• చనిపోయిన పెదనాన్న
మా పెదనాన్న చనిపోయాడని, మా నాన్న ఫోన్ చేసి చెప్పాక నాకెందుకో ఎక్కళ్ళేని దిగులేసింది. అది ఒకరకంగా బయంతో కూడుకున్న దిగులు.
మన తాత చనిపోతే మనకేం దిగులెయ్యదు. వాళ్ళ గెవితులు మనల్ని వెంటాడతాయి. మన తాత వయసున్న వాళ్ళు చనిపోతన్నారంటే మన తాతల తరం ముగిసిపోతన్నట్టే. అదే మన పెదనాన్న చనిపోయాడంటే మన నాన్నల తరం కూడా ముగిసిపోటం మొదలైనట్టు.
అప్పుడే మన నాన్నలు ముసలోళ్ళై పోయి, జారిపోతున్నారంటే ఎక్కళ్ళేని దిగులు కమ్ముకుంటుంది. తాతల నుంచి అయ్యలదాకా, అయ్యల నుంచి మనదాకా ఇలా తరానికి తరానికి చావు మారుతూ ఉంటుంది. మనల్ని కన్నతరమే జారిపోవటం మొదలైందంటే దిగులుకాక ఇంకేం మిగిలిద్ది.
మా పెదనాన్న మా నాన్నకి సొంత అన్న కాదు. మా నాన్నోళ్ల నానోళ్ళు సొంత అన్నదమ్ములు. మా నాన్న, చనిపోయిన పెదయ్య, ఇంకో పెదయ్య, మా బాబాయి ఇలా సంతానం చాలా ఉంది. వీళ్ళంతా అన్నదమ్ముల పిల్లలు. మా చనిపోయిన పెదనాన్నవాళ్ళు గరికపాడు వదిలిపెట్టి ఎప్పుడో గుంటూరులో స్థిరపడ్డారు. ఏవైనా పండగలకి, పబ్బాలకి, చావుకి, అంటుకి, పెళ్ళిళ్ళకి తప్పా మొహమొహాలు చూసుకున్నది లేదు. మా చనిపోయిన పెదనాన్నతో నాకు చెప్పుకోదగ్గ గ్యాపకాలు లేవు. ఆయన కొంత పెద్దరికంగా ఉండేవాడు. పిల్లల్ని నవ్వుతూ పలకరించేవాడు. కానీ మేం బాగున్నావా పెదనాన్న అని పలకరించటం వరకే ఉండిపోయింది. అయితే మా పెదనాన్నకి మా కుటుంబాల వాళ్ళంతా మళ్ళీ ఒకచోట ఉండాలనే కోరిక ఉండేది. ఆయన బయమంతా తర్వాత తరం పిల్లలు కలవరేమో, ఏ గూటి పక్షులు ఆ గూటికే అయిపోతారేమో అనే బెంగ. అసలే మా ఇంటిపేటోళ్ళం పిరికెడు మందిమే. ఆయన బతికున్నప్పుడు ఏదైనా పబ్బానికి వస్తే కోడిని కోసుకొని ఏపుడు పెట్టుకొని, గుడిసెలో సారా తాగుతూ ఉన్నప్పుడు "మనకి అంటు పట్టడం ఏం ఉండదురా. మనకి బలగమే లేదు. బలగం ఉన్న ఇళ్లలో ఏడాదికి ఒకత్యాపైనా ఉంటే, మనకయ్యేం లేవు" అనేవాడు.
బలగం ఎక్కువున్నోళ్లు అంటు పట్టలేక అంటు వదులుకునేవాళ్లు. అలా అంటు వదులుకుంటూ పోతే ఆ బలగం అంతే తగ్గిపోతూ ఉంటుంది. మాకు అంటు వదులుకునేంత బలగమే లేదు.
