#శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు #పోలాల అమావాస్య 🙏🏻 #పోలాల అమావాస్య #పోలాల అమావాస్య విశిష్టత 🌘🌑🌒🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩
🔔 *విశేషం*🔔
*రేపు పోలాల అమావాస్య*
23rd Aug.
శ్రావణ మాసం లో వచ్చే బహుళ అమావాస్యను ‘పోలాల అమావాస్య‘ అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత వుంది. సౌభాగ్యం కోసం, పిల్లల యోగ క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం శ్రావణ అమావాస్యనాడు పోలాల అమావాస్య వ్రతం ఈ వ్రతమును ఆచరిస్తారు.ఇది ప్రాంతాచారం. గ్రుహాచారం ఉన్నవారు పూజించే వ్రతం.
పోలాల అమావాస్య పూజా విధానం:
పూజచేసే చోట శుభ్రంగా అలికి, వరిపిండితో ముగ్గువేసి, ఒక కందమొక్కను వుంచి, దానికి పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. (కందమొక్క దొరకని పక్షంలో కందపిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును.)
తర్వాత మంగళగౌరీదేవిని కానీ, సంతానలక్ష్మిని కానీ ఆ కందమొక్కలోకి ఆవాహనచేసి షోడశోపచార పూజను చేయవలెను. తొమ్మిది పూర్ణం బూర్లు మరియు తొమ్మిది గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కధను చదువుకొని కధా అక్షతలను శిరస్సున ధరించాలి. ఆ తర్వాత కందమొక్కకు ఒక తోరాన్ని కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని సంతానం మొలలో కట్టాలి(సంతానం ఇంకా లేనివారు అక్కడ ఉన్న పిల్ల కందమొక్కకు సమర్పించవచ్చును).అనంతరం ముత్తయిదువును పూజించి నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి దీవెనలు అందుకోవాలి.
సంతాన క్షేమం కోసం స్త్రీలు ఆచరించే ఈ పూజలో పూర్ణం బూర్లు, గారెలు, తొమ్మిది రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నివేదిస్తారు.
ఆడపిల్లకావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు సమర్పించాలి.
మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పించాలి.
పోలాల అమావాస్య నాడు పితృ దేవతలను తలచుకోవడం ముఖ్యమైన అనవాయితీ.
పోలాల అమావాస్య వ్రత కధ:
పూర్వం పిల్లలమఱ్ఱి అనే గ్రామంలో సంతానరామావధానులు అనే స్మార్తపండితుడు ఉండేవాడు. ఆయనకు ఏడుగురు మగపిల్లలు. అందరికీ పెళ్లిళ్ళయి, కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్దకోడళ్ళు ఆరుగురికీ పిల్లలు పుట్టారు గానీ, చిన్నకోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం, వెంటనే చనిపోతూండడం జరిగేది. అలా ఆరుసార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికీ ఆ ఆరు సంవత్సరాలూ ‘పోలాల అమావాస్య వ్రతం’ చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం. సూటిపోటి మాటలతో బాధించేవారు. ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈ సారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్దకొడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్యనాడు సుగుణకు ప్రసవమై, మృతశిశువును కంది. ఈ సంగతి తోటికోడళ్ళకు తెలిప్తే తనను వ్రతానికి పిలవరని తలచి, చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి, ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డలమూట వుంచి తన తోటికోడళ్ళతో కలిసి ‘పోలాల అమావాస్య వ్రతాన్ని’ ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకుని కన్నీటితో స్మశానానికి వచ్చి, గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని, కన్నీరు మున్నీరుగా విలపించ సాగింది. అప్పటికి బాగా చీకటి పడింది.
ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలు దేరిన పోలాలమ్మదేవి, సుగుణ దగ్గరకు వచ్చి ‘ఎందుకు రోదిస్తున్నావు’ అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి, ‘ సుగుణా.., బాధపడకు. నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి, ఏ పేర్లయితే నీ పిల్లలకు పెట్టాలను కున్నావో ఆ పేర్లతో వారిని పిలు’ అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుత దగ్గరకు వెళ్లి తన పుత్రులను పేరుపేరునా పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచివచ్చి తమ తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని, వారిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చి జరిగినదంతా తన తోటికోడళ్ళకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ, పిల్లా,పాపలతో ఆనందమయ జీవితాన్ని అనుభవించి, తరించింది.
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