఆయన దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం. ఈ శ్రావణ మాసంలోనే వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజలు ఆచరిస్తారు. అందుకే ఈ మాసాన్ని ఆధ్యాత్మిక మాసం అని కూడా అంటారు. అంతే కాకుండా శ్రావణమాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన, పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలు ఈ నెలలో ఎక్కువగా ఉంటాయి. అందేకే ఈ నెలను వ్రతాల మాసం అని, సౌభాగ్యాన్ని అందించే మాసమని పెద్దలు చెబుతారు. సముద్ర మథనం సమయంలో వెలువడ్డ హాలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసం ఈ శ్రావణ మాసంగా చెబుతారు. అందుకే ఈ మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివుడి ఆరాధనకు ఎంతో విశిష్టమైనవి, శుభకరమైనవి. శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. నిష్టతో, భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అష్ట లక్ష్ములలో వరలక్ష్మి దేవికి ఓ ప్రత్యకత ఉంది. మిగిలిన లక్ష్మి పూజలకంటే వరలక్ష్మి పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి.
ఇక ఈ మాసంలో మంగళవారాల్లో వచ్చే మంగళ గౌరీ వ్రతం కూడా ఎంతో విశిష్టమైనది. శ్రీ కృష్ణుడు ద్రౌపదీ దేవికి, నారద మునీంద్రుడు సావిత్రిదే వికి ఉపదేశించిన మంగళగౌరి వ్రతము ఈ మాసం లో ఆచరించడం ఎంతో ప్రాసస్థ్యమైనవి. మంగళగౌరి కటాక్షం ఏ స్త్రీల పై ఉంటుందో వారికి వైధవ్య బాధ ఉండదు. సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్దిల్లుతారు. కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ.
ఈ శ్రావణ మాసం పండుగల కాకుండా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభ కార్యాలకు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు. ఇక శ్రావణ మాసం వర్ష రుతువుతో ప్రారంభమవుతుంది. వర్షాలు బాగా కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని కూడా రైతులు వేడుకుంటారు. శూన్యమాస మైన తర్వాత వచ్చే శ్రావణమాసం కోసం మండే ఎండాకాలమైన గ్రీష్మ ఋతువు ,వెళ్లి చల్లబరచే వర్ష ఋతువు ప్రవేశించి ఉపశమనం కలిగిస్తుంది .పంటలు వేసేకాలం .భూమి ఆకుపచ్చ చీర కట్టుకొని ముచ్చటగా దర్శనమిచ్చి మనశ్శాంతి కల్గిస్తుంది .
జంధ్యాల పౌర్ణమి, హయగ్రీవ జయంతి ని ఈ రోజు జరుపుకొంటారు. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించందం ద్వారా, ఏకాగ్రత, బుద్ది కుశలత, జ్ఞానం, ఉన్నత చదువు, కలుగుతాయని ప్రతీతి . జంధ్యాన్ని యగ్నోపవీతమని , బ్రహ్మసూత్రమని పిలుస్తారు. యజ్ఞోపవీతం సాక్ష్యాత్తు గాయత్రి దేవి ప్రతీక. యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ది కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వెదోక్తి. ఈ రోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. పాత జంధ్యాలు తీసి కొత్త జంధ్యాలువేసుకొనే జంధ్యాల పూర్ణిమ కొత్తగా ఉపనయనం చేసుకున్నవారు జంధ్యానికికున్న ‘’మౌంజి ‘’అంటే జింక తోలుముక్కను (అసలు అప్పటిదాకా ఉంచుకుంటే) తీసేసే రోజు. దీనికే ఉపాకర్మఅంటారు. రాఖీ పండగ కూడా .దీనినే రక్షాబంధనం అంటారు. స్త్రీలు తమ సోదరులకు రక్ష కట్టి వారికి అన్నిరకాల విజయాలు కలగాలని కోరుకుంటారు .సోదరులు వారి కోరికలు తీరుస్తారు .
అలెక్జా౦ డర్ పురుషో త్తముడితో యుద్ధం చేస్తున్నప్పుడు గ్రీసు దేశం నుండి అతనితో పాటు వచ్చిన అతడి ప్రియురాలు రుక్సానా భారత వీరుడైన పురుషోత్తమ పరాక్రమం ముందు గ్రీకు వీరుడు నిలువ లేడని గ్రహించి ,మారువేషం లో వచ్చి పురుషోత్తముడికి రక్షబంధనం కట్టి సోదరిగా తనభర్త ఓడిపోయినా చంపవద్దని కోరింది .అలేగ్జాండర్ పురుషోత్తముడి చేతికి చిక్కి అతనిపై కత్తి ఎత్తగా చేతికున్న రాఖీ కనబడి చంపకుండా వదిలేశాడు .ఆతర్వాత జరిగిన కథ మనకు తెలిసిందే .