మా నాన్న కానీ, పెదనాన్న కానీ ఆడపిల్లలని చుట్టరికం దాటకుండా ఇచ్చుకున్నారు. కానీ మొగపిల్లల పరిస్థితే వాళ్ళు అనుకున్నట్టు కాకుండా పోయింది. మా పెదనాన్నకి ఒకాడపిల్ల, ఇద్దరు మొగపిల్లలు ఉంటే, మగపిల్లలు ఆయన మాట ఇనకుండా పొయ్యారు. అసలు మా ఊరు నుంచి మొదట మా పెదనాన్న బతకలేక దర్శి పోయిండు. ఆడ్నుంచి ఎన్నో తడవలు గరికపాడు వద్దాం అనుకుండు కానీ, ఊరి దాటిన బతుకు మళ్ళీ ఊరికేం చేరిద్ది. యట్నో రాలేకపోయినా, దర్శిలోనన్నా కదలకుండా కాత్త చుట్టాలకి దగ్గరగా ఉంటే చాలనుకుండు. కూతుర్ని కూడా అక్కడే ఇచ్చిండు. కానీ మా పెదనాన్న అనుకున్నట్టు జరిగితే తమ్ముళ్ళకి దూరంగా కాలం చెయ్యాల్సిన గతి పెట్టేది కాదు. మా అన్నోళ్లు ఇద్దరూ మాట వినే రకమే కానీ మరెందుకో దర్శిలో ఉండలేక గుంటూరు చేరారు. మొదట రానని మా పెదయ్య మొండికేసినా, పోక తప్పలేదు. నేనంత దూరం పోతున్నానని ఎడం జెయ్యమాకండి అని కళ్ళ నీళ్ళు పెట్టుకొని మరీ పోయిండు. ఏనాడన్నా కలవటానికీ లేకుండా పోయింది. చేతి వాటానుంటే చిటికిమాటికి కలవొచ్చు. యడమయ్యాక అదట్నే పెరుగుతూ పోతంది తప్పా, తగ్గదు.
గుంటూరు పొయ్యాక, మా చిన్నన్న సాయిబులమ్మాయిని పేవించి పెళ్ళి జేసుకుండు. అది బో యాగీ అయింది. వాళ్ళు ఇళ్ల మీదకి వచ్చి కొడితే మా చిన్నన్న యాడికో పోయి దాక్కొని, మళ్ళీ ఆవని దీసకపోయి పెళ్ళి చేసుకున్నాడు. వాళ్ళకి పిల్లలు పుట్టాక మళ్ళీ అంతా ఒకటయ్యారు కానీ, చుట్టాలు ఏటికి పిలవటం మానేశారు. అందరితో కలిసుండే రాతలేదని ఆడ్నే ఉండిపోయిండు మా పెదనాన్న. పెద్దాయన కదా అని చుట్టాలు కొన్నాళ్ళకి ఆయన్ని పిలవటం మొదలుపెట్టారు. పెళ్ళికైనా, చావుకైనా, పండక్కైనా పెళ్ళాన్ని ఎంట బెట్టుకొని వచ్చేవాడు. మా పెదమ్మ నుదిటి నిండా బొట్టుతో, చేతులు నిండా గాజులతో ఉండేది. ఆ గాజుల సప్పుడినే మా పెదమ్మ వత్తందని పిల్లలం గుర్తుపట్టేవాళ్ళం. మా పెదనాన్న, పెదమ్మ యట్టా దానికీ దీనికీ వచ్చి పోతున్నరు కాబట్టి, మన్నోళ్ళని కూడా అన్నిటికి పిలవటం మొదలుపెట్టారు.
దర్శిలో ఉండే మా పిచ్చయ్య బాబాయి కొడుకు కాసియ్యన్నకి పెళ్లి కుదిరింది. ఆ పెళ్ళికి మా పెదయ్యతోపాటు, మా అన్నోళ్ళని కూడా పల్సింరు. ఎన్ని పట్టింపులు ఉన్నా అయినోళ్లని ఏరుబందరం చేసుకుంటరా! సాయిబులమ్మాయిని చేసుకున్న కాంచి చుట్టాల నుంచి ఏ పిలుపులూ లేక మోహం వాచిపోయిన మా చిన్నన్న పెళ్ళికి పెళ్ళం పిల్లలతో వచ్చిండు. మా వదిన పెళ్ళిలో ఆళ్ళనీ ఈళ్లనీ పలకరిత్తా అందరిలో కలిసిపోయింది.
