**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 11**
నిన్నటి చౌపాయిలో హనుమంతుని శ్రవణ భక్తిని, ఆయన హృదయ పీఠంపై కొలువై ఉన్న సీతారామ లక్ష్మణుల గురించి తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుడు రామ కార్యం కోసం తన రూపాన్ని ఎలా మార్చుకోగలడో, సీతమ్మను కలిసినప్పుడు ఆయన చూపిన నేర్పు ఎటువంటిదో తెలుసుకుందాం.
**తొమ్మిదవ చౌపాయి**
**సూక్ష్మ రూప ధరి సియహి దిఖావా |**
**బికట రూప ధరి లంక జరావా ||**
**ప్రతిపదార్థం:**
* **సూక్ష్మ రూప ధరి:** చాలా చిన్నదైన (అణుమాత్రపు) రూపాన్ని ధరించి
* **సియహి దిఖావా:** సీతమ్మకు కనిపించావు (దర్శనమిచ్చావు)
* **బికట రూప ధరి:** భయంకరమైన, అతి పెద్దదైన రూపాన్ని ధరించి(వికృత రూపంతో)
* **లంక జరావా:** లంకా పట్టణాన్ని దహించివేశావు.
-----
**విస్తృత ఆధ్యాత్మిక వివరణ:**
**1. సూక్ష్మ రూపం (వినయం మరియు వివేకం):**
సీతమ్మను ముందుగా చూసాడు ఆ తదుపరి లంకా దహనం అయింది అదే వరసలో చెప్తున్నారు తులసి దాసు గారు కూడా.
సూక్ష్మ రూపం అంటే చిన్న రూపం అని ఒక అర్దం, ఇంద్రియాలకు కానరాని రూపం అని మరొక అర్దం రెండు శాస్త్రీయమైన అర్థాలు గ్రహించాలి.
మహేంద్రపర్వతం దగ్గర ఆకాశపర్యంత సంవర్థియై, మేరుపర్వతం రూపం ధరించిందా అన్నట్లున్నాడు. ఆ స్వామి 'అద్భుతదర్శనుడు' - 'చూస్తే చాలు అద్భుతం అనిపిస్తున్నాడు' అని వర్ణించారు వాల్మీకి.
ఆ సమయంలో అక్కడున్న వానరులతో జాంబవంతుడు అంటాడు - నేను యౌవనంలో ఉన్నప్పుడు త్రివిక్రముని చుట్టూ ప్రదక్షిణ చేశానని చెప్పినప్పుడు మీరు త్రివిక్రమస్వరూపాన్ని వర్ణించమని అడిగేవారు. ఇదిగో ఇలా ఉంటుందని విరాడ్రూపియై ఎదిగి ఉన్న హనుమని చూపించాడు. అంటే త్రివిక్రమావతార సమయంలో కూడా జాంబవంతుడు ఉన్నాడు.
స్వామి పెరిగినా అద్భుతం, తగ్గినా అద్భుతం. లంకా నగరం లోకి వెళ్ళే ముందు ఇంత పెద్దవాడు పిల్లి పిల్ల అంత ప్రమాణంలో మారిపోయాడు.ఈ రూపంలోనే మొత్తం లంకా నగరం వెతికాడు, తన అనుమతి లేకుండా గాలి కూడా దూరని విధంగా ఏర్పాటు చేశాడు రావణుడు అయిన హనుమ అణువు కూడా విడవకుండా వెతికాడు అంటే ఇంద్రియాలకు అందని పరమాత్మ వలె రూపం ధరించాడు అని అర్దం.
సీతమ్మతో మాట్లాడే రావణుడు,అమ్మ చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలు స్వామి ఉన్నాడు అని తెలుసుకోలేక పోయారు, రామ కథ కూడ సీతమ్మకు మాత్రమే అర్దం అయ్యేలా చెప్పాడు అన్నారు. రామ ముద్రిక ఇచ్చి అమ్మకు పూర్తిగా నమ్మకం వచ్చే వరకు అలానే ఉన్నారు.
కల్పవృక్షం లో విశ్వనాథుల వారు అంటారు గాలి లో నుండి పుట్టుకు వచ్చాడా అన్నట్టు ఉన్నాడు అని అంత సూక్ష్మ రూపం.
ఆ తరువాత కూడా అమ్మవారు రాముడు రావడం అసాధ్యం అని నిరాశ తో అంటే.నిన్ను నా బుజాల మీద తీసుకు వెళ్తా అంటాడు. తల్లి నవ్వుతుంది, ఇంత చిన్న వాడివి నన్ను తీసుకు వెళ్తావ అన్నట్టు అప్పుడు మళ్ళీ అమ్మవారికి తన విశ్వరూపం చూపాడు అది కూడా అమ్మవారికి ఒక్కదానికే కనపడింది.ఇది పంచముఖ ఆంజనేయ రూపం అని పరాశర సంహిత చెప్పింది. ఇలా చిన్నగా,ఎవరికి కనపడనీ విధంగా స్వామి సీతమ్మ ను చూసాడు.
హనుమంతుడు అష్టసిద్ధులు కలవాడు. అందులో 'అణిమ' అంటే శరీరాన్ని అత్యంత చిన్నదిగా మార్చుకోవడం. ఇది సాధకుడికి ఉండవలసిన **వినయానికి** సంకేతం. భగవంతుని ముందు పెద్దల ముందు మనం మన అహాన్ని తగ్గించుకుని 'సూక్ష్మ రూపం'లో (వినయంతో) ఉండాలి అని కూడా చెప్పవచ్చు.
