#పూరి జగన్నాథ రథ యాత్ర 2025 🛕🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరి జగన్నాథ్ స్వామి వైభవం 🛕పూరి జగన్నాథ్ ఆలయంలో జరుగు ఉత్సవాలు / PURI UTSAVALU 🕉️🙏🙏🙏 #🛕జగన్నాథుని రథయాత్ర🛕
*దేవదేవుని రథయాత్ర*
*పురీ జగన్నాథ రథయాత్రకి ప్రపంచ ప్రసిద్ధి ఉంది.*
'పురుషోత్తమ క్షేత్రం'గా పురాణాలలో వర్ణింపబడే ఈ పావనధామం అద్భుతాలకు ఆలవాలం.
సృష్ట్యాదినుండే ఈ క్షేత్రాన నీలాచలమనే దివ్యపర్వతం ఉండేదనీ, ఇక్కడ ఇంద్రనీల మణితో చేసిన విష్ణువిగ్రహం దేవతలచేత ఆరాధించబడేదనీ పురాణాలు చెబుతున్నాయి.
*సాగరస్యోత్తరే తీరే మహానద్యాస్తు దక్షిణే ।*
*సప్రదేశః పృథివ్యాం హి సర్వతీర్థ ఫలప్రదః ||*
"సముద్రానికి ఉత్తరతీరాన, మహానదికి దక్షిణాన అన్నితీర్థాల ఫలాన్నిచ్చే ప్రదేశమది." అని స్కాందపురాణం చెబుతోంది.
కాలక్రమంగా ఆ క్షేత్రాన రత్నవిగ్రహం అదృశ్యమయింది. అవంతీ దేశాధి పుడైన ఇంద్రద్యుమ్న చక్రవర్తికి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు గోచరించి, ప్రేరేపించగా అతడీ క్షేత్రానికి చేరుకున్నాడు.
సముద్రతీరంలో ఒక దివ్యయాగాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞం పరి సమాప్తివేళ, యజ్ఞఫలంగా సముద్ర జలాల నుండి ఒక గొప్ప వృక్షరాజం తేలివచ్చింది.
అది విష్ణు మయమైన వృక్షం, నారాయణుని ఆజ్ఞప్రకారంగా విశ్వకర్మ (దేవశిల్పి) ఆ వృక్షాన్ని నాలుగు విగ్రహాలుగా తయారు చేశాడు.
అవి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన దేవతా స్వరూపాలు
*ఏకదారు సముత్పన్నాశ్చతుర్ధా సంభవిష్యతి।*
ఒకే దారువు (కర్ర) నాలుగు విగ్రహాలుగా అయినదని పురాణోక్తి.
కృతయుగంలోనే ఈ దేవతలు ఆవిర్భవించారని స్కాందం చెబుతోంది.
మహాలక్ష్మీ దేవియే సుభద్రా స్వరూపమనీ, ద్వాపరయుగంలో లక్ష్మీ అంశ కృష్ణ సోదరిగా రోహిణి పుత్రికగా జన్మించిందని పురాణ కథనం.
ఈ క్షేత్రానికి శివుడే క్షేత్రపాలకుడు, ఎనిమిది లింగమూర్తులుగా వివిధ దిశలలో నెలకొన్నాడు. ఎనిమిది దిక్కుల శక్తి పలురూపాలలో వెలసింది. ఈమె క్షేత్రరక్షాశక్తి,
*తస్మాద్దారుమయం బ్రహ్మ వేదాంతేషు ప్రగీయతే॥ (స్కందపురాణం)*
'ఇది దారురూపంలో ఉన్న బ్రహ్మమ్'- అని వేదాంతాలలో కీర్తించబడింది.
ఈ విగ్రహాలను బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠించాడని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఈ నాలుగు ఆకృతులను బృహస్పతితో కలిసి, దేవతల సమక్షంలో బ్రహ్మదేవుడు శ్రీసూక్త, పురుష సూక్తాలతో అభిమంత్రించి ప్రతిష్ఠించాడు.
