**శ్రీ హనుమాన్ చాలీసా జ్ఞాన యజ్ఞం - రోజు 10**
నిన్న మనం హనుమంతుని విద్యా చాతుర్యాన్ని, రామకార్యం పట్ల ఆయనకు ఉన్న ఆతురతను తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుడు శ్రీరాముని కథను వినడానికి ఎంతటి మక్కువ చూపుతారో మరియు ఆయన హృదయంలో సీతారామ లక్ష్మణులు ఎలా కొలువై ఉంటారో ఈ ఎనిమిదవ చౌపాయి ద్వారా తెలుసుకుందాం.
**ఎనిమిదవ చౌపాయి**
**ప్రభు చరిత్ర సునిబే కో రసియా |**
**రామ లఖన సీతా మన బసియా ||**
**ప్రతిపదార్థం:**
* **ప్రభు చరిత్ర:** తన ప్రభువైన శ్రీరామచంద్రుని కథలను/చరిత్రను
* **సునిబే కో:** వినడానికి
* **రసియా:** మిక్కిలి ఆసక్తి కలిగినవాడు (ఆనందాన్ని పొందేవాడు)
* **రామ లఖన సీతా:** శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సీతమ్మ
* **మన బసియా:** (ఆయన) మనస్సులో ఎల్లప్పుడూ నివసిస్తారు.
-----
**విస్తృత ఆధ్యాత్మిక వివరణ:**
**1. ప్రభు చరిత్ర సునిబే కో రసియా (రామకథా ప్రేమికుడు):**
ఆసక్తి దేనియందు ఉంటుందో అది రసికత. ప్రభు చరిత్ర వినడం లో రసికుడు స్వామి.రామకథను వినడంలో ఆయనకు ఎప్పుడూ తృప్తి కలగదు. "ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ హనుమంతుడు అంజలి ఘటించి రెండు చేతులు శిరసు మీద పెట్టుకొని పరమ ఆర్ద్రత తో కన్నీరు కారుస్తూ వింటాడు"
రామచంద్రమూర్తి అయోధ్య వాసులందరికి ముక్తినిస్తూ సరయూనదిలోకి వెళుతూ హనుమంతుని మాత్రం నువ్వు చిరంజీవి కనుక ఇక్కడే ఉండాలన్నాడు. నీ కథ ఉన్నంతకాలం ఉంటానన్నాడు హనుమ. ఆయనకు రామకథ అంటే అంత ఆసక్తి సర్వవ్యాపకమైన పరమేశ్వరస్వరూపం కనుక ఇప్పటికీ ఎక్కడ రామకథ జరిగితే అక్కడ ఉంటాడు ఆంజనేయస్వామి
శ్రవణం ఒక యోగం, భగవత్ కథలు ఏడు రోజుల విన్నంత మాత్రాన ముక్తి పొందాడు పరీక్షిత్తు. రసికత ఉంటే వెంటనే ఆ యోగం వస్తుంది.
ప్రుధు చక్రవర్తి అనేక యాగాలు చేసి సాక్షాత్ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షం చేసుకుని కోరిన వరం ఏమిటో తెలుసా ఎల్లప్పుడూ నీ కథలు వినడానికి పది వేల చెవులు ఇవ్వమని. అంటే ఎల్లప్పుడూ నీ కథలు వినే భాగ్యం కావాలి అని కోరడం.
సంస్కారం ఉన్నవారికి భగవత్కథలు వింటూ ఉంటే విసుగు రాదు, ఇంకా వినాలనిపిస్తుంటుంది. వారు ఎన్నిమార్లు వింటామని కాకుండా ఎన్నిమారైనా వింటారు. హనుమంతుడు ఎన్నో మార్లు విన్నాడు... ఇప్పటికీ వింటూనే ఉంటున్నాడు. రామకథలో రసజ్ఞత ఉన్నది.
మనం చదివితే కొంతే మనసులోకి వెళ్తుంది,అదే వింటే అనేక విషయాలు వస్తాయి,మనం చదువుకునేది హనుమాన్ చాలీసా కానీ ఇందులో రామాయణం వస్తుంది, పరాశర సంహిత వస్తుంది, అక్కడక్కడ భారతం వస్తుంది, భాగవతం వస్తుంది అందుకే శ్రవణం ఒక యోగం.
