స్రీ శక్తి
సృష్టికి మూలశక్తిగా అలరారే స్త్రీకి ఎక్కడ గౌరవనీయ స్థానముంటుందో అక్కడ శుభం, సౌభాగ్యం వర్ధిల్లుతాయి. అలాంటి స్త్రీ గొప్పతనం గురించి ఎంత చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పినా తక్కువే అవుతుంది. ‘శక్తి రూపాలైన సీత గౌరీ వాగీశ్వరి వంటి వారి రూపంలో గాని ఉన్నావా రామా?’ అని ‘ఏతావునరా నిలకడ నీకు?’ అనే కీర్తనలో అడిగాడు త్యాగయ్య. పౌరాణిక గ్రంథాలు, కావ్యాలు సైతం మానవజాతి భవిష్యత్ అంతా స్త్రీ శక్తి మీద ఆధారపడి ఉంటుందని ముక్త కంఠంతో చెబుతున్నాయి.
సీతాన్వేషణలో భాగంగా లంకను చేరే ప్రయత్నంలో రాక్షసి అని తెలిసినా సురసను ఉద్దేశించి హనుమంతుడు ‘మాతా’ అని సంబోధించాడు. ‘రామకార్యం నెరవేర్చడానికి సహకరించమ’ని మర్యాదపూర్వకంగా ప్రార్థించాడు. సీత జారవిడిచిన ఆభరణాల ఉత్తరీయాన్ని పరిశీలించమంటే లక్ష్మణుడు... ‘నేను ఆమె ముఖం వైపు ఎప్పుడూ చూడలేదు. నిత్యం పాదాభివందనం చేసేవాణ్ని కనుక ఆమె పాదాలకు ధరించిన నూపురాలను మాత్రం గుర్తించగలన’ని చెప్పాడట. అదీ మన సంస్కృతి స్త్రీకి ఇచ్చిన గౌరవం. స్త్రీ... పురుషుడి వెనుక ఉంటే బలం. ముందుంటే కవచం. పక్కనే ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేసే అద్భుతం. అందుకే మహాశివుడు సైతం అర్ధనారీశ్వరుడు అయ్యాడు. భగవంతుడు ప్రతి ఇంట తాను ఉండే అవకాశం లేక తల్లిరూపంలో ఓర్పుగా నిలబడతాడని పెద్దల మాట. అందుకే ఉపనిషత్తులు ‘మాతృదేవోభవ’ అని చెప్పింది. మేనమామ ఇంటినుంచి అయోధ్యకు చేరిన భరత శత్రుఘ్నులకు తండ్రి మరణించడానికి, రాముడు వనవాసానికి వెళ్లడానికి కారణం కైకేయి అని, దానికి ప్రేరకురాలు మంధర అని తెలుస్తుంది. శత్రుఘ్నుడు పట్టలేని కోపంతో మంధర శిగను పట్టుకుని రాజ ప్రాంగణానికి ఈడ్చుకు వచ్చాడు. అప్పుడు భరతుడు రాముడిక స్త్రీలపై ఉన్న గౌరవాన్ని వివరించి, ఆమెను క్షమించి వదిలిపెట్టమని కోరాడు. ఇదీ మన సంస్కృతి విశిష్టత.
ఇంత గొప్పగా చెప్పుకొంటున్నా... నాణానికి రెండో వైపు అన్నట్టుగా స్త్రీలను హింసించి ఇబ్బందులకు గురి చేసేవారు, చెరబట్టి వినాశనాన్ని కొని తెచ్చుకునేవారూ కోకొల్లలు. ద్రౌపదిని తన అంకం మీద కూర్చోమని ఆజ్ఞాపించిన, ఆమెను నిండు సభకు తీసుకొచ్చిన దుర్యోధన దుశ్శాసనులు ఎటువంటి మరణాన్ని పొందారో, పరస్త్రీ వ్యామోహంతో రావణుడు ఏమయ్యాడో మనకు తెలుసు. మన చుట్టూ ఇటువంటి కీచకులూ ఉన్నారు. రామలక్ష్మణుల వంటి మర్యాదా పురుషోత్తములూ ఉన్నారు. సమాజానికి చీడవంటి నరకాసురులను దునుమాడటానికి సత్యభామ స్త్రీ శక్తిగా లోకానికి ప్రేరణ అయింది. మనుషుల్లోని ఇటువంటి రాక్షసులను వదిలించుకోవాలని, ‘స్త్రీల ఉద్ధరణ జరగకుండా భారతదేశం పురోగమించద’ని వివేకానందుడు అన్నాడు. దాన్ని నేటితరం అర్థం చేసుకోవాలి. మహిళలను చిన్నచూపు చూడటమంటే ‘అమ్మశక్తి’ని అవమానించడమేనని తెలుసుకోవాలి.