మేం తిరుమల దారులం. పెళ్ళిలో అబ్బాయి ఎంకటేసుల సావికి ఎదురు నడిసే ఆసారం ఉంది. మా కాసియ్య అన్నని పెళ్లి కొడుకుని చేసి, దేవుడికి ఎదురు నడుత్తున్నప్పుడే చిన్నగా అంటుకోవాల్సింది బందువుల్లో అంటుకుంది. మా వదిన అందరి ఆడోళ్లతోపాటే బిందెలతో నీళ్లు వారబోత్తా ఉంది. అప్పుడే ఎవరో ఈ ఎదురుమతం అమ్మాయి ఎంకటేసుల సావికి ఎదురు నడుత్తుంటే నీళ్ళు బొయ్యటం ఏంది? మనోళ్లు ఎవరు లేరా అన్నరు. ఆ మాటని ఇంకెవురో మోసకపోయి మా మేనత్త మొగుడికి చెప్పింరు. అంతే మాడిజాం బోజనాలకి తింటానికి రమ్మంటే ఆయన రానని మొండికెత్తిండు. ఏవైంది అంటే నోరు మెదపడు. ఆకరికి పెళ్ళిబంతిలో మా వదిన నవ్వుతూ బువ్వ కలుపుకుంటూ ఉన్నప్పుడు పైకి లేసిండు మడిసి. మనమేమన్న గతిలేనోళ్లవా? ఎవురో వచ్చి చేసేదేంది. పెళ్ళికి పిలిత్తే వచ్చి ఓ ముద్ద తిని, సదివింపులు రాపిచ్చుకొని పోవాలిగాని, రాసుకుపూసుకు పొమ్మని పిల్సినవా అని రంది మొదలుబెట్టిండు. మా వదిన నోటికాడ ముద్ద అక్కడే పడేసి ఇంట్లోకి పొయ్యి ఏడ్చింది. మా సినన్న నోరెత్తలేకపోయిండు. పెళ్ళాం ఏడుత్తుంటే మూగమొద్దులా ఉండిపోయిండు. పెళ్ళం కాడికి పొయ్యి, పోదాం పా అండు. పెళ్లి ముగసకుండానే వాళ్లు వెళ్ళిపోతాననే సరికి అప్పుడు లేసిండు మా కాసెన్న. అట్టిట్ట లెగవలా. ఈ పెళ్ళికి మన్నని, వదెన్ని పిలిసింది నేను. మీరెవురు అంటానికి. అసలు వాళ్ళు పోతే పెళ్ళే చేసుకోను, నా సుల్లిబాయ అని అరిసేసరికి. అంతా సద్దుమణిగింది గానీ, మా మావ అంతటితో ఊరుకుంటాడా? కులం తప్పిన్నా కొడుకుల పెళ్ళికి నేనెందుకు వత్తా. నాకళ్ళముందు మీసాలు మొలిసినోడు నన్ననేంత మొగోడైండా. ఈన్నించి వాళ్ళ గడప నేను తొక్కను, నా గడప వాళ్ళు తొక్కటానికి లేదని ఇంట్లో నుంచి బయిటికి రాలేదు. మత్తని నువ్వుగాని పెళ్ళికి పోయినవా లంజా కోసి కారం బెడతా అని ఆవ మీద పెతాపం జూపిచ్చి పొయ్యి పడుకుండు. ఆవ మేనల్లుడి పెళ్లి చూళ్ళేకపోతున్ననే అని రాత్తిరంతా కళ్ళు ఒత్తుకుంటానే ఉంది. మా పిచ్చయ్య బాబాయి వచ్చి మా మావ కాళ్ళు పట్టుకొని బతివిలాడతానన్నా ఆయన కరగలేదు. మా కాసెన్న నువ్వు రాకపోతే నాకేవన్న ఊడిందా అని ఊరుకుండు. మత్తని బతిమిలాడిండు కానీ, ఆవ ఏడుత్తూ ఉండిపోయిందే తప్పా, వత్తాననలేదు. రాననలేదు. కన్నీళ్లతోనే ఆవ నోరు కడుక్కుంది ఆ పూటంతా.