*వైశాఖస్యామలే పక్షే అష్టమ్యాం పుష్యయోగతః|*
*కృతాప్రతిష్ఠా భోవిప్రాః శోభనే గురువాసరే॥* ( పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం)
వైశాఖ శుక్ల అష్టమీ- గురువారం- పుష్యమీ నక్షత్రం ఉన్న పుణ్య సమయంలో ప్రతిష్ఠ జరిగింది.
శ్రీ నృసింహ యంత్రంతో, మంత్రంతో చతుర్ముఖుడు ఈ ప్రతిష్ఠా మహోత్సవం జరిపినట్లు పురాణం వర్ణిస్తోంది. అందుకే ఇది ప్రధానంగా నృసింహక్షేత్రం. ఇక్కడి మహా వట వృక్షం, తీర్థం అత్యంత పురాణ ప్రసిద్ధి చెందినది.
జ్యేష్ఠపూర్ణిమ నాటి నుండి జ్యేష్ఠావ్రతాన్ని ఆచరించి, ఆషాఢశుద్ధ విదియ నాడు ఆ దివ్యమూర్తులకు రథ యాత్రను మొదట బ్రహ్మదేవుడే జరిపించాడని పురాణోక్తి.
అప్పటి నుండి పరంపరగా ఈ రథయాత్ర ఏటా జరుగుతోంది.
ఇప్పటికీ పన్నెండేళ్లకోసారి (అధికాషాఢం వచ్చిన ఏడాది) విష్ణులాంఛనాలతో ఉన్న దివ్యవృక్షాలను, కొన్ని సంకేతాల ద్వారా, ఆచార్యులు తెలుసుకొని, వివిధ ఉత్సవాలలో ఆ వృక్షాలను తరలించి, పద్దతి ప్రకారంగా విగ్రహాలను చెక్కిస్తారు.
పాత విగ్రహాలలోని కళలను ఈ నూతనాకృతులలో పునఃప్రతిష్ఠించి, పాతవాటిని సంప్రదాయబద్ధంగా ఖననం చేస్తారు.
ఇది కేవలం ఈ క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకం.
ప్రతిఏడూ మూలవిరాట్టులే సాక్షాత్తుగా కదలివచ్చే రథయాత్ర తొమ్మిది రోజుల పర్వం.
దీనికి *'మహావేదీ మహోత్సవం'* అని పేరుకూడా పురాణాల్లో కనిపిస్తోంది.
ప్రధానాలయం నుండి, ఒక్క రోజులో సకల భక్తజనులు భక్తి మయ హృదయాలతో స్వామివారిని గుండిచా మందిరానికి తరలిస్తారు.
అక్కడ కొన్ని రోజులపాటు ఆరాధింపబడి. ఆ వేళలో క్షేత్రానికీ, జగతికీ సకల శుభాలను అనుగ్రహించి, తిరిగి తొమ్మిదవ రోజున తన నిజమందిరానికి స్వామి సపరివారంగా చేరుకుంటాడు.
*రథస్థితం వ్రజంతం తం మహావేదీ మహోత్సవే ।*
*యేపశ్యంతి ముదాభక్త్యా వాసస్తేషాం హరేః పదే ॥*
“మహావేదీ మహోత్సవానికై రథంలో యాత్రచేసే స్వామిని సంతోషంతో భక్తితో చూసేవారికి విష్ణుపదంలో నిత్యవాసం కలుగుతుంది.”
ఆ వేళ స్వామిని తాకి వచ్చేగాలి ఒంటికి తగిలితే చాలు పాపాలు, అమంగళాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
*యధారథ విహారోయం మహావేదీ మహోత్సవః |*
*యత్రాగత్యదివో దేవాః స్వర్గం యాంత్యధికారిణః ॥*
ఈ రథయాత్రకు దేవతలందరూ స్వర్గం నుండి దిగివచ్చి, ఉత్సవం తరువాత తిరిగి వెళతారని “పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం" చెబుతోంది.
కొన్నిలక్షల మంది దర్శించి, తరించే ఈ పావన రథయాత్ర ఒక మహాద్భుతం.
భారతీయ సంస్కృతిలో భవ్యచైతన్య ముద్ర ఈ క్షేత్రానికి ఉంది.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*


