శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 7
నిన్న బంగారు రంగులో కుండలాలు ధరించి రింగులు తిరిగిన జుట్టుతో ఉన్న హనుమంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్నాం.ఈరోజు చేతిలో ఆయుధాలు మరియు యజ్ఞోపవీతం ధరించి విరాజిల్లుతూ ఉండే మరో అద్భుత మూర్తిని దర్శించి తరిద్దాం.
ఐదవ చౌపాయి
హాథ బజ్ర ఔ ధ్వజా బిరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||
ప్రతిపదార్థం:
* హాథ: చేతిలో
* బజ్ర: వజ్రాయుధం
* ఔ: మరియు
* ధ్వజా: జెండా (ధ్వజము)
* బిరాజై: శోభిస్తున్నాయి
* కాంధే: భుజముపై
* మూంజ జనేవూ: ముంజ గడ్డితో చేసిన యజ్ఞోపవీతం (జంద్యం)
* సాజై: అలంకరించబడి ఉన్నది
-----
విస్తృత ఆధ్యాత్మిక వివరణ:
1. హాథ బజ్ర :
హాథ బజ్ర అంటే రెండు విధాలుగా చెప్పవచ్చు, చేతిలో వజ్ర రేఖ, ధ్వజ రేఖ ఉన్న స్వామి అని ఒక అర్దం, వజ్రాయుధం చేతిలో ఉంది అని మరో అర్దం.
వజ్ర రేఖ ఇత్యాది చిహ్నాలు అవతార పురుషులకు పుట్టుక తోనే వస్తాయి. మహనీయులు అంటే మహిమలు చూపే వారు కాదు, ఇలాంటి దివ్య చిహ్నములు కలిగి ఉండే వారు. హనుమ సాక్షాత్ రుద్రావతారం కనుక చేతిలో వజ్రాయుధ గుర్తు ఉంటుంది.
అసలు స్వామి శరీరమే వజ్ర తుల్యం,ఆయన జన్మతోనే పరాక్రమం కలవాడు, అందుకే ఐదవ రోజు సూర్యుని పండు అని తలచి మ్రింగ పోయాడు. సూర్యుని పండుగ భావించడం పసి తనం అయినా, అక్కడి దాకా ఎగరడం ఎంత పరాక్రమం, స్వామి జన్మతః మహావీర విక్రమ బజరంగీ అని తెలుస్తుంది.
అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం తో కొడితే స్వామి స్పృహ తప్పి పడిపోతే, వాయు దేవుడు తండ్రి కదా నా బిడ్డకు హాని చేస్తారా అని లోకంలో వాయు సంచారం ఆపుతాడు,బ్రహ్మ గారే వచ్చి హనుమను వడి లోకి తీసుకోనీ నిమరగానే మల్లి స్వామి సాధారణ స్థితిలోకి వస్తాడు.
అప్పుడు ఈ బాలుడు సాధారణ బాలుడు కాదు అవతార పురుషుడు మీ మీ శక్తులు ఇతనికి ఇవ్వండి అని దేవతలను కోరితే అప్పుడే స్వామికి బ్రహ్మాస్త్రం సహా ఏ అస్త్రం కూడా కట్టని విధంగా వరాలు వచ్చాయి.ఆ కథలో వజ్రాయుధ సమర్పణ జరిగింది. అలా స్వామి హాథ బజ్ర చేతిలో వజ్రాయుధం కలవాడు అయ్యాడు.
అసలు స్వామి చేతులే వజ్రాయుధం, రామాయణం లో స్వామి గద ధరించాడు అని ఎక్కడ చెప్పలేదు, పిడికిలి తోను,రాళ్ళు, చెట్ల తోను, తోక తో కొట్టి రాక్షస సంహారం చేశాడు. సుందర కాండ లో రాక్షసులు చేతిలో వజ్రాయుధం ధరించిన వానరుడు అశోక వనం ధ్వంసం చేస్తున్నాడు అంటారు.అంటే ఈ మంత్ర మూర్తి అక్కడ ఉన్నాడు.
స్వామి చేతులు అభయం, శిక్ష రెండు ఇస్తాయి రాక్షసులను ఎడమ చేతితో కొడతాడు, శరణు అన్నవారిని కుడి చేతితో రక్షిస్తాడు.
అక్షాసుర సంహారం చేసినవాడు రాక్షసపురాన్ని దహింపజేసిన వజ్రధారియైన హనుమంతునికి నమస్కారమని స్కాంద పురాణం లో చెప్పారు.
మొత్తానికి అనేక హనుమ రూపాలలో వజ్రాయుధం పట్టుకున్న హనుమ రూపం ఒకటి అని తెలుస్తుంది.
2. ధ్వజా బిరాజై (విజయ ధ్వజం):
హనుమంతుడు చేతిలో ధ్వజాన్ని (జెండా) ధరించి ఉంటాడు. జెండా విజయానికి గుర్తు. అర్జునుని రథంపై 'కపిధ్వజుడు'గా ఉండి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మానికి విజయాన్ని చేకూర్చాడు.
ఒక్క వాక్యం లో రామాయణ, మహాభారతాలు రెండు ధ్యానం చేయించడం తులసి దాసు గారి గొప్పతనం.
చేతిలో ధ్వజ చిహ్నము కలవాడు ఒక అర్దం.
పట్టాభిషేక సమయంలో రాముడు విశాలమైన రథంలో ఒక ఆసనంపై కూర్చుని అయోధ్యానగర రాజవీథులలో సంచరిస్తూ ఉంటాడు. ఆయన రాజరాజు కనుక అందరూ పరిచర్యలు చేస్తూ చుట్టూ ఉన్నారు. రథంలో రామునికి ఇరువైపులా లక్ష్మణుడు, విభీషణుడు చామరాలు వీస్తూ ఉన్నారు. శత్రుఘ్నుడు ముత్యాల జాలరిలు వ్రేలాడుతున్న చక్కని చత్రము (గొడుగు) ను రామునికి పట్టాడు. భరతుడు స్వయంగా గుర్రాల పగ్గాలు పట్టుకుని రథాన్ని నడుపుతున్నాడు. ఆంజనేయస్వామివారు ధ్వజము పట్టుకుని ఉన్నారు. అది విజయధ్వజము.అని అవధి భాషలోని ఒక రామాయణం లో ఉన్నది దాన్ని,ఆ రూపాన్ని ఇక్కడ ధ్యానం చేయించాడు తులసి దాసు గారు.
ఇలా ఒక చేతిలో దుష్ట శిక్షణ చేసే వజ్రాయుధం, మరో చేతిలో శిష్ట రక్షణ చేసే శ్రీరాముని విజయ ధ్వజం, పట్టుకుని బంగారు రంగులో ఎర్రని ముఖము తో వెలిగి పోయే స్వామిని దర్శనం చేశాం.ఇది రాజయోగ ప్రద ధ్యానం అని ప్రతీతి.
సత్యం మరియు ధర్మం ఉన్నచోట హనుమంతుని విజయ కేతనం ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుందని దీని అర్థం.
3. కాంధే మూంజ జనేవూ (యజ్ఞోపవీతం):
హనుమంతుడు కేవలం బలవంతుడే కాదు, గొప్ప బ్రహ్మచారి మరియు సంస్కారవంతుడు. ఆయన భుజంపై ఉన్న 'మూంజ' గడ్డితో చేసిన జంద్యం ఆయనలోని క్రమశిక్షణకు, బ్రహ్మతేజస్సుకు నిదర్శనం. ఆయన నిత్యం గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ, సకల శాస్త్రాలను ఔపోసన పట్టిన జ్ఞాని అని ఇది సూచిస్తుంది.
హనుమంతుడు పుట్టుకతోనే యజ్ఞోపవీతం ధరించి ఉన్నాడని మంత్రశాస్త్రంలో చెప్పారు.రుద్రునికి కూడా ఉపవీతం ధరించిన రుద్రుడని ఒక మంత్రం ఉంది. ఉపవీతం ధరించిన రుద్రుడే హనుమంతుడని చెప్పవచ్చు.అదే సత్యం కూడా.
హనుమంతుడు మంత్ర మూర్తి కనుక యజ్ఞోపవీతం తో ఉన్నాడు.
అకార,ఉకార,మకారమనే మూడు స్వరాలను తెలియ చేస్తూ, మూడు ముడులను కలిగి ఉండేదే యజ్ఞోపవీతం దాన్ని ధరించిన వాడే హనుమ.
భగవంతుని యజ్ఞోపవీతం అకార, ఉకార, మకారాలు ఋక్, యజు. సామములను తెలియజేస్తుంది. వేదపురుషుడు హనుమంతుడు.హనుమాన్ అంటే వాక్కుస్వరూపుడు. యజ్ఞోపవీత వర్ణన అంతా ఒక్క వాక్యములో పెట్టాడు. ముంజ గడ్డి దేవతామయం అయింది,దాని గురించి వేదంలో కూడా ఒక మంత్రం ఉంది.ఇది తులసి దాసు గారు చూసిన రూపం.
-----
తులసీదాసు గారి సందేశం:
వజ్రాయుధం మరియు సంస్కారం (జంద్యం) ఒకే చోట ఉండటమే హనుమంతుని విశిష్టత. కేవలం బలం ఉండి సంస్కారం లేకపోతే అది వినాశనానికి దారి తీస్తుంది. కానీ హనుమంతుడు ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ మనకు ఆదర్శంగా నిలిచారు. మనకు కూడా అపారమైన శక్తితో పాటు వినయం, క్రమశిక్షణ ఉండాలని తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా బోధిస్తున్నారు.
-----
ఎన్ని రహస్యాలు అండి అన్ని చెప్పుకోవడం సాధ్యమా స్వామి రాయించిన మేర చదువుకోవడం అంతే. రేపు మరొక శ్లోకం తో కలుసుకుందాం..
జై శ్రీరామ్\! జై హనుమాన్\! #✌️నేటి నా స్టేటస్ #🙏Thank you😊


