**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 17**
మన **హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం**లో భాగంగా ఈరోజు **15వ చౌపాయి** విశేషాలను తెలుసుకుందాం. నిన్నటి చౌపాయిలో మునులు, దేవతలు, విద్యాధి దేవతలు హనుమంతుని కీర్తిని ఎలా గానం చేస్తారో తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుని గొప్పతనం దిక్పాలకులు మరియు కవులకు కూడా వర్ణనాతీతమని తెలుసుకోబోతున్నాం.
**15వ చౌపాయి**
**జ(య)మ కుబేర దిగపాల జహాం తే |**
**కబి కోబిద కహి సకే కహాం తే ||**
**ప్రతిపదార్థం:**
* **యమ:** యమధర్మరాజు
* **కుబేర:** సంపదలకు అధిపతి అయిన కుబేరుడు
* **దిగపాల:** ఎనిమిది దిక్కులను కాపాడే దిక్పాలకులు
* **జహాం తే:** ఎవరైతే ఉన్నారో (వీరందరూ కూడా)
* **కబి:** కవులు
* **కోబిద:** పండితులు, విద్వాంసులు
* **కహి సకే కహాం తే:** (నీ కీర్తిని) ఎలా వర్ణించగలరు? (అంటే వారి వల్ల కూడా సాధ్యం కాదు అని అర్థం).
-----
**విస్తృత ఆధ్యాత్మిక వివరణ:**
**1. లోకపాలకుల ఆశ్చర్యం (దిక్పాలకులు):**
యమ కుబేర దిగపాల' యముడు, కుబేరుడు మొదలైనవారంటే ఇంద్రుడు, అగ్ని, వాయువు, నిఋతి, ఈశానుడు.. దిక్పాలకులందరూ హనుమంతుని కీరించారు. ఎక్కడెక్కడో పరిశీలిద్దాం
ఇంద్రుడు హనుమత్ భక్తులలో మొదటి వాడు. వజ్రాయుధం తో కొట్టాడు అని ముందే చెప్పుకున్నాం కదా ఆ సమయం లో నిన్ను కొట్టిన వజ్రాయుధం మొక్కవోయింది స్వామీ! వ్యర్థం అయిపోయింది తిరిగి ఇది పదునెక్కాలంటే నీ చేతికే ఇవ్వాలని సమర్పణ చేసుకున్నాడు. అలా ఇంద్రుడు హనుమ భక్తుడు అయ్యాడు. ఇంద్రుడు భక్తుడై ధ్యానం చేస్తుంటే హనుమంతునికి సంబంధించిన ఒక మంత్రం ఆయన తపస్సుకు గోచరించింది. హనుమంతుని ఆపదుద్ధారక హనుమన్మంత్రానికి ద్రష్ట శచీపురందరుడు. ఆయన హనుమంతుని సాక్షాత్కరింపజేసుకున్నాడు.
భూమి మీద కూడ శచీదేవి తో సహా వచ్చి హనుమ కోసం సాధన చేశాడు ఇంద్రుడు,అదే కన్యా కుమారీ తీరంలోని శచీ ఇంద్రం ఇది అందరు సూచింద్రం అంటారు కానీ అసలు పేరు శచీంద్రం. అందుకే అక్కడ స్వామిది పెద్ద మూర్తి ఉంటుంది, అక్కడ వాల పూజ చేసి తాను చేసిన దోషం పోగొట్టుకున్నాడు ఇంద్రుడు.
వాల పూజ హనుమ ఆరాధన లో ఎంతో విశేషం అయింది. స్వామి వారి వాలం గురించి లాంగుల ఉపనిషత్ కూడా ఉంది.
పోయి పోయి తోకతో పెట్టుకున్నాడు రావణుడు, మొత్తం కొంప తగలబడి పోయింది.అది మాములు తోక కాదు,తోక క్రింది నుంచి పైవరకు వెళ్ళి అక్కడ లేచి పైన పతాకంలా ఉంది అచ్చంగా మూలాధారం నుంచి పైకి లేచి సహస్రారం దాకా పాకిన మహాకుండలినీ స్వరూపమే స్వామి వాలం.
తోక గురించి పరాశర సంహిత ఒక రహస్యం చెప్పింది
లోకరక్షణ కోసం నారాయణుడు రామచంద్రమూర్తియై అవతరిస్తున్నాడు, తమరూ రావాలని దేవతలంతా కైలాసానికి వెళ్ళి శివుని ప్రార్థిస్తే “సరే” అన్నాడు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు నాకు బాణమై సహకరించాడు. అందుకు కృతజ్ఞతగా తప్పకుండా వస్తానని "సుందరః శుభగః శ్రీమాన్ హనుమాన్ మారుతాత్మజః" అన్నాడు పరమేశ్వరుడు. వెంటనే ఆ ప్రక్కన అమ్మ పార్వతీదేవి నేనూ వస్తానంటే 'నువ్వెందుకు తోకలాగ' అన్నాడు. అలాగే వస్తాను స్వామీ అంది అమ్మ. అలా దిగి వచ్చింది శక్తి. అందుకే లాంగూలం అనగా శక్తే. పార్వతి దేవి హనుమ తోక.ఆ గౌరమ్మనే కాళి గా మారి సీతమ్మ కన్నీరు కు బదులుగా లంకను దహించింది. అంత దివ్యమైన లాంగుల హనుమ ఇంద్రునికి సాక్షాత్కరించాడు.
యమకుబేరదిగపాల జహాతే.
మిగతా వారు ఎప్పుడూ కీర్తించారు మళ్లీ వెనక్కి చిన్న నాటి కథ వజ్రాయుధం తో కొట్టిన సందర్భం లోనే పిల్లవాడు సామాన్యుడు కాడని నమస్కరిస్తే 'అలా ఊరికే దండం పెడితే సరిపోదు, మీ శక్తులు, మీ అస్త్రాలు ఈయనకు ఇవ్వండి' అంటే, ఒకొక్కరూ స్వామి వారికి నమస్కారం చేసుకుని తమ అస్త్రశక్తులన్నీ ఇచ్చారు. యముడు, కుబేరుడు కూడా ఆ ఇచ్చినవారిలో ఉన్నారు.ఇలా అందరూ ఆ సమయంలో స్వామిని కీర్తించారు.
అంతే కాదు మరో కథ కూడా ఉంటుంది. ఒక మల్లయోధునికి జై భజరంగ బలి అనుకోవడం అలవాటు,పెద్ద భక్తుడు కాదు కానీ మల్ల యోధులు అలా అంటారు ఉత్సాహం కోసం.అలా నిరంతరం అంటూ ఉండే వాడు అదే అలవాటు అయి మరణ సమయంలో కూడా అదే నామం పలికాడు,చేసిన పాపాలకు యమలోకం వెళ్ళాడు,వీడు ఏమైనా పుణ్యం చేశాడా అని చిత్రగుప్తుని యముడు అడిగితే లేదు స్వామి కానీ నిరంతరం జై భజరంగ బలి అని మాత్రం అనేవాడు అన్నాడు.
దానికి ఫలితం ఏమిటి అని ఆలోచించి బ్రహ్మ గారిని అడిగితే, హనుమ నామానికి మనం విలువ కట్టలేం రాముణ్ణి అడుగుదాం పద అన్నాడు, ఇద్దరు వెళ్ళి రాముని అడిగితే నా నామం అన్నవారు ఏది పొందుతారో దానికి అధికంగా కొన్ని రెట్లు అతనికి ఇవ్వండి" అన్నాడు. ఆయనకు హనుమంతుడు అంటే అంత ప్రేమ.ఆ తర్వాత గొప్ప జన్మ పొంది మోక్షం పొందాడు.
ఆహా....! హనుమన్నామాలు ఇంత గొప్పవా...! అని కీర్తించాడు యముడు అది 'యమ కుబేర దిగపాల జహాతేఁ'. యముడు, ఇంద్రుడు అందరూ కీర్తించారు. "నా సర్వశక్తులు, నిధిదేవతలు హనుమ దగ్గర ఉంచుతున్నాను” అని కుబేరుడు అన్నాడు.
యముడు (న్యాయానికి, కాలానికి అధిపతి), కుబేరుడు (సంపదకు అధిపతి) మరియు అగ్ని, వరుణుడు వంటి దిక్పాలకులు తమ తమ అధికారాలతో లోకాన్ని శాసిస్తారు. కానీ, హనుమంతుని శక్తి మరియు రామ భక్తి ముందు వారి అధికారం కూడా చిన్నబోతుంది. హనుమంతుని గుణగణాలను పూర్తిగా అర్థం చేసుకోవడం లేదా వర్ణించడం ఆ దిక్పాలకుల వల్ల కూడా సాధ్యపడదు.