మా పెదనాన్న ఏం అనుకుండో ఏవో, పెళ్ళయ్యాక పొద్దు పొద్దున్నే ఎవురికి చెప్పకుండనే పెళ్ళాన్ని, కొడుకు, కోడళ్లను తీసుకొని గుంటూరు పోయిండు.
కులం తప్పిన్నా కొడుకులని మా మావన్న మాట ఆయన కడుపులో నాటుకుంది. కాసెన్న పెళ్ళికి ఇంట్లో అందర్ని పిలిత్తే, సిన్న కొడుకు చేసిన పనికి ఇన్నాళ్లు అయినోళ్లకి దూరవైనా, అన్నీ సర్దుకొని దగ్గర కావొచ్చు అని సంబరపడ్డడు మా పెదనాన్న. అట్టాటిది ఆ పెళ్ళితో ఆయన ఆసెలన్నీ సంపుకున్నాడు. అదే చివరిసారి ఆయన చుట్టాల గడప తొక్కడం. ఇంక ఏ పెళ్ళిళ్ళకీ, పండగగలకీ, పబ్బాలకీ ఎవరి గడపలో కాలు పెట్టి ఎరగడు. ఎవురు పిలిసినా రాలేదు. కొడుకులు రాకపోయినా నువ్వన్నా రా అంటే, ఈ వయసులో ఇంకేం వత్తాలే అని ఊరుకునేవాడు.
కొన్నాళ్ళకి ఆయనకి పచ్చవాతం వచ్చి మంచాన పడ్డడు. ఒకసారి తమ్ముళ్ళు పలకరియ్యటానికి పోతే కళ్ళనీళ్ళు కుక్కొని, నా వాళ్ళు నా వాళ్ళు అని ఇంతకాలం తిరిగా. మనకి బలగం లేదు. అంతా ఒకసోటనే ఉంటే అండ ఉంటది అనుకున్నా. అది జరగలేదు. దగ్గర ల్యాపోయినా ఏదో మీ మొహాలన్నా చూసిపోదావని మీరు పిలవగానే ఉరుక్కుంట వొచ్చేవాణ్ణి. అదీ లేకపోయింది. బగొంతుడికి ఏం పుట్టిందో నా సిన్న కొడుకు మనోళ్ల అమ్మాయిని కాదని ఏరేవాళ్ళమ్మాయిని పెళ్లిచేసుకునేలా జేసిండు.
అప్పుటికి మనోళ్లకాడ ఏం పట్టింపుల్లే అనుకున్నా. కానీ పెళ్ళిలో కులంతుక్కువోళ్ళని ఇన్నప్పుడు తెల్సొచ్చింది... నన్నంటే ఒకటీ, నా కొడుకునంటే ఒకటా... అంటే అన్నళ్లే చెల్లెలి మొగుడేగా అనుకున్నా, మీరుండి ఒక్కమాట మాట్లాల్లేదు. ఇన్నాళ్లు మీరదే అనుకోబట్టేగా నోరు మెదపలేదు. ఎడం అయ్యాక నా వాళ్ళు నా వాళ్ళని ఎంతనుకున్నా ఎడం ఎడమే. ఒక తల్లి పిల్లలం అయితే ఇట్టయ్యేదా అన్నడు. తమ్ముళ్ళు ఏం మాట్లాడకుండా వచ్చింరు. మా పెదనాన్న మంచాన పడ్డకాంచి కూతురు మొగుణ్ణి తీసుకొని గుంటూరు చేరింది. ఆ ఇంటికి ఇంక మేం బోయింది లేదు. వాళ్లొచ్చింది అంతలేదు.
మక్కా, బావే దేనికన్నా ఎప్పుడో వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళ మాటల ద్వారానే మా పెదనాన్న యట్టుంది తెలిసేది. మంచాన పడ్డాక ఏడాది పాటు ఊపిరి బిగపట్టుకొని అట్నే కాలం జేసిండు. అయినోళ్లందరు ఒకసోటే కలిసుండాలనే ఆయన కోరికా అట్నే ముగిసిపోయింది.
• గూండ్ల వెంకటనారాయణ #😎ఆటిట్యూడ్ కోట్స్ #🙆 Feel Good Status #💪పాజిటీవ్ స్టోరీస్