#😃మంచి మాటలు
దేహభ్రాంతి
ధర్మాచరణకు, దైవాన్వేషణకు శరీరమే సాధనం. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది. అంటే మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మంచి ఆలోచనలతో నిండాలన్నా శారీరక ఆరోగ్యం బాగుండాలి. మంచి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం ఆరోగ్యాన్ని క్రమబద్ధం చేస్తాయి. అయితే శరీరం పట్ల ఈ జాగ్రత్త దేహభ్రాంతిగా మారకూడదు. విజ్ఞులైనవారు మేనిని కేవలం ధర్మసాధనంగా మాత్రమే భావిస్తారు.
సమస్త సృష్టిలో మరే జీవికీ సాధ్యపడని ఆలోచన, వివేకం, వివేచన మానవుల సొంతం. నిరంతర సాధన, ధర్మవర్తన ద్వారా ఈ జన్మను సద్వినియోగం చేసుకుని మోక్షానికి అర్హమైనదిగా మలచుకోవాలి. వ్యాకులత, దుఃఖం, రోగాలు.. చివరికి మరణం ఇవన్నీ శరీరానికి సహజంగా సంభవించేవే. కాబట్టి వీటిపట్ల మితిమీరిన ఆందోళన అనవసరం. ఈ విషయం తెలిసినా కొందరు- నా శరీరం వేరు, దైవం వేరు అనే ద్వైతభావం కలిగి ఉంటారు. దీనికి కారణం దేహభ్రాంతి. ఇది ఉన్నంతవరకు ఏకాత్మ భావం అలవడదు. ఈ దేహం శాశ్వతం కాదన్న సత్యం నిరంతరం మనసులో మెదులుతుండాలి.
అహంకారానికి కారణం కూడా దేహాభిమానమే. నేను, నాది అనే భావన ‘నేనే’ అనే అహానికి దారితీస్తుంది. దీన్ని క్రమంగా తగ్గించుకోవాలి. ఈ దేహం ముత్యపు చిప్ప వంటిది. విలువైన ముత్యం ఏర్పడటానికి చిప్పే ఆధారం. కానీ ముత్యం లభించాక చిప్పకు విలువ ఉండదు. అలాగే విలువైన ఆత్మ గురించి తెలుసుకున్నవారు దేహానికి ప్రాధాన్యం ఇవ్వరు. దేహాభిమానం ఉన్నంత వరకు మోహసంద్రంలోంచి బయట పడలేరని వేమన కూడా హెచ్చరిస్తాడు.
భగవాన్ రమణమహర్షికి రాచవ్రణం లేచినప్పుడు ఆయన బాధపడలేదు. శరీరం మాత్రమే తన కర్మఫలాన్ని అనుభవిస్తోంది అనుకున్నారు. ఒకసారి వాసుదేవానంద సరస్వతి స్వామివారికి అతిసార వ్యాధి వచ్చినప్పుడు భక్తులు అడిగారట.. ‘ఎంతోమంది రోగులకు సాంత్వన కలిగించే మీరు వ్యాధితో బాధపడటమేమిటి స్వామీ’ అని. దానికి ఆయన ‘శరీరమే తాము అని భ్రమించేవారికి, బాధలను అధిగమించలేనివారికి ఉపశమనం అవసరం. ఆత్మస్వరూపులు ఇలాంటివాటికి చింతించరు. దేహాన్ని నేనుగా భావించడంలేదు’ అని సమాధానమిచ్చారట!
‘తనువు తనువటంచు దపియించు జనులార! తనువులు స్థిరమని తలపరాదం’టాడు వేమన. కేవలం ఇంద్రియాల ద్వారా లభించే సుఖాలకు అలవాటు పడి దేహమే నిత్యమనే భ్రాంతిలో బతుకుతుంటారు చాలామంది. ‘పచ్చికుండ వంటిది మేను’ అన్న తత్వకవుల హెచ్చరికలోని అంతరార్థాన్ని గ్రహించలేరు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మానవ రూపం లభిస్తుందంటారు పెద్దలు. దాన్ని భగవత్ ప్రసాదంగా స్వీకరించాలి. సద్వినియోగం చేసుకోవాలి. వ్యామోహాలు, రాగద్వేషాలు, భోగలాలస, ఇంద్రియ చాపల్యాలకు దూరంగా ఉండటమే దేహభ్రాంతి అనే భవరోగానికి దివ్యమైన ఔషధం.
#😃మంచి మాటలు
జీవిత లక్ష్యం
జీవిత లక్ష్యం ఏంటి? మానవ జీవితానికి ఏదైనా ప్రయోజనం, పరమార్థం ఉన్నాయా? ఈ మౌలిక ప్రశ్నలపై స్పష్టత వస్తే జీవితాన్ని సంఘర్షణారహితంగా, ఆనందమయంగా మలచుకోవచ్చు. జీవితాన్ని రెండు కోణాలనుంచి చూడవచ్చు. ప్రకృతిపరంగా చూస్తే మనిషి- ప్రాణికోటిలో ఓ భాగమంతే. ఇలా చూసినప్పుడు మానవ జీవితానికి ఒక నిర్దిష్ట లక్ష్యం, ప్రయోజనం లేవనే చెప్పాలి. జీవించడమే జీవిత లక్ష్యం!
ఇక ప్రపంచపరంగా చూస్తే- మనిషి ఈ నాగరిక సమాజంలో అంతర్భాగం. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, ఉద్యోగి, వ్యాపారి, దేశ పౌరుడు- ఇలా ఎన్నో పాత్రలు పోషిస్తాడు. ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు ప్రతి వ్యక్తికీ కొన్ని ఆశలు, ఆశయాలు ఉంటాయి. వాటిని సమర్థంగా నెరవేర్చడం ముఖ్యం. కానీ వాటినే జీవిత లక్ష్యాలుగా భ్రమపడతారు చాలామంది. అప్పుడు ఆ పాత్రల పరంపరే జీవితంగా తయారై ఆందోళన పెంచుతుంది. ప్రస్తుతం ఇదే అతిపెద్ద సమస్య. జాగ్రత్తగా గమనిస్తే- పోషించే పాత్ర, వయసు, కాలాన్ని బట్టి మనిషి ఆశలు, ఆశయాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ‘లక్ష్యం’ అనుకున్నది ఒకటి పూర్తవగానే మరొకటి కనిపిస్తుంది. అందుకే ప్రాపంచిక విషయాల్లో దేన్నీ జీవితలక్ష్యంగా, ప్రయోజనంగా పేర్కొనలేం.
ప్రకృతిపరంగా, ప్రపంచపరంగా కూడా ఏ లక్ష్యం, పరమార్థం లేకపోతే ఇక జీవించి ఉపయోగమేంటి అన్న కీలక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజానికి ఈ ప్రశ్న ‘అహం’ నుంచి పుడుతుంది. సంకుచితమైన మనసు నుంచి జనిస్తుంది. నిరంతరం భద్రత కోసం పాకులాడే మనసు- ఏదో ఒక పాత్ర పోషణలోనే నీ జీవిత పరమార్థం ఉందని భ్రమింపచేస్తుంది. ఇక్కడే మనిషి జీవితపు విశిష్టతను అర్థం చేసుకోవాలి. జంతువులు జంతువులుగా పుడతాయి, అలాగే మరణిస్తాయి. మేధస్సు, ఊహాశక్తి, స్వీయ ఎరుక ఉన్న మనిషి మాత్రమే సృజనాత్మకంగా ఉండగలడు. ఆధ్యాత్మికంగా ఎదగగలడు. సూర్యోదయాన్ని ఆస్వాదించగలడు. ఈ విశ్వ రహస్యాలను శోధించగలడు. ఇంతటి మహాద్భుతమైన జీవితాన్ని పూర్తిగా జీవించడమే జీవిత లక్ష్యం. ఏ ఇతమిత్థమైన అర్థమూ, లక్ష్యమూ లేకపోవటమే జీవితానికి అందం.
రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితులను పక్కన పెడితే- జీవితంలో దేన్నయినా కళాత్మకంగా మార్చవచ్చు, ఏ పనిలోనైనా సృజనాత్మకతను కనబరచవచ్చు. అభిరుచి ఉన్న రంగంలో లోలోతులకు వెళ్లే స్వేచ్ఛ ఉంటేనే మనిషి తనలో దాగి ఉన్న సృజనశక్తిని వెలికి తీయగలుగుతాడు. నిజమైన విద్య ప్రయోజనం అదే. శాస్త్రవేత్త అయినా, సంగీత విద్వాంసుడైనా, కార్మికుడైనా, కర్షకుడైనా- ఎవరైనా సరే, తమ వ్యాపకంలో, తమ సృజనాత్మక సాగరంలో మునిగినప్పుడే వర్తమానాన్ని ఆస్వాదించగలరు. తమదైన ముద్రతో సృజన చేయగలరు. అదే స్వీయాన్వేషణకు నాంది, ఆధ్యాత్మికతకు పునాది. అలా అస్తిత్వం ప్రసాదించిన విషయాల్లో తనదైన స్వధర్మాన్ని జోడించి మూసకు కట్టుబడకుండా ముందుకు సాగడమే జీవిత పరమార్థం. మనిషి ఆనందానికి అదే అసలైన మార్గం. #😃మంచి మాటలు










![😃మంచి మాటలు - ூ&.! పీల్చినా గాలి ವಂe తరిగిపోదు ]1 "నేల" అరిగిపోదు దున్నినా . ఎంత "3e ఎన్ని ఫలాలిచ్చినా గర్వపడదు ನಿರು ఎంత ఉరికినా అలసిపోదు 0[ కానీ, ఎప్పుడు ఎలా "చస్తాడో} ಇಲಿಯನಿ I ಮನಿಸ್ಟಿ కాస్తంత మాత్రం సంపాదించి ಅನಂಅವೌಡು లేడని ఎగిరెగిరి పడుతాడు . Datta Venkata Subbarau ூ&.! పీల్చినా గాలి ವಂe తరిగిపోదు ]1 "నేల" అరిగిపోదు దున్నినా . ఎంత "3e ఎన్ని ఫలాలిచ్చినా గర్వపడదు ನಿರು ఎంత ఉరికినా అలసిపోదు 0[ కానీ, ఎప్పుడు ఎలా "చస్తాడో} ಇಲಿಯನಿ I ಮನಿಸ್ಟಿ కాస్తంత మాత్రం సంపాదించి ಅನಂಅವೌಡು లేడని ఎగిరెగిరి పడుతాడు . Datta Venkata Subbarau - ShareChat 😃మంచి మాటలు - ூ&.! పీల్చినా గాలి ವಂe తరిగిపోదు ]1 "నేల" అరిగిపోదు దున్నినా . ఎంత "3e ఎన్ని ఫలాలిచ్చినా గర్వపడదు ನಿರು ఎంత ఉరికినా అలసిపోదు 0[ కానీ, ఎప్పుడు ఎలా "చస్తాడో} ಇಲಿಯನಿ I ಮನಿಸ್ಟಿ కాస్తంత మాత్రం సంపాదించి ಅನಂಅವೌಡು లేడని ఎగిరెగిరి పడుతాడు . Datta Venkata Subbarau ூ&.! పీల్చినా గాలి ವಂe తరిగిపోదు ]1 "నేల" అరిగిపోదు దున్నినా . ఎంత "3e ఎన్ని ఫలాలిచ్చినా గర్వపడదు ನಿರು ఎంత ఉరికినా అలసిపోదు 0[ కానీ, ఎప్పుడు ఎలా "చస్తాడో} ಇಲಿಯನಿ I ಮನಿಸ್ಟಿ కాస్తంత మాత్రం సంపాదించి ಅನಂಅವೌಡು లేడని ఎగిరెగిరి పడుతాడు . Datta Venkata Subbarau - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_938963_9e2de6_1774923934250_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=250_sc.jpg)