**2. కవి పండితుల పరిమితి (కబి కోబిద):**
'కబి కోబిద కహి సకే కహాఁతే' - దివ్యలోకంలో ఉన్న నారాయణుడు మొదలు సర్వదేవతలు నీ కీర్తిని గానం చేయలేకపోతే, ఇక భూమియందున్న మేధావులు ఏమని వర్ణించగలరు...? మనం తరించడం కోసం ఆయనను వర్ణించడమే కానీ సంపూర్ణంగా ఆయనను వర్ణించడం ఎవరికీ చేతకాదు. ఎన్ని ముఖాలు పెట్టుకుని కీర్తించినా కూడా ఆయన వైభవాన్ని ఎవరూ సంపూర్ణంగా కీర్తించలేరు.
చతుర్ముఖః పంచముఖశ్చ షణ్ముఖస్సహస్రః శీర్షాద్విముఖైక వక్త్రః త్రిమూర్తి తేజోమయమాంజనేయం జ్ఞాతుం సమర్థశ్చ నహి త్రిలోక్యామ్
(పరాశరసంహిత)
చతుర్ముఖ, పంచముఖ, షణ్ముఖ, సహస్రశీర్షాః - చతుర్ముఖుడంటే బ్రహ్మదేవుడు, పంచముఖుడంటే శివుడు, షణ్ముఖుడంటే సుబ్రహ్మణ్యస్వామి, సహస్రముఖుడు అన్నప్పుడు ఆదిశేషువు.... వీరంతా కూడా కలిసి నీ వైభవాన్ని వర్ణించడానికి సమర్థులు కారు అన్ని ముఖాలు పెట్టుకున్నవారే సమర్థులు కారు. ఇక ఏకముఖులైన మానవుల వల్ల అవుతుందా...? అని దీని భావం.
ఈ శ్లోకమే తులసీదాసుగారికి హనుమాన్ చాలీసా రచించడానికి ప్రేరణ అయింది. సంహితా గ్రంథాలంటే ప్రధానంగా మంత్రశాస్త్ర గ్రంథాలు. ఈ మంత్రశాస్త్ర గ్రంథాల విషయాలన్నీ తులసీదాసు హనుమాన్ చాలీసాలో పెట్టారు. అందుకే హనుమాన్ చాలీసా పారాయణమే పెద్ద మంత్రం.
లోకంలో కవులు తమ ఊహాశక్తితో ఎంతటి గొప్ప విషయాన్నైనా వర్ణించగలరు. పండితులు తమ తర్కంతో దేనినైనా వివరించగలరు. కానీ, హనుమంతుని అనంతమైన మహిమను, ఆయనలోని వినయాన్ని, బలాన్ని వర్ణించడానికి ఏ కవి కలం సరిపోదు, ఏ పండితుని మేధస్సు సరిపోదు. ఆయన వర్ణనాతీతుడు.
-----
**తులసీదాసు గారి సందేశం:**
తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా ఒక వినమ్రతను చాటారు. "యమ కుబేరుల వంటి గొప్ప వారే నీ కీర్తిని పూర్తిగా చెప్పలేనప్పుడు, నా వంటి సామాన్యుడి వల్ల ఎలా సాధ్యం?" అని హనుమంతుని ముందు మోకరిల్లారు. అంటే, భగవంతుని శక్తి లేదా భక్తుని గొప్పతనం అనేది మాటలకు, వర్ణనలకు అతీతమైనది. దానిని కేవలం అనుభవించాలి తప్ప, పూర్తిగా వివరించడం ఎవరికీ సాధ్యం కాదని సందేశం.
-----
**జై శ్రీరామ్\! జై హనుమాన్\!**
-----
హనుమంతుని కీర్తిని వర్ణించడంలో కవి పండితులకే సాధ్యం కానప్పుడు, మనం ఆయనను మన హృదయాలలో స్మరించుకోవడమే నిజమైన పూజ. రేపటి చౌపాయిలో హనుమంతుడు సుగ్రీవునికి చేసిన మహోపకారం గురించి తెలుసుకుందాం. #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊


