పెరిగిన ధర నేటి నుంచే అమల్లోకి
తాజా పెంపుతో ఢిల్లీలో రూ. 942కు చేరిన ధర
అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడమే కారణం
మార్చిలో సిలిండర్పై రూ. 60 పెంపు
దేశంలోని మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై మరోసారి ధరల భారం పడింది. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ (LPG) వంటగ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (IOC, HPCL, BPCL) రూ. 29 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన ధరలు ఆదివారం (జూన్ 7) నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా వివిధ నగరాల్లో ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కి పెరిగింది. గత మూడు నెలల వ్యవధిలో వంటగ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ముడి చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశానికి గ్యాస్ సరఫరా అయ్యే కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మార్గంలో ఏర్పడిన అంతరాయాలు దేశీయ ధరలపై ప్రభావం చూపాయి. ఈ సవరణకు ముందు వరకు చమురు సంస్థలు దేశీయ ఎల్పీజీ విక్రయాలపై సిలిండర్కు సుమారు రూ. 703 వరకు నష్టాన్ని భరిస్తూ వచ్చాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ తాజా పెంపు తర్వాత కూడా అంతర్జాతీయ కొనుగోలు ధరకు, దేశీయ విక్రయ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా భర్తీ కాలేదని తెలుస్తోంది. గత మార్చి నెలలో కూడా సిలిండర్ ధరను రూ. 60 పెంచిన సంగతి తెలిసిందే.
#😱సామాన్యులకు బిగ్ షాక్..మరోసారి పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర!


