*అలసిన వానిని ఊరడించు మాటలు*
🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞
*సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన*
*అనుదిన ధ్యానములు*
🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
*🌷🌷🌷జూన్ 28🌷🌷🌷*
*"అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును, నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత" (1 పేతురు 1:19)*
ప్రకటన 21 వ అధ్యాయములో మనము నూతన సృష్టిని గూర్చి చూచెదము. పాతవి గతించిపోయెను, గొర్రెపిల్ల భార్యయైన పరలోక యెరూషలేము పెండ్లి కుమార్తెగా దిగివచ్చెను. గొర్రెపిల్ల ద్వారా, ఆయన రక్తము ద్వారా ఆయన కొరకు భార్య సిద్ధపరచబడెను. ఎవరి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంధములో వ్రాయబడినవో, గొర్రెపిల్ల వెలుగులో ఎవరు నడచుకొనుచున్నారో, ఎవరైతే గొర్రెపిల్లను తమ పునాదిగా చేసికొనిరో వారి కొరకే ఆ పట్టణము సిద్ధపరచి బడినది. ఇక్కడ తలంపేమనగా, నూతన సృష్టి కొరకైన సంపూర్ణ సిద్ధపాటు కేవలము గొర్రెపిల్ల యందె కలదు. ప్రభువు యొక్క జీవము ఆయన రక్తములో కలదు. ఆ రక్తము ద్వారా మాత్రమే మనము కడుగబడి, శుద్ధి చేయబడి, పవిత్రపరచ బడితిమి. అందువలనే కెరూబులు ఎల్లప్పుడూ మందసము మీది కరుణాపీఠము మీద గల రక్తము వైపే చూచుచుండును.
నిర్గమ కాండము 25:18,20,21 లలో మందసమును గురించి చదువుదుము. ఆ మందసము యేసు ప్రభువును సూచించుచున్నది. ఆ మందసము తుమ్మకఱ్ఱతో చేయబడినది గాని, టేకుతో గాని, రోజ్ ఉడ్ తో గాని చేయబడలేదు. ఎందుకనగా యేసు క్రీస్తు ప్రభువు మన వంటి మానవుడు అయ్యెను. తుమ్మ కర్ర ప్రపంచములో అన్ని స్థలములలో దొరుకును. ప్రభువు పశువుల తొట్టిలో జన్మించి, మన కొరకు మానవ రూపమును దాల్చెను. తుమ్మ కర్ర యొక్క అర్ధము ఇదే. ఆ మందసము లోపలను, వెలుపలను బంగారముతో కప్పబడెనని చదువుదుము. ప్రభువు మానవ రూపములో నున్నప్పటికిని ఆయన పరిపూర్ణుడైన దేవుడు, స్వచ్ఛమైన మేలిమి బంగారము. ఆ మందసముపైన మేలిమి బంగారపు కరుణా పీఠము కలదు. ఆ బంగారము నుండియే కెరూబులు చేయబడెను. యేసు క్రీస్తు ప్రభువు యొక్క ఆ జీవమే తన ప్రజలకును ఇవ్వబడినది అది తెలియజేయుచున్నది. ఈ రెండు కెరూబులు సంఘమునకు గుర్తు మరియు ఒకే జీవమునందు యూదులు, అన్యజనులు ఏ విధముగా పాలిభాగస్థులు అయిరో మనకు చూపించుచున్నవి. "రెండు కెరూబుల మధ్య నుండి నేను నిన్ను కలిసికొందును" (22 వ) అని దేవుడు మోషేతో చెప్పెను. ఎఫెసీ. 1:23 లో దేవుని సంపూర్ణత ఆయన సంఘము నందు కలదనియు ఆ కెరూబులు దానికి గుర్తుగా ఉన్నవనియు చూచున్నాము. మనమందరము ఒకే జీవమును పంచుకొనుచున్నాము గనుక మనమందరము ఒకటిగా నగుదుము.
రక్తము ప్రోక్షింపబడిన ఆ కరుణాపీఠము వైపే ఆ కెరూబుల ముఖములు ఎడతెగక చూచుచున్నవని చెప్పబడినది. మనము కూడా మన కన్నులను రక్తము వైపే ఉంచవలెను. "నేను నీతో మాటలాడెదను. నిన్ను కలిసికొనెదను" అని ఆ కెరూబుల మధ్య నుండి దేవుడు చెప్పుచున్నాడు. ఇది అంతయు రక్తము వలననే సాధ్యపడును. కరుణాపీఠము మీద రక్తము లేని యెడల దేవుడు అక్కడ ఉండడు. దేవునితో సహవాసము, రక్తము ప్రోక్షించబడిన స్థలము నుండియే సాధ్యమగును. అప్పుడు దేవుని మహిమ దిగి వచ్చి, ఆ కెరూబుల మధ్యనుండి మాట్లాడెను. గొర్రెపిల్ల రక్తము ద్వారానే మనము కూడా దేవునితో సహవాసము కలిగి యుందుము.
గొర్రెపిల్ల ద్వారానే నిత్యత్వమునకు సంబంధించిన దేవుని తలంపులన్నియు బయలు పరచబడినవి. బైబిలులో అన్నిటి కంటెను రక్తమును గూర్చిన బోధయే ఎక్కువగా విమర్శించ బడుటను చూచుదుము. రక్తము చేత తాను ఓడించ బడునని సాతానుకు తెలియును. నీవు సమృద్ధి జీవమును అనుభవించ గోరిన యెడల ఆయన ప్రశస్త రక్తము యొక్క విలువను గూర్చియు, దేవుని గొర్రెపిల్లను గూర్చియు తెలిసికొనుటకు ప్రయత్నించుము. అప్పుడే నీవు నూతన సృష్టి, ఆ సృష్టిలో దేవుడు నీ కొరకు ఏర్పరచిన భాగమును గూర్చి, గొర్రె పిల్ల భార్యయైన వధువును గూర్చి అర్ధము చేసికొన గలవు. గొర్రెపిల్ల తన వధువుకు "గొర్రెపిల్ల భార్య" అని తన స్వంత నామమును పెట్టెను. అది తన సంఘము యెడల దేవునికి గల ప్రేమ యొక్క ఉన్నతమైన వివరణ. దేవుని జీవములో సంపూర్ణముగా భాగము పొంది, దేవుని నూతన సృష్టిలో భాగముగానై, ఆయన పాలివారముగా ఆయన ముఖ దర్శనము చేసికొనుచు, ఆయన మహిమను పంచుకొనుట, ఇది పర సంబంధమైన మర్మము, దైవిక ప్రేమ యొక్క మర్మము.
Please share
🙏🏼Praise the LORD.🙏🏼
#📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