రెండు చేతులూ శిరస్సు మీద పెట్టుకుని, కనుల ఆనందబాష్పాలు రాల్చుతూ తన్మయుడై వింటాడు అలా విన్నవాడు ఎవడైనా కనిపిసే వాడే హనుమంతుడు మహాత్ములు ఎప్పుడు ప్రచ్ఛన్నంగా వస్తారు. అలాంటి వారిని పోల్చడం కూడా మహాకష్టం
రామకథ జరిగేచోట హనుమంతుడు ఉంటాడు. తులసీదాసుకు ఇది అనుభవము. అందుకే రామకథ జరిగేటప్పుడు ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. హనుమంతుడు ఉన్న చోటులో మనం కూర్చుంటాం. ఆ మహాత్ముని శక్తి తరంగాలు వ్యాపించిన ప్రాంగణంలో కూర్చుంటే సమస్త పాపాలూ నశించిపోతాయి. రామకథారసజ్ఞుడు హనుమంతుడు. అది 'ప్రభుచరిత్రసునివేకోరసియా'
ఇది భక్తుడికి ఉండవలసిన 'శ్రవణ భక్తి'కి నిదర్శనం. జ్ఞానం ఎంత పెరిగినా భగవంతుని లీలలను వినడం వల్ల కలిగే ఆనందం అంతటిది.
**2. రామ లఖన సీతా మన బసియా (హృదయ పీఠం):**
హనుమంతుని హృదయం ఒక దివ్యమైన కోవెల. అక్కడ సీతారామ లక్ష్మణులు నిరంతరం కొలువై ఉంటారు అని ఒక భావం. ఇది సత్యమే కానీ తులసి దాసు గారు హృదయం ఇది కాదు అని పెద్దలు చెపుతారు.సీతా, రామ లక్ష్మణుల హృదయాల్లో ఉన్న హనుమను ఇక్కడ తులసి దాసు గారు దర్శించారు.
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్
రామచంద్రమూర్తికి దక్షిణం వైపు లక్ష్మణుడు, ఎడమవైపు సీతమ్మ ఉన్నారు. ముందు హనుమ ఉండి ఆ ముగ్గురినీ హృదయంలో నిలుపుకుని ధ్యానిస్తున్నాడు. కానీ ఆ ముగ్గురి హృదయంలో హనుమంతుడు ఉన్నాడని ఇక్కడ చెప్పారు. అంటే హనుమంతుడు ఎంత రామభక్తుడో సీతారాములు అంత హనుమద్భక్తులు అనే విషయాన్ని ప్రమాణంతో చెప్పుకున్నాం.
రామచంద్ర మూర్తి ఇసుమంత ఉపకారం చేస్తేనే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు.వేలకొలది అపకారాలు చేసినా మర్చిపోతాడు. అది రామచంద్రమూర్తి గొప్ప వ్యక్తిత్వం. అంత వ్యక్తిత్వం కలవాడు మహోపకారం చేసిన హనుమను మర్చిపోతాడా...? ఎప్పుడూ హృదయంలోనే పెట్టుకున్నాడు.
ఇక సీతమ్మ హనుమ ను ఎప్పుడు మర్చిపోదు పట్టాభిషేక సమయంలో కూడా రాముడు ప్రేమతో ఇచ్చిన ముత్యాల హారం హనుమ కి ఇచ్చింది తల్లి. అంతటి కృతజ్ఞతా భావం.
సంజీవని తెచ్చి ప్రాణం కాపాడిన హనుమను, సంజీవ రాయుడుగా ఎల్లప్పుడూ హృదయం లోనే పెట్టుకున్నాడు.
అందుకే 'రామలషన సీతా మన బసియా' అనే ఒక్క మాటలో సీతారామలక్ష్మణులు హనుమంతుడి నుంచి పొందిన ఉపకారం, ఆ ఉపకారాన్ని నిరంతరం మనస్సులో పెట్టుకోవడాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు.
అటు తర్వాత మరొక అద్భుతమైన చౌపాయీలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడినుంచి రెండు చౌపాయీలు హనుమ యొక్క అద్భుతమైన రూపాలను చూపిస్తుంటాయి. వాటిని రేపు దర్శించబోతున్నాం. ఇవి అత్యంత ముఖ్యమైన చౌపాయీలు.
-----
**తులసీదాసు గారి సందేశం:**
తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా భక్తి మార్గంలో రెండు ముఖ్యమైన సూత్రాలను చెప్పారు:
1. **వినడం (Listening):** ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుని గుణగణాలను నిరంతరం వినడం అవసరం.
2. **ధ్యానం (Meditation):** మనస్సును భగవంతుని నివాసంగా మార్చుకోవాలి.
మనం కూడా హనుమంతుని వలె రామకథా రసికులమైతే, మన మనస్సులో కూడా ఆ పరమాత్మ స్థిరంగా కొలువై ఉంటాడని ఈ చౌపాయి అంతరార్థం.
-----
**జై శ్రీరామ్\! జై హనుమాన్\!** #🙏Thank you😊 #✌️నేటి నా స్టేటస్