భవిష్య పురాణం ఇంద్రుడు బలి చక్రవర్తిపై యుద్ధానికి వెడుతున్నప్పుడు భార్య శచీ దేవి విష్ణు మూర్తిని ప్రార్ధించి ఆయన సలహాతో లక్ష్మీ దేవి ఇచ్చిన దారపు రక్షకట్టి విజయ౦ కలగాలని కోరిందని ,దాని వలన బలిని ఓడించాడని చెబుతోంది .అప్పటి నుంచే రక్షాబంధనం లోకం లో ఆనవాయితీగా వస్తోందన్నమాట .
వినాయకుడికి శుభుడు లాభుడు అనే ఇద్దరు కొడుకులు .తమతో ఆడుకోవటానికి ,రక్షాబంధనం కట్టటానికి ఒక చెల్లెలు ఉంటే బాగుండును అనుకొని తండ్రికి చెప్పారు .అది జరగనిఅపని అన్నాడాయన .నారదమహర్షి వచ్చి కుమార్తె ఉంటేనే ఇంటికి మంగళ ప్రదం కనుక వారి కోర్కె తీర్చమన్నాడు .సరేనని ‘’సంతోషి మాత’’ను సృష్టించి తనభార్యలు రిద్ధి, సిద్ధిలకు ఇచ్చాడు .గణేశ పుత్రులు తమ చిట్టి చెల్లెలు సంతోషి చేత రక్షాబంధనం కట్టించుకొని కోరిక తీర్చుకున్నారు .
భాగవతం లో విష్ణుమూర్తి వామనావతార మెత్తి మూడడుగులదానం పుచ్చుకొని ,త్రివిక్ర ముడై ముల్లోకాలను ఆక్రమి౦చాడని ,దీనికి ప్రతిఫలంగా బాలి ఆయనను పాతాళం లో తనదగ్గరే ఉండి పొమ్మని వరం కోరితేసరే నని అక్కడే ఉన్నాడని .భర్త శ్రీ మహా విష్ణువు లేని వైకుంఠం లో ఉండలేక ఎలాగైనా భర్తను తెచ్చుకోవాలని లక్ష్మీదేవి పాతాళం చేరి, బలికి సోదరిగా రక్షాబంధన్ కట్టి వరం గా తనభర్తకు స్వేచ్చ కలిగి౦చమని కోరగా అంగీ కరించి విష్ణువుకుపాతాళం చెర విడిపించాడని ఉంది .
శ్రావణ, భాద్రపద మాసాలు వర్షాకాలం. ఈ కాలంలో వర్షాలు పడతాయి కాబట్టి అన్ని రకాల ఆహార పదార్థాలు తినకుండా జాగ్రత్తపడేవారు. శరీరంలో వేడి పుట్టించే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఆకు కూరలు పురుగు పట్టడం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోరు.
వర్షాకాలం కావడం వల్ల ఒంట్లోని నరాలు అన్నీ గట్టిపడి పనిచేయకుండా ఉంటాయి కాబట్టి ఆషాఢ మాసం నుంచి దేవీ పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ఆచారాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆచారాల వల్ల తప్పనిసరిగా శరీరాన్ని ఒంచి పనులు చేయాలి. నోములు, వ్రతాల పేరిట నియమ నిష్ఠలతో ఉంటారు. కాళ్ళకు ప్రతిరోజూ పసుపు రాసుకోవడానికి కారణం పసుపు యాంటీ బ్యాక్టీరియాగా పని చేసి ఈ కాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.
గోదావరి జిల్లాలలో ఇదే రోజు ‘’కంద పిలకలు ‘’అమర్చి పూజ చేసే అలవాటు ఉంది .కంద లో ఎభాగ౦లొను౦చైనా మొలకలు వస్తాయి .అది సంతానహేతువుగా భావించి పూజిస్తారని నా ఊహ .గోదావరి జిల్లాలో వివాహాది శుభకార్యాలలో అందుకే కందా బచ్చలి కూర వండటం కూడా శుభం కోసమే . ఇప్పుడు ఆవంటకం అన్ని జిల్లాలకూ పాకింది .