**2. బికట రూపం (ధర్మ రక్షణ):**
అదే హనుమంతుడు లంకను దహించేటప్పుడు 'బికట' (భీకర) రూపాన్ని ధరించాడు.దేనినైతే మనం భరించలేమో దానిని వికటము, వికృతము అంటారు. చూడడానికి తట్టుకోలేనంత శక్తిమంతమైన రూపం వికటరూపం లంకాదహనం చేసేటప్పుడు అలాంటి రూపాన్ని స్వామి ధరించారు.
హనుమంతుని అద్భుతమైన లీలలలో లంకాదహన లీల ఒకటి.
లంకాదహన లీలను మననం చేస్తే తాపములు తొలగుతాయి. ఒకొక్క లీలలో ఒకొక్క మంత్ర విశేషం ఉంటుంది.
వాల్మీకి లంకాదహన ఘట్టాన్ని ఒక విధమైన భావసమాధిలో రచించారు. మొత్తం రామాయణమంతా దివ్యసమాధిలో రచించినా, కొన్ని ఘట్టాలు(సూక్ష్మమైన మంత్రవిశేషాలు) చెప్పేటప్పుడు వాల్మీకి భాష వేరేగా మారిపోతుంది. అలా మారి హనుమత్ స్వరూపాన్ని బాగా అందించిన ఘట్టం లంకాదహన ఘట్టం.
నరసింహస్వామి స్తంభం నుంచి బయటకి వచ్చినప్పుడు ఆయన విజృంభణ ఏ విధంగా దివ్యమైన ఉగ్రరూపంతో మనకు గోచరిస్తుందో... అలా హనుమంతుని విజృంభణలన్నింటిలో మహా విజృంభణ లంకాదహనం, అక్కడ స్వామి తన ప్రతాపాన్ని చూపాడు.ఆ కథ మొత్తం ఒక్క వాక్యం లో పెట్టాడు తులసి దాసు గారు.
హనుమంతుడిని దూతగా పంపడంలో ఉద్దేశం కేవలం సీతమ్మను ఓదార్చడమే కాదు రావణుని లంకను, అతని సైన్య వ్యవస్థను పరిశోధించడం చేయగలడు. ఆవులిస్తే ప్రేగులు లెక్కపెట్టగలిగే శక్తి ఉన్నవాడు సింహిక నోరు తెరిస్తే మర్మస్థానాన్ని చూసి దానిని సంహరించాడు అంతటినీ బాగా పరిశీలించి, అధ్యయనం చేయడం దూత కార్యం.
అసలు కార్యంతో పాటు, బహుకార్యాలు సాధించి రాజుకు ప్రయోజనం కలిగించేవాడు దూత గనుక నేను చేయవలసిన పనులు చాలా ఉన్నాయని, ముందు రావణుని చూడాలనుకున్నాడు స్వామి వచ్చాడు, వెళ్ళాడు అని కాకుండా వచ్చిన ముద్ర మిగల్చాలి ఒక దాసుడు వచ్చే ఇంత హడావుడి చేశాడంటే, ఇక మొత్తం కదిలొస్తే ఏమైపోతామా...? అనే భయం వారికి కలగాలి.అదే చేశాడు స్వామి.
లంకా దహనం చేశాక హనుమను చూసి ఇతను వరుణుడ,ఇంద్రుడా, లేక ప్రళయ కాల రుద్రుడా అని ఆశ్చర్య పోతూ రెండు చేతులు ఎత్తి దేవతలు పై నుండి , కింద నుండి భయం తో రాక్షసులు భయం తో నమస్కారం చేశారు అట సర్వ దేవతా స్వరూపుడి లాగ కనిపించాడు స్వామి.
విష్ణువులో ఉన్న సమస్త శక్తి నరసింహరూపంలో వచ్చినట్లుగా హనుమంతునిలో సమస్త శక్తి లంకాదహనం తరువాత దర్శనమిచ్చింది. ఆ స్వరూపాన్ని ధ్యానించి నమస్కారం చేసుకుందాం.
దుష్ట శిక్షణ చేసేటప్పుడు అవసరమైన **శక్తిని, ధైర్యాన్ని** ప్రదర్శించాడు. అధర్మాన్ని ఎదిరించేటప్పుడు సాధకుడు బలహీనంగా ఉండకూడదు, వజ్ర సంకల్పంతో ఉండాలని ఇది సూచిస్తుంది.
-----
**తులసీదాసు గారి సందేశం:**
తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా హనుమంతుని **సమయస్ఫూర్తిని** కొనియాడారు. ఎక్కడ వినయంగా ఉండాలో, ఎక్కడ పరాక్రమాన్ని చూపాలో హనుమంతుడికి బాగా తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా మన వ్యక్తిత్వాన్ని మలుచుకోవడమే అసలైన విజయం. సీతమ్మకు భరోసా ఇవ్వడానికి చిన్నగా మారాడు, రావణుడి గర్వాన్ని అణచడానికి పెద్దగా మారాడు.
వచ్చే చౌపాయి కూడా దీనికి కొనసాగింపు గా ఉంటుంది, ఈరెండు నిత్య పారాయణ చేత సుందరకాండ పారాయణం చేసిన ఫలితం వస్తుంది.
-----
**జై శ్రీరామ్\! జై హనుమాన్\!** #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊


