ShareChat
click to see wallet page
search
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: అన్నద ఏకాదశి / అజ ఏకాదశి (శ్రావణ మాసం కృష్ణ పక్షం) #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #అజ ఏకాదశి *ఏకాదశీ వ్రత మహిమ* *అన్నద ఏకాదశి (అజ ఏకాదశి)* అన్నద ఏకాదశి మహిమ శ్రీకృష్ణధర్మరాజుల సంవాదరూపంలో బ్రహ్మవైవర్తపురాణంలో వర్ణించబడింది. “కృష్ణా! శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి? దానిని గురించి నాకు వివరించవలసినది" అని ధర్మరాజు శ్రీకృష్ణునితో అన్నాడు. దానికి ప్రత్యుత్తరంగా శ్రీకృష్ణుడు ఇలా వివరించాడు. "రాజా! నేను చెప్పేది సావధానంగా విను. మనిషియొక్క సమస్త పాపాలను హరించే ఈ మంగళమయమైన ఏకాదశి పేరు అన్నద ఏకాదశి. ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించి ఇంద్రియాధీశుడైన హృషీకేశుని అర్చించేవాడు సమస్తపాపకర్మల ఫలం నుండి ముక్తుడౌతాడు". పురాతనకాలంలో హరిశ్చంద్రుడినే సుప్రసిద్ధుడైన చక్రవర్తి ఉండేవాడు. అతడు సత్యసంధుడు, నీతిమంతుడు. ఏవో కొన్ని తెలియని పాపాల కారణంగాను, తన మాటను నిలబెట్టుకోవడం కొరకు గాను అతడు తన రాజ్యాన్ని కోల్పోయాడు. చివరకు అతడు తనను, తన భార్యను, పుత్రుణ్ణి కూడ అమ్ముకోవాల్సి వచ్చింది. రాజా! ఆ పుణ్యచక్రవర్తి ఒక చండాలునికి సేవకుడయ్యాడు. అయినప్పటికిని అతడు సత్యసంధతతో స్థిరమైన శ్రద్ధను కనబరచాడు. తన యజమాని ఆదేశంపై అతదు శ్మశానంలో శవాలపై కప్పిన గుడ్డలను తన జీతంగా తీసికోవడం మొదలుపెట్టాడు. అంతటి నీచమైన పనిలో నెలకొనినప్పటికిని అతడు తన సత్యసంధత నుండి, సక్రమ వర్తనం నుండి వైదొలగలేదు. ఈ ప్రకారంగా అనేక సంవత్సరాలు గడిచాయి".. తరువాత ఒకరోజు ఆ చక్రవర్తి గొప్ప చింతతో ఆలోచించడం మొదలుపెట్టాడు. తాను ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఏ విధంగా తాను ఉద్ధరింపబడతాననే విషయాన్ని అతడు పదేపదే ఆలోచించాడు. అతని కష్టాన్ని చూసిన గౌతమముని ఆ రాజు చెంతకు వచ్చాడు. ఆ మునిని చూసిన హరిశ్చంద్రుడు పరుల లాభం కొరకే బ్రాహ్మణులను బ్రహ్మదేవుడు సృష్టించాడని తలచాడు. తరువాత అతడు ఆ మునికి వందనములు కావించి చేతులు జోడించి చెంతన నిలిచాడు. ఆ తరువాత తన దీనగాథను అతడు గౌతమముని కి వివరించాడు. రాజుయొక్క దీనగాథను వినిన గౌతమముని ఆశ్చర్యంతో “రాజా! శ్రావణమాస కృష్ణపక్షంలో వచ్చే అన్నద ఏకాదశి అత్యంత మంగళకరమైనది, సర్వపాపహరమైనది. ఆ ఏకాదశి త్వరలోనే రాబోవడం నీ అదృష్టమనే చెప్పుకోవచ్చు. ఆ ఏకాదశిరోజు నీవు ఉపవాసం ఉండాలి, రాత్రంతా జాగరణ చేయాలి. దాని ఫలితంగా నీ పాపమంతా నశిస్తుంది. ఓ రాజోత్తమా! నీ ప్రభావం చేతనే నేను నీ చెంతకు వచ్చానని తెలిసికో!" అని అన్నాడు. హరిశ్చంద్రుని ఆ రీతిగా ఆదేశించిన పిమ్మట గౌతమముని అదృశ్యుడయ్యాడు. ఆ తరువాత ముని ఆదేశం మేరకు రాజు అన్నద ఏకాదశి వ్రతాన్ని పాటించి సర్వపాపదూరుడయ్యాడు. ఓ రాజసింహమా! ఈ అద్భుతమైన ఏకాదశి ప్రభావం ఎటువంటిదంటే అనేకానేకసంవత్సరాలు అనుభవించాల్సి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడ దాని వలన హరించుకుపోతాయి. ఈ ఏకాదశీ ప్రభావం వలననే హరిశ్చంద్రుడు తన భార్యను, మృతపుత్రుని తిరిగి పొందాడు. అపుడు దేవతలు దుందుభులు మ్రోగించి ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించారు. తదనంతరం ఈ ఏకాదశీప్రభావం వలననే ఆ రాజు తన రాజ్యాన్ని ఎటువంటి అడ్డంకులు లేకుండ అనుభవించగలిగాడు. చివరకు అతడు తన బంధుమిత్రప్రజలతో పాటుగా భగవద్దామానికి వెళ్ళాడు. రాజా! ఈ ఏకాదశిని పాటించిన వ్యక్తి సమస్తపాపాల నుండి బయటపడి ఆధ్యాత్మిక జగత్తును చేరగలడు" అని శ్రీకృష్ణుడు ముగించాడు. *ఈ ఏకాదశీ మహిమను వినినవాడు, చదివినవాడు అశ్వమేధయాగ ఫలాన్ని పొందగల్గుతాడు.* *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: అన్నద ఏకాదశి / అజ ఏకాదశి (శ్రావణ మాసం కృష్ణ పక్షం) - ShareChat